
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై మావోయిస్టుల కన్నేశారు. ఆయన్ను హతమార్చడానికి దాదాపు రెండుసార్లు ప్లాన్ వేశారు. ఒకటి ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటిదైతే.. మరోటి మాత్రం ఇటీవలదే. తాజా ఎన్నికలకు ముందే వైఎస్ను హతమార్చడానికి మావోయిస్టులు ప్లాన్ వేశారు. ఈ బాద్యతలు నిర్వహించింది మరెవరో కాదు.. ఇటీవలే ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన పటేల్ సుధాకర్రెడ్డి. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఇది కళ్లు చెదిరే వాస్తవం. శాంతి చర్చల పేరుతో.. తమను వైఎస్ మోసం చేశారన్నది నక్సల్స్ అభిప్రాయం. ఇదే సమయంలో మావోయిస్టు అగ్రనేతలంతా ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోవడంతో.. వైఎస్పై ప్రతీకారం తీర్చుకోవాలని మావోయిస్టులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే.. వైఎస్కు భారీ సెక్యూరిటీ ఉండడంతో మావోయిస్టులు ఆలోచనలో పడ్డారు. సెక్యూరిటీ తక్కువగా ఉండే ప్రాంతాలకోసం వెతకడం మొదలుపెట్టిన పటేల్ సుధాకర్రెడ్డికి.. ఇడుపులపాయ, ఢిల్లీలైతే.. తమ పని సులువవుతుందని భావించాడు. ఈ రెండు చోట్లా వైఎస్కు పెద్దగా సెక్యూరిటీ ఉండదు. రెక్కీ నిర్వహించడం కోసం.. ప్రత్యేక బృందాలను రెండు చోట్లకూ పంపించాడు. అంతా పూర్తయ్యింది. ఇక అసలు పని మొదలుపెడదామనుకున్న సమయంలో ఎన్నికలు అడ్డుగా వచ్చాయి. ఎన్నికల సమయంలో కూంబింగ్ చేసిన పోలీసులకు చిక్కిన ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులు ఈ వైఎస్ మర్డర్ ఆపరేషన్కు సంబంధించిన వివరాలు బయటపెట్టారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక్కొక్కటిగా వివరాలు బయటపడ్డాయి. దీంతో వైఎస్కు హుటాహుటీన సెక్యూరిటీని పెంచి, ప్రత్యేక నిఘా సిబ్బందిని వైఎస్ చుట్టూ మోహరించారు. కడపలో సానుభూతిపరుల ద్వారా.. పటేల్ ఆచూకీ తెలుసుకున్న పోలీసులు వలపన్ని.. ఎన్నికలవగానే పటేల్ను మట్టుబెట్టారు. పటేల్ను హడావిడిగా ఎన్కౌంటర్ చేయడానికి ఇదే కారణం అయిఉండొచ్చన్నది మావోయిస్టు సానుభూతిపరులు అభిప్రాయపడుతున్నారు. అన్నట్లు.. పీసీసీ అధ్యక్షుడిగా వైఎస్ ఉన్నప్పుడే ఆయన్ను చంపడానికి.. ఓ కల్వర్టు కింద నక్సల్స్ బాంబు పెట్టారు. వైఎస్ కారు వెళుతున్నసమయంలో పేల్చడానికి ప్రయత్నించినప్పటికీ.. అది పేలలేదు. తర్వాత దీన్ని రివ్యూ చేసుకున్న నక్సల్స్కు వైర్ను ఎలుకలు కొరికినట్లు గుర్తించారు. మొత్తంమీద రెండుసార్లు మావోయిస్టుల నుంచి రెండుసార్లు ప్రాణాపాయం తప్పించుకున్నారు వైఎస్.