ప్రపంచానికి పెద్దన్నగా అధికారం చెలాయిస్తున్నా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికాలో సరికొత్త సంక్షోభం మొదలయ్యింది. అర్థరాత్రి నుంచి అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూసుకుపోయాయి. ఉద్యోగులకు జీతాల చెల్లింపులు ఆగిపోయాయి. పెన్షనర్లకు ఇచ్చే భత్యాలు కూడా నిలిచిపోయాయి. దాదాపు 7 లక్షల మంది యూఎస్ ప్రభుత్వ ఉద్యోగులు ఈ సంక్షోభంలో చిక్కుకుపోయారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూసుకుపోవడంతో పన్ను చెల్లింపులు, ప్రజా సర్వీసులు ఆగిపోయాయి. దీంతో అమెరికన్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో ఇలాంటి పరిస్థితి ఏర్పడడం 17 ఏళ్లలో ఇదే తొలిసారి.
ఇంతపెద్ద సమస్య రావడానికి కారణం.. అమెరికా బడ్జెట్ ఆమోదం పొందకపోవడం. ఒబామా ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ కు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం లభించలేదు. ఈ సభలో రిపబ్లికన్ల బలం ఎక్కువ కావడంతో (రిపబ్లికన్లు-232, డెమోక్రాట్లు-200) ఒబామా ప్రతిపాదిత బడ్జెట్ ను అడ్డుకున్నారు. ఒబామాకేర్ గా ప్రచారం పొందుతున్న ఇన్సూరెన్స్ బిల్లును రిపబ్లికన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగిపోయి, కంపెనీలు మూతబడతాయని రిపబ్లికన్లు వాదిస్తున్నారు. రిపబ్లికన్లను ఒప్పించడానికి ఒబామా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరకు అర్థరాత్రి 11 గంటల సమయంలో కూడా బిల్లును పాస్ చేసి, సంక్షోభం రాకుండా బడ్జెట్ ను ఆమోదించాలని కోరినా, రిపబ్లికన్లు తమ పట్టు వీడలేదు. దీంతో, అమెరికా ప్రభుత్వ కార్యాలయాలు మూతబడక తప్పలేదు. అటు ఒబామా మాత్రం పేదప్రజలు, పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సమస్యను పరిష్కరించడానికి అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారాయన. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో బడ్జెట్ పాస్ అయితే తప్ప, మళ్లీ ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోవు. చెల్లింపులు మొదలుకావు. అమెరికా వీసాలు, పాస్ పోర్టులు జారీ కావు. గన్ లైసెన్సులు మంజూరు కావు. జాతీయ పార్కులు, మ్యూజియాలేవీ తెరుచుకోవు . 1995లో తలెత్తిన ఇలాంటి సంక్షోభ సమయంలో డిసెంబర్ 15,1995 నుంచి జనవరి6,1996 వరకూ అంటే 21 రోజుల పాటు ప్రభుత్వకార్యాలయాలు తెరుచుకోలేదు. దీనిబట్టి చూస్తే, ఈ సారి ఎంతకాలం పడుతుందన్నదానికి ఎవరూ స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నారు.
1, అక్టోబర్ 2013, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి