12, నవంబర్ 2013, మంగళవారం
ఒక్క దుంపతో 40 రోజుల కరెంట్
ఇప్పటివరకూ జలవిద్యుత్, ధర్మల్ విద్యుత్, గ్యాస్ ఆధారిత విద్యుత్, పవన విద్యుత్, సోలార్ పవర్నే చూసిన వాళ్లు త్వరలోనే పొటాటో పవర్ను చూడబోతున్నారు. జెరూసలేంలోని హెబ్రూ యూనివర్సిటీలో జరుగుతున్న పరిశోధనలు ఫలిస్తే, విద్యుత్ అత్యంత చౌకగా అందుబాటులోకి రావడమే కాదు, విద్యుత్ లైన్లు వేయలేని ప్రాంతాల్లోనూ వెలుగులు విరజిమ్మించవచ్చు. అదీ అత్యంత తక్కువ ధరతో. బంగాళాదుంపల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేయగలగడమే దీనికి కారణం. ఒక్క బంగాళాదుంపతో ఓ ఎల్ఈడీ బల్బును 40 రోజుల పాటు వెలిగించవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. కిలో 20 రూపాయలు వేసుకున్నా, కనీసం కిలోకు ఆరు దుంపలు వస్తాయనుకున్నా, 240 రోజుల పాటు ఓ లైట్ను వెలిగించవచ్చు. ఇంటికి ఆరు లైట్లు వేసుకున్నా నెల కరెంటు బిల్లు ఖర్చు 20 రూపాయలు దాటదు. దీనికోసం పెద్దగా టెక్నాలజీ కూడా అవసరం లేదంటున్నారు ఈ ప్రయోగానికి నేతృత్వం వహిస్తున్న రాబినోవిచ్. రాగి రేకు, జింక్ రేకు ఉంటే చాలు. మీరెప్పుడైనా స్కూల్ స్థాయిల్లో జరిగే సైన్స్ ఫెయిర్స్కు వెళ్లుంటే, బంగాళా దుంప నుంచి ఈ రెండు రేకులు ఉపయోగించి, వాచ్లు, ఎల్ఈడీ లు వెలిగించడం చూసే ఉంటారు. ఇది కూడా అలాంటిదే కాకపోతే, మరింత మెరుగైన ప్రయోగమన్నమాట. ఏదేమైనా శాస్త్రవేత్తల ఈ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుందాం.. బహుశా అప్పుడు బంగాళాదుంపల ధర కొండెక్కి కూర్చుంటుందేమో..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి