రాష్ట్ర విభజనపై కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ, వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో మిగిలిన పార్టీలను చిక్కుల్లోకి నెట్టి, తనపని తాను చేసుకుపోవడానికి స్కెచ్ సిద్ధం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే అసెంబ్లీని సమావేశ పరిచి రాష్ట్ర విభజనపై తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. కేంద్రంలో పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆరా తీసే లగడపాటి లాంటి నేతలు కూడా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతున్నారని చెబుతుండడంతో, కాంగ్రెస్ ఈ విషయాన్ని త్వరగానే తేల్చడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. రాష్ట్ర విభజనపై హైకమాండ్ మదిలో ఉన్న రెండు మూడు ప్రతిపాదనలను అసెంబ్లీ ముందుంచి, ఓటింగ్ కోరే అవకాశం ఉంది.
ఇందులో మొదటిది తెలంగాణను ఏర్పాటు చేయడం, రెండోది కర్నూలు, అనంతపురం, తెలంగాణ జిల్లాలతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు, మూడోది రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం. వీటిల్లో ఏ ప్రతిపాదనకు ఎన్ని ఓట్లు వస్తాయన్నది హైకమాండ్ పరిశీలించనుంది. ప్రస్తుతం తెలంగాణతో పోల్చితే, సీమాంధ్రలోనే ఎక్కువగా అసెంబ్లీ సీట్లు ఉన్నాయి కాబట్టి, ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగానే ఎక్కువ ఓట్లు పడొచ్చు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ విభజనను వ్యతిరేకించేవారే ఎక్కువ కాబట్టి, వారూ మొదటి రెండు ప్రతిపాదనలకూ వ్యతిరేకంగా ఓటు వేయొచ్చు. దీన్నిబట్టి చూస్తే, సమైక్యాంధ్రకే ఎక్కువ ఓట్లు రావచ్చు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామని, అయినా తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్లు చెబుతుండడం చూస్తుంటే, ఇందులో రాష్ట్ర ప్రయోజనాల కన్నా కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్దే ఎక్కువగా కనిపిస్తోంది.
అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే కాంగ్రెస్ నేతలు ప్రాంతాల వారీగా ఓట్లేస్తారు. సీఎం సమైక్యాంధ్రకే మొగ్గు చూపుతారు కాబట్టి, ఆయన దానికే ఓటేసే అవకాశం ఉంది. టీఆర్ఎస్, బీజేపీలు తెలంగాణకే సపోర్ట్ కాబట్టి వారికి ఏ ఇబ్బందీ లేదు. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాంతాలకు తగ్గట్లే ఓటేయవచ్చు. ఇక సమస్యల్లా టీడీపీ అధినేత చంద్రబాబుకు, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకే. వీరిద్దరూ ఏ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. తెలంగాణకు వీరిద్దరూ అనుకూలంగా ఓటేస్తే, సీమాంధ్ర ప్రజల నుంచి ప్రతిఘటను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమైక్యాంధ్రకు అనుకూలంగా ఓటేస్తే, తెలంగాణలో అడుగుపెట్టడానికి వీల్లేని పరిస్థితులూ ఎదురుకావచ్చు. ఏ రకంగా చూసినా కాంగ్రెస్ ఆడుతున్న చదరంగంలో పావులుగా మారిపోయారు ఈ ఇద్దరు నేతలు.
2, జులై 2013, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి