రాష్ట్రవిభజనపై కేంద్రం స్పీడు పెంచుతోంది. ఎవరు కాదన్నా....అవునన్నా తగ్గేది లేదని వడివడిగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో ఆటంకాలుగా భావించేవాటిని ఎదుర్కొని ఇబ్బందులు పడటం కంటే తప్పించడమే బెటర్ అనే ధోరణిలో వెళ్తోంది. ఇందులో భాగంగానే శాసనసభలో తెలంగాణ తీర్మానం లేకుండా చేయాలని ప్రభుత్వ పెద్దలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. గతంలో హోంమంత్రిత్వ శాఖ తయారు చేసిన షెడ్యూల్ ప్రకారం తొలుత రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపాలి.
అందుకు 40 రోజుల గడువు ఉంటుంది. ఆ తర్వాత నోట్ రూపొందించాలి. అనంతరం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని హోంమంత్రి గతంలో కాంగ్రెస్ కోర్కమిటీ ముందు ఓ నోట్ పెట్టారు. ఇప్పుడు సీమాంధ్ర జిల్లాలో తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతుండడం, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తీర్మానాన్ని అసెంబ్లీలో ఓడిస్తామని చెబుతుండడంతో, దాన్ని అటకెక్కించాలని భావిస్తోంది. అందుకే, తీర్మానంతో సంబంధం లేకుండా కేబినెట్ నోట్ ప్రవేశ పెట్టి, వెంటనే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. దీంతో అసెంబ్లీకి తీర్మానం వెళ్లదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే హోంమంత్రిత్వ శాఖ నోట్ ప్రకారం మంత్రుల బృందం నివేదిక గడువు 90 రోజులుంది. కానీ ప్రస్తుతం విడుదల చేసిన విధివిధానాల్లో మాత్రం కేవలం ఆరువారాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి కావాలని గడువు పెట్టారు. నవంబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టే అవకాశాలున్నందున .. ఈ బృందం వెంటనే పనిప్రారంభించి నవంబర్ చివరికల్లా నివేదిక ఇవ్వనుందని సమాచారం. ఈ కమిటీ ఇచ్చే సిఫార్సుల మేరకు బిల్లు తయారు చేసి రాష్ట్రపతికి పంపిన తర్వాతే దాన్ని అభిప్రాయ సేకరణ కోసం అసెంబ్లీకి పంపించే అవకాశాలున్నాయి.
కామెంట్ను పోస్ట్ చేయండి