26, జులై 2013, శుక్రవారం
వ్యూహాత్మకంగా విభజన అడుగులు
కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా రాష్ట్రాన్ని విభజించే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ త్రయాన్ని ఢిల్లీకి పిలిపించుకున్న హైకమాండ్ వారి నుంచి మరోసారి వివరణను తీసుకుంది. 15, జీఆర్జీ మార్గ్ లోని కాంగ్రెస్ వార్ రూమ్ లో సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స, డిప్యూటీ సీఎం రాజనర్సింహలతో విడివిడిగా సమావేశమై విభజన విషయంపై చర్చలు జరిపారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్, మంత్రి ఆజాద్. ఈ భేటీలో విభజన తప్పదంటూ సీఎంకు, పీసీసీ చీఫ్ కు వివరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విభజన వద్దని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సీఎం కిరణ్ దాదాపు 45 నిమిషాల పాటు తన వాదన వినిపించారు. తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలనూ ఆయన వివరించినట్లు తెలుస్తోంది. సీఎంతో భేటీ అనంతరం పీసీసీ చీఫ్ తో సమావేశమయ్యారు ఆజాద్, దిగ్విజయ్. దాదాపు అరగంట పాటు ఈ భేటీ సాగింది. కిరణ్, బొత్సలు విభజనపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆ విషయాన్ని మేడం సోనియా దగ్గరే తేల్చుకోవాలని దిగ్విజయ్ సూచించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం రాజనర్సింహ, పెద్దలతో భేటీ అయ్యారు. అందరికంటే సుదీర్ఘంగా రాజనర్సింహ దిగ్విజయ్, ఆజాద్ లతో చర్చలు జరిపారు. సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సలు లేవనెత్తిన సమస్యాత్మక అంశాలపై పూర్తిస్థాయిలో రాజనర్సింహ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్యాకేజీలు ఇవ్వడం పరిష్కారం కాదని, విభజనేతోనే సమస్య సద్దుమణుగుతుందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, క్లియర్ గా విషయాన్ని చెప్పకుండా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి ముగ్గురూ సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం ప్రధాని నివాసం జరిగే కోర్ కమిటీ భేటీలో సీడబ్ల్యూసీ సమావేశమయ్యే తేదీపై నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ పార్టీ. అందులోనే విభజనపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి