కేంద్ర కేబినెట్ నిర్ణయంతో రగిలిపోతున్నారు సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంతో కాంగ్రెస్ హైకమాండ్ వెనక్కి తగ్గిందని భావిస్తున్న తరుణంలో ఏకంగా కేబినెట్ నోట్నే ఆమోదించడాన్ని చాలా అవమానంగా భావిస్తున్నారు. కేబినెట్ నిర్ణయం వెలువడగానే సీమాంధ్ర మంత్రులు శైలజానాథ్, ఏరాసు ప్రతాప్రెడ్డి, టీజీ వెంకటేశ్, గంటా శ్రీనివాసరావు, కాసు కృష్ణారెడ్డిలు సీఎం కిరణ్ను కలిసి చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు నిర్ణయం తీసుకుందని హైకమాండ్ తీరుపై మండిపడ్డారు సీమాంధ్ర మంత్రులు. ఇవాళ ఉదయం 11 గంటలకు సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు శైలజానాథ్. సీమాంధ్ర ఎంపీల వల్లే కేంద్రంలో యూపీఏ అధికారంలో కొనసాగుతోందని, అలాంటిది తమ ప్రాంత గొంతు కోసే నిర్ణయాన్ని పార్టీ తీసుకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఏరాసు. కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతాయని శపించారాయన.
శాసనసభలో తీర్మానం నెగ్గకుండా దేశంలో ఇంతవరకూ కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరగలేదని, ఒకవేళ అసెంబ్లీలో తీర్మానం ఓడిపోయినా తెలంగాణ ఏర్పాటు చేస్తే అది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమవుతుందన్నారు సీమాంధ్ర మంత్రులు. మంత్రి పదవులతో పాటు, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తామని, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడిస్తామన్నారు మంత్రి టీజీ.
రాజీనామాలపై ఇంతకాలం వేచిచూసే ధోరణిని అవలంభించిన మంత్రులు, టీనోట్కు కేబినెట్ ఆమోదం లభించడంతో తమ రాజీనామాల కోసం ఉద్యమకారుల నుంచి మరింత ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే శాసన సభలో తెలంగాణ తీర్మానం ఓడించాలి కాబట్టి, కేవలం మంత్రిపదవులకే రాజీనామాలు చేసి, ఎమ్మెల్యేలుగా కొనసాగాలని ఇంతకాలం నేతలు చెప్పుకొచ్చారు. అయితే, కేంద్రం తీర్మానాన్ని పక్కన పెట్టి నోట్ను తయారు చేయడంతో, ఏం చేయాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇవాళ జరిగే సమావేశంలో ఈ రాజీనామాలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామాలు చేస్తామని మంత్రులు బహిరంగంగానే చెబుతుండడంతో, వారు ఎటువైపు అడుగులు వేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఉన్న పార్టీల్లోకి మారతారా లేక, కొత్త పార్టీని ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమవుతారా అన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠను పెంచుతోంది.
కామెంట్ను పోస్ట్ చేయండి