
శతాబ్దాల తర్వాత.. కృష్ణమ్మ మహోగ్రరూపాన్ని ప్రదర్శించింది. కృష్ణమ్మ వచ్చిన వేగానికి... కర్నూలు, మహబూబ్నగర్, నల్గొండ, గుంటూరు, కృష్ణా.. ఇలా.. కృష్ణమ్మ ప్రవహించే.. జిల్లాలన్నీ తుడుచుకుపెట్టుకుపోయేంత వరదను తనతో మొసుకువచ్చింది. కానీ.. ఆ దూకుడుకు ముకుతాడు వేసి.. అపార నష్టాన్ని ఆపివేయగలిగింది.. శ్రీశైలం ప్రాజెక్టు. రాష్ట్రాన్ని మహావరద నుంచి రక్షించగలిగింది.
ప్రభుత్వ నమ్మకానికి.. అధికారుల ధైర్యానికి ప్రతీక నిలబడింది.. శ్రీశైలం ప్రాజెక్టు. రాష్ట్ర్రాన్ని మహా ఉత్సాతం నుంచి కాపాడి.. మరో రికార్డును తన ఖాతాలో జమచేసుకుంది. శతాబ్దకాలంగా.. ఎప్పుడూలేనంత ఉగ్రరూపంతో దూసుకొచ్చిన కృష్ణానదిని.. సమర్ధంగా అడ్డుకోగలిగింది.. ఈ ప్రాజెక్టు. శ్రీశైలం ప్రాజెక్టే గనక లేకపోతే... ఈ పాటికి.. కర్నూలు, మహబూబ్నగర్, నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో.. ఒక్క చీమ కూడా మిగిలి ఉండేది కాదన్నది అక్షర సత్యం. కానీ ఈ పరిస్థితి రానివ్వకుండా చేసిన ఘనత.. మన శ్రీశైలం ప్రాజెక్టుది. ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయక... ప్రమాదకర స్థాయి వరకూ శ్రీశైలం కృష్ణా వరదను.. శ్రీశైలంలోనే ఆపిన ఇంజనీర్లది. శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించేటప్పుడు.. గరిష్టంగా 19 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందన్న అంచనాతో డిజైన్ చేశారు. అప్పటివరకూ.. ఈ స్థాయిలో ఎప్పుడూ వరద రాకపోయినా.. ముందుజాగ్రత్తగా ఈ డిజైన్ చేశారు. కానీ.. ఈ సారి మాత్రం.. ఏకంగా 25 లక్షలకు పైబడి వరదనీరు శ్రీశైలాన్ని తాకింది. అయినా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ప్రజల భయాలను పటాపంచలు చేస్తూ.. సమర్థంగా.. ఈ వరద దాటిని తట్టుకొని నిలబడడమే కాకుండా.. కింది ప్రాంతాలకు ఎక్కువమొత్తంలో వరద నీరు వెళ్లకుండా.. నిల్వచేసుకోలిగిందీ ప్రాజెక్టు. అందుకే.. కర్నూలులో ఉన్నంత ప్రళయం... నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కనిపించడం లేదు.
కృష్ణా వరదను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఈ ప్రాజెక్టును.. జలవిద్యుదుత్పాదన కోసమే.. డిజైన్ చేశారు. కానీ.. రాష్ట్ర వ్యవసాయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని.. బహుళార్దసాధక ప్రాజెక్టుగా మార్చారు. 1963 జులైలో.. ఈ ప్రాజెక్టుకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. 1964లో దాదాపు 39.97 కోట్ల రూపాయలు దీని నిర్మాణానికి ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినా.. 1984లో నిర్మాణం పూర్తయ్యే నాటికి.. 567.27 కోట్ల రూపాయల వ్యయం అయ్యింది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 885 అడుగులు. అయినా.. 904 అడుగుల వరకూ నిల్వచేయగలిగే సామర్థ్యం ఉంది. ఈ స్థాయిని దాటితేనే.. ప్రాజెక్టు పై నుంచి వరద నీరు పొంగే ప్రమాదముంది. ఈసారి రికార్డు స్థాయిలో.. 25 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు పోటెత్తడంతో.. ప్రాజెక్టు తట్టుకోలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇంత మొత్తం వరదనూ... ఒకేసారి కిందకు వదలితే.. శ్రీశైలం దిగువ ప్రాంతాలతో పాటు.. నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలకు ముప్పు జరుగుతుందని.. 896 అడుగుల వరకూ నీటిని ఈ సారి అధికారులు పట్టి ఉంచారు. ఇంకా పెరుగుతుందనుకున్న తరుణంలో.. వరద తగ్గుముఖం పట్టడంతో.. శ్రీశైలంలో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది.
శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వసామర్థ్యం 263 TMCలే అయినప్పటికీ.. .. ఇందులో కేవలం 223 టీఎంసీలను మాత్రమే వాడుకొనే వీలుంటుంది. కర్నూలు, కడప జిల్లాల్లో.. దాదాపు 2 లక్షల ఎకరాలు ఈ ప్రాజెక్టు కింద సాగవుతున్నాయి. ఇక రాష్ట్ర విద్యుదవసారలను తీర్చుతూ.. కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా.. 1670 మెగావాట్ల పవర్ జనరేషన్ ఇక్కడ జరుగుతోంది. వరద కారణంగా.. ఇక్కడ ప్రస్తుతం విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.
ఇక 19 లక్షల క్యూసెక్కులను తట్టుకునేలానేలా డిజైన్ చేసినా.. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన స్థలం కారణంగా.. ఇంత భారీవరదను తట్టుకోగలగడం సాధ్య పడగలిగింది. ఈ ప్రాజెక్టుకు ఎర్త్డ్యాం ఉండదు.. ఈ ప్రాతను సహజసిద్ధమైన కొండలు నిర్వహిస్తున్నాయి. అందుకని దీనికి గండిపడే అవకాశం లేదు. ఇక ప్రాజెక్టు కొద్దిగా ఎగువ ప్రాంతం U ఆకారంలో మలుపు తిరిగి ఉంటుంది. ఫలితంగా ఎగువ ప్రాంతం నుంచి దూసుకువచ్చే.. వరదనీటివేగం ఇక్కడ తగ్గిపోతుంది. ఫలితంగా డ్యాంపై నేరుగా ఒత్తిడి పడదు. ఇక డ్యాంను పూర్తిగా కాంక్రీట్తో నిర్మించడమూ.. ప్రస్తుత భారీ వరదను తట్టుకోగలగడానికి కారణమయ్యింది. మొత్తంమీద మన సాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలవడమే కాకుండా.. మహా ఉత్పాతాన్ని నుంచి రాష్ట్రాన్ని కాపాడిన శ్రీశైలం ప్రాజెక్టుపై ప్రశంసల జల్లుకురుస్తోంది.