11, అక్టోబర్ 2012, గురువారం
డీకే ఢిల్లీ టూర్ వెనుక ఆంతర్యం?
పాలమూరు మంత్రి డీకే అరుణ ఢిల్లీ టూర్ రాజకీయవర్గాల్లో కొత్త చర్చను లేవదీసింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలను తీసుకుని ఢిల్లీకి వెళ్లి మంత్రి అరుణ.. అక్కడ సీనియర్ నేతలను, కేంద్రమంత్రులను,రాష్ట్రపతిని కలిశారు. కానీ, సోనియాను కలవాలన్న ఆమె ప్రయత్నం సఫలం కాలేదు. తెలంగాణ వాదాన్ని వినిపించడానికి, రాష్ట్ర విభజనపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పడానికి, మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి కోసం ఢిల్లీ వచ్చామని డీకే అరుణ తెలిపారు.
అయితే.. మంత్రులంతా కలిసి కట్టుగా ఢిల్లీకి వెళ్లాలని అనుకున్న సమయంలోనే, డీకే అరుణ ప్రత్యేకంగా హస్తినలో పర్యటించడం సంచలనం సృష్టిస్తోంది. కేవలం తెలంగాణ వాదంపైనే కాక, మహబూబ్ నగర్ జిల్లాపై తనకు పూర్తి పట్టుందని చాటిచెప్పుకోవడానికే హైకమాండ్ ముందు పరేడ్ చేసి ఉంటారని చాలామంది భావిస్తున్నారు. గతంలో మాజీమంత్రి జూపల్లితో డీకే అరుణకు తారాస్థాయిలో ఆధిపత్యపోరాటం సాగింది. ఒకేపార్టీకి చెందినవారైనా, ప్రతిపక్షనేతల్లా వీరిద్దరూ కలహించుకునేవారు. అయితే, తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నాన్చుడు ధోరణి నచ్చక ఆయన టీఆర్ఎస్ లో చేరడంతో అరుణకు అడ్డులేకుండా పోయింది. ఈలోగా నాగర్ కర్నూలు ఎంపీ మందాజగన్నాథం.. మంత్రికి పక్కలో బల్లెంలా మారిపోయాడు. ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తుండడం, తెలంగాణ కోసం టీకాంగ్ ఎంపీలు హైకమాండ్ నే ఎదిరిస్తుండడంతో, వారికి మద్దతు పెరుగుతుందన్న విషయాన్ని అరుణ గ్రహించారు. తెలంగాణకు తాము కూడా మద్దతు ఇస్తున్నా, తగినంత గుర్తింపు మాత్రం రావడం లేదని తెలుసుకున్న ఆమె, ప్రజల్లో తెలంగాణపై పోరాడుతున్న విషయం అందరికీ తెలియాలంటే, ఢిల్లీ పర్యటన ఒక్కటే మార్గమనుకున్నారు. వచ్చే ఎన్నికల్లో, తెలంగాణవాదం మరింత బలంగా పనిచేస్తుందన్న అంచనా ఉండడంతో, హడావుడిగా ఢిల్లీ పర్యటన చేపట్టారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
తెలంగాణ మంత్రులకు తమంతట తాము అధిష్టానం పెద్దలతో కలిసి తెలంగాణ వాదం వినిపించే దమ్ము, తెగువ ఉన్నాయా?
మహబూబ్ నగర్ జిల్లా ఎం.ఎల్.ఎ.లను, ఎం.ఎల్.సి.లను వెంట బెట్టుకొని వచ్చి రావాలని అధిష్టానం పెద్దలే ఆమెను పిలిచారు. తెలంగాణపై నిర్ణయం తీసుకొనే ప్రయత్నంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా వాసుల అభిప్రాయాలను తెలుసుకొందామని వారు ఆమెను ఆహ్వానించారు. దీనికి పూర్వం అధిష్టానం పెద్దలు కే.సి.ఆర్.తో జరిపిన చర్చల్లో ఆయన అన్న విషయం ఇందుకు ఆస్కారం కల్పించింది. చర్చల్లో ఆజాద్ " సీమాంధ్రులు మహబూబ్ నగర్ లో తెలాంగాణ వాదం లేదంటున్నారు. పైగా ఆ జిల్లా వాసులకు పక్కనే ఉన్న కర్నూల్ జిల్లా వాసులతో సత్సంబంధాలున్నాయి." అన్నప్పుడు - కే.సి.ఆర్. "లేదు - మహబూబ్ నగర్ లో తెలాంగాణ వాదం చాల బలంగా ఉంది. అక్కడ తెలంగాణ వాదం ఎత్తుకొన్న బి.జే.పి.ని కూడా గెలిపించారు. అలాగే, కర్నూల్ జిల్లా వాసులపై రాజోలి బండ వివాదం మూలంగా మహబూబ్ నగర్ జిల్లా వాసులు గుర్రుగా ఉన్నారు. కావాలంటే ఈ విషయాన్ని అక్కడి మీ ప్రజా ప్రతినిధులను పిలిపించుకొని కనుక్కోండి." అని బదులిచ్చారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. డి.కే.అరుణ ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని, మంత్రులందరిలో తానే ధైర్యం చేసినట్టుగా ఆర్భాటం చేశారు. మొత్తానికి సీమాంధ్రుల వితండ వాదం తప్పని అధిష్టానానికి తెలియ జెప్పడంలో మాత్రం ఆమె కృతకృత్యులయ్యారు.