భూగోళంపై జనవిస్పోటనం.. ఊహించడానికే సాధ్యం కానంతగా ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరిగిపోతోంది. అందులోనూ.. మనదేశం ప్రపంచ జనాభా పట్టికలో తొలిస్థానాన్ని అందుకోవడానికి పరుగులుపెడుతోంది. జనాభా పెరుగుదల మనకు లాభమా..? నష్టమా..? ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
జనం..జనం.. ప్రభంజనం.. ప్రపంచ జనభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 700 కోట్ల మార్కును దాటేసింది. 1987 జులై 11నాడు ఐదువందల కోట్ల మార్కును ప్రపంచ జనాభా చేరుకుంది. ఆ నేపథ్యంలోనే జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అంటే.. కేవలం 25 ఏళ్లలోనే మరో 200 కోట్ల మంది జనాభా భూమిపై చేరారన్నమాట. జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రపంచ నెంబర్ వన్ చైనా. ఎందులోనూ చైనాను ఎదుర్కోలేకపోతున్న భారత్.. ఈ జనాభా విషయంలో మాత్రం త్వరలోనే దాటేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 122 కోట్లున్న మన జనాభా... 2025 నాటికల్లా 139 కోట్లను దాటుతుందని అంచనా.. ప్రతీ నిమిషానికీ మనదేశంలో 51 మంది పుడుతున్నారు. కానీ చైనాలో మాత్రం ఈ పరిస్థితి లేదు. కఠినమైన కుటుంబనియంత్రణ పాలసీ అక్కడ అమలవుతుండడంతో.. జనాభా వృద్ధి చాలా వరకూ తగ్గిపోయింది. కానీ మనదగ్గర జనభా వృద్ధి క్రమేణా పెరుగుతూ వస్తోంది. అందుకే.. త్వరలోనే మనం ఈ విషయంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటాం.. కానీ.. ఇప్పుడున్న జనాభా అవసరాలనే ప్రభుత్వం తీర్చలేకపోతోంది. అలాంటి మరో 17 కోట్ల జనాభా అదనంగా చేరితే.. ఏమవుతుంది..? ఊహించడం కాస్త కష్టమే..
జనాభా విపరీతంగా పెరగడం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు అంతకన్నా ఎక్కువగానే ఉన్నాయి. నీటి నుంచి నిత్యావసరాల దాకా, ప్రతీ మనిషికి అందాల్సిన వాటా.. జనాభా పెరిగేకొద్దీ తగ్గిపోతుంటుంది. జనాభా పెరగడం వల్ల ఉత్పాదక శక్తి పెరిగినా.. ఆహార కొరత ఏర్పడుతుంది. భూమిపై ఉన్న సహజవనరుల వినియోగం అధికమవుతుంది. అయితే.. ఈ విషయంలో మాత్రం మనకు సానుకూలాంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే యువత ఎక్కువగా ఉన్నది మనదేశంలోనే. 10 నుంచి 24 ఏళ్ల వయసున్న వారు భారత్లో దాదాపు 35.8 కోట్ల మంది ఉన్నారు. 2020 నాటికి భారతీయుల సగటు వయస్సు.. 29 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా. ఇదే సమయంలో చైనా సగటు వయస్సు 37, జపాన్ సగటు వయస్సు 48 ఏళ్లు ఉంటుంది. ఓ రకంగా అప్పటికి యువభారతం ఆవిష్కృతమవుతుందన్న మాట..
ఈ యువతే.. మన దేశానికి అత్యంత ప్లస్ పాయింట్. మానవశక్తిలో అప్పుడు మనమే మొదటి స్థానంలో ఉంటాం. అయితే.. ఈ యువశక్తిని మన పాలకులు ఎలా ఉపయోగించుకుంటారన్నదే ఇక్కడ కీలకాంశం. వీరంతా ఇతర దేశాలకు వలసలు పోకుండా.. ఇక్కడే ఉండి.. దేశాభివృద్దికి పాటుపడేలా చేయాల్సిన గురుతరబాధ్యత పాలకులపై ఉంది. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే, పబ్బులు, పార్టీలు, మాదకద్రవ్యాలు, బీరుబాటిళ్లు, ప్రేమకథలు, సినిమాలు, షికార్లు.. ఒక్కటేమిటి యువతరం గాడి తప్పడానికి మన దగ్గర కావల్సినన్ని మార్గాలు ఉన్నాయి. కానీ, సరైన మార్గదర్సకత్వం చూపితే మాత్రం.. ఈ యంగ్ జనరేషన్.. ఇండియాను వరల్డ్ నెంబర్ వన్ చేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
11, జులై 2012, బుధవారం
జనాభాతో మనకు లాభమా..? నష్టమా?
Categories :
news . population . TOP . world . young india
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి