22, ఫిబ్రవరి 2013, శుక్రవారం
ఐదు చోట్ల కాదు.. రెండు చోట్లే పేలుళ్లు.. 15 మంది వరకూ దుర్మరణం
Categories :
dilsuknagar blast . news . terrorist . TOP
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రద్దీగా ఉండే దిల్సుఖ్ నగర్లో రెండు చోట్ల బాంబు పేలుళ్లు వరసగా సంభవించాయి. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలనుంచి అంతా ఇళ్లకు వెళ్లే సమయాన్ని ఎంచుకున్న ఉగ్రవాదులు.. అత్యంత దారుణంగా పేలుళ్లకు ఒడిగట్టారు. కోణార్క్ థియేటర్ దగ్గర తొలి పేలుడు సంభవించిన కొంతసేపటికే, ఫుట్ఓవర్ బ్రిడ్జి దగ్గరున్న మోతేశ్వరీ కాంప్లెక్స్లోని ఓ సెల్ఫోన్ షాప్ దగ్గర రెండో బాబు పేలింది.
సైకిళ్లపై ఉంచిన రెక్సిన్ బ్యాగుల్లో బాంబులు పెట్టి పేల్చారు ఉగ్రవాదులు. పేలుడు దాటికి కొంతమంది అక్కడికక్కడే మృతి చెందారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో జనం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. పేలుడు కారణంగా కోణార్క్ థియేటర్ పరిసర ప్రాంతాలు భీతావహంగా మారిపోయాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
పేలుడు సంభవించిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు భారీగా సోదాలు నిర్వహించారు. గాయపడిన వారిని యశోదా, ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. వరుస పేలుళ్లు ఉగ్రవాదుల చర్యేనన్నారు డీజీపీ. రెండు చోట్ల IED బాంబులు పేల్చడం వల్లే భారీ ప్రాణనష్టం జరిగిందన్నారు. బాంబుల్లో మేకులతో పాటు.. ఐరెన్ బాల్స్ వాడినట్లు గుర్తించామన్నారు దినేశ్రెడ్డి.
అటు ఈ పేలుళ్లపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి. ఈ దారుణానికి ఒడిగట్టినవారికి పట్టుకుని శిక్షిస్తామన్నారాయన. పేలుళ్లు జరిగిన ప్రాంతానికి వెళ్లి.. వివరాలు తెలుసుకున్నారు. పేలుళ్లలో చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్రం 2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. క్షతగాత్రులకు కేంద్రం 50 వేలు, రాష్ట్రం 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ సహాయాన్ని అందిస్తామని తెలిపాయి. గాయపడిన వారికి పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే అత్యాధునిక వైద్యం అందిస్తామన్నారు సీఎం.
సీఎంతో పాటే హోంమంత్రి సబితారెడ్డి రెడ్డి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రులకు వెళ్లి గాయపడ్డవారిని పరామర్శించారు. ప్రజలు మనో ధైర్యంగా ఉండాలనీ... పుకార్లు నమ్మొద్దన్నారు సబితా ఇంద్రారెడ్డి . ఈ పేలుళ్ల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హుటాహుటీన రంగంలోకి దిగింది. పేలుళ్లు జరిగిన ప్రాంతాల నుంచి NIA టీమ్ ఆధారాలను సేకరించింది. దీనిపై హైదరాబాద్ పోలీసులు కూడా దర్యాప్తు మొదలుపెట్టారు.
NSG కి చెందిన పోస్ట్ బ్లాస్ట్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. ఢిల్లీ నుంచి అర్థరాత్రి హైదరాబాద్కు వచ్చిన ఈ బృదం నేరుగా దిల్సుఖ్నగర్కు వెళ్లి పూర్తి వివరాలను సేకరించింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి