6, అక్టోబర్ 2012, శనివారం
అల్లుడి గిల్లుడుతో సోనియా అవస్థలు
ఎవరేమన్నా లెక్కచేయని మనిషామె. విదేశీయురాలివని, పదవులు చేపట్టడానికి అనర్హురాలివంటే దేశం దుమ్మెత్తి పోసినా చలించని మనిషామె. ప్రభుత్వ సొమ్ము అప్పనంగా అనుభవిస్తున్నారని ఆరోపించినా పెదవి మెదపని మహిళామె. 1800 కోట్ల రూపాయల జనం సొమ్మును విదేశీ పర్యటనలకు వాడుకొన్నారని మోడీ ఆరోపించినా, పట్టించుకోని మనిషామె. కానీ, ఒకే ఒక్క విషయంలో మాత్రం చటుక్కున స్పందించారు. అది సరికాదంటూ ఖండించారు. ఆ విషయమే.. అల్లుడి గారి గిల్లుడు మ్యాటర్.. ఎంతైనా అల్లుడా మజాకా..!
రాబర్ట్ వాద్రాపై అరవింద్ కేజ్రీ వాల్ చేసిన విమర్శలకు కాంగ్రెస్ నేతల్లో ఎవరో ఒకరు సమాధానం చెబుతారులే అనుకుంటే, ఏకంగా అమ్మగారే స్టేట్ మెంట్ విడుదల చేశారు. వాద్రా వ్యాపారవేత్తని, ఆయనకు కుంభకోణంతో ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఎవరో అన్న మాటలకు అంత ఉలికిపాటు ఎందుకో..! తనను ఎన్ని అన్నా పట్టించుకోని సోనియాగాంధీ, అల్లుడిని చిన్న మాట అంటే... అంతెత్తున లేచారెందుకో ఎవరికీ అర్థం కాలేదు. ఈ కేసులో మరో విషయం ఏమిటంటే, ఇంతవరకూ అల్లుడుగారు, తనపై ఆరోపణలు వివరణ ఇచ్చుకోలేదు. అటు కేజ్రీవాల్ మాత్రం, మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. తన ఆరోపణలు తప్పని నిరూపించమని కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. పరువునష్టం దావాను ఎదుర్కోవడానికైనా సిద్ధమే తప్ప..తన మాటలను వెనక్కి తీసుకోనని ప్రకటించారు. అయినా.. అవుట్ లుక్ పత్రిక కొన్నాళ్ల క్రితమే వాద్రాకు, డీఎల్ఎఫ్ కు మధ్య కుదిరిన వ్యాపార ఒప్పందాన్ని కవర్ పేజీ సాక్షిగా ముద్రించింది. కానీ, ఇదో పెద్ద స్కామ్ అని ఊహించలేకపోయింది. వాద్రా ఎదిగిన విధానం గురించే ప్రముఖంగా ప్రచురించింది. ఇప్పుడు కేజ్రీవాల్ ఆ ఆరోపణలు చేయడంతో.. విషయం పెద్దదయ్యింది.
అల్లుడు నిజంగానే గిల్లాడా..?
ఎవరైనా ఆస్తులు అమ్మాలనుకుంటే ఏం చేస్తారు..? కాస్త లాభం వచ్చేలా చూసుకుంటారు. పైగా, పక్కా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నవాళ్లు, ఈ విషయంలో మరీ ముందుంటారు. ఒకవేళ లాస్ బిజినెస్ అంటే.. ఏ పది శాతాన్నో తగ్గించుకుని అమ్ముకుంటారు. కానీ వాద్రా విషయంలో మాత్రం డీఎల్ఎఫ్ మరీ ఉదారంగా వ్యవహరించింది. రూ. 25 కోట్ల విలువ చేసే పెంట్ హౌస్ ను కేవలం 89 లక్షలకే అమ్మింది. 35 కోట్లు విలువ చేసే ఫ్లాట్లను కేవలం 5 కోట్లకే ఇచ్చేసింది. డిఎల్ఎఫ్ హిల్టన్ గార్డెన్ లో సగం వాటాను ఇచ్చింది. దీని విలువే 150 కోట్లు ఉంటుందని అంచనా.
సరే ఎంతకోఅంతకు అమ్మిందని సరిపెట్టుకోవడానికీ లేదు.. ఎందుకంటే, ఇవన్నీ కొనుక్కోవడానికి, వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి వాద్రా గారికి, డీఎల్ ఎఫ్.. 65 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చింది. అదీ వడ్డీ లేకుండా. తన ఆస్తులను ఎదురుడబ్బు ఇచ్చి మరీ కొనిపించిందన్నమాట. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటిది జరుగుతుందా..? ఏమాత్రం లాభం లేకపోతే, డీఎల్ఎఫ్ ఇలా వ్యవహరిస్తుందా..? అందుకే.. డీఎల్ఎఫ్-వాద్రా లింకు ఇంత పెద్ద వివాదమయ్యింది. సోనియాకు తలనొప్పిగా మారింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి