బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు ఆ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ ఎల్.కె.అద్వానీ. తన అభ్యంతరాలను చెత్తబుట్టలో పడేసి మరీ మోడీని ఎన్నికల ప్రచార సారధిగా నియమించడాన్ని ఆయన అణుమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే, బీజేపీ నేతలంతా మోడీకి పట్టం కట్టామన్న సంబరాల్లో మునిగితేలుతుంటే.. వాటన్నింటిని ఒకే ఒక్క లెటర్ తో చెదరగొట్టారు. పార్టీలోని పదవులన్నింటికీ రాజీనామా చేస్తూ, పార్టీ అగ్రనాయకత్వం తీరుపై తీవ్రవిమర్శలు చేస్తూ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు ఓ లేఖ రాశారు. శ్యాంప్రకాశ్ ముఖర్జీ, నానాజీ, వాజ్ పేయి లాంటి నేతల సిద్ధాంతాలకు, ఆశయాలకు బీజేపీ దూరం జరుగుతోందని ఆరోపించారు అద్వానీ. పార్టీ ప్రయోజనాల కోసం కాక కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాలకోసమే పాకులాడుతున్నారంటూ విమర్శించారు. అయితే, బీజేపీలో సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టం చేశారు కమల కురువృద్ధ నేత.
సిద్ధాంతాలు దూరమయ్యాయనా..? ప్రధాని పదవి దక్కదనా..?
బీజేపీ అగ్రనాయకత్వంపై అద్వానీ చేస్తున్న విమర్శలు, కొంతకాలంగా ఆయన వ్యక్తపరుస్తున్న అభ్యంతరాలు, ఆయన తీరును చెప్పకనే చెబుతున్నాయి. మోడీకి మొదట్నుంచి అండదండలు అందించి, ఇంతటివాడిని చేసిన అద్వానీ... జాతీయస్థాయిలో అతను ఎదగడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారన్నది వాస్తవం. ఓ రకంగా ఈ ఎన్నికలే అద్వానీ ప్రధాని కావడానికి చివరి అవకాశం. యూపీఏ పనితీరు బాగోలేదు కాబట్టి, ఈ సారి ఎన్డీఏకు ఎలాగైనా మెజార్టీ వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. కాకపోతే, బీజేపీ నేతలకు మాత్రం అద్వానీ నాయకత్వంపై ప్రస్తుతం నమ్మకం లేదు. యువతను, హిందుత్వవాదులను ప్రబలంగా ఆకర్షించగల మోడి మంత్రాన్నే ఎక్కువ మంది జపిస్తున్నారు. మోడిని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా బలమైన హిందూ ఓటు బ్యాంకును సాధించవచ్చని ఆశిస్తున్నారు. కానీ, మైనార్టీ ఓట్లపైనే బతికే బీజేపీయేతర పార్టీలు ఇందుకు మొదట్నుంచి అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. సరిగ్గా దీన్నే అస్త్రంగా మలచుకొని, కొంతకాలంగా మోడి విషయంలో విబేధిస్తూ వస్తున్నారు అద్వానీ. ముఖ్యంగా మోడి వల్ల బీజేపీకి విజయం దక్కితే ప్రధాని పదవి అద్వానికి ఏమాత్రం అందదు.
ప్రస్తుతం అద్వానీ రాజీనామా చేయడానికి కూడా ఇదే కారణంగా కనిపిస్తోంది. ఎందుకంటే, బీజేపీలో అద్వానీ కన్నా కరుడుగట్టిన హిందుత్వవాది మరొకరు లేదన్నది బహిరంగ సత్యం. రామ్ మందిర్ నినాదంతోనే బీజేపీకి జవసత్వాలు ఊదిన చరిత్ర అద్వానీది. మోడి కూడా హిందుత్వ విషయంలో అద్వానీ తర్వాతే అని చెప్పుకోవాలి. రధయాత్ర చేసినప్పుడు, ఎంతో వివాదాస్పదమైన రామ్ జన్మభూమి నినాదం తీసుకున్నప్పుడు.. అద్వానీకి ముఖర్జీ సిద్దాంతాలు గుర్తుకురాలేదా....? ఇప్పుడు మోడిని భుజాలపైకి ఎత్తుకునేసరికే అవన్నీ గుర్తుకువచ్చాయా....?
ఏమైనా రాజకీయాల్లో ఒక్కో అడుగు ఎక్కుతూ ఎంతో ఎత్తుకు చేరుకున్న అద్వానీ, ఈ విషయంతో మాత్రం తన చిన్నతనాన్ని చాటుకున్నారనే చెప్పాలి.
10, జూన్ 2013, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
chaala bagundi mee analysis.