2, జులై 2011, శనివారం
శ్రీవారి సేవకు కార్పొరేట్ల పైరవీ
ఏడు కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడ్ని దర్శించుకోవడానికి రోజూ వేల సంఖ్యలో భక్తులు వెళతారు. ఎన్నో ఇబ్బందులు పడితేనే కానీ స్వామి దర్శనం కాదు. రూముల దగ్గర నుంచి.. ఆర్జిత సేవల వరకూ అన్నింటికీ తిప్పలు పడాల్సిందే. తిరుమల కొండపైకి అడుగుపెట్టే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండకూడదని సంకల్పించింది టీటీడీ. దీనికోసం శ్రీ సేవా పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే తిరుమలలోని అన్ని సేవలకు సంబంధించిన టికెట్లను ముందుగానే భక్తులు ఆన్లైన్లో పొందొచ్చు. స్వామి దర్శనం, గదులు, తలనీలాల సమర్పణకు సంబంధించిన టికెట్లన్నీ శ్రీ సేవా పథకంలో సింగిల్ విండో కౌంటర్లలో లభిస్తాయి. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించడానికి టీటీడీ టెండర్లు పిలిచింది. టెండర్ల స్వీకరణకు గడువు జూన్ 6తోనే ముగిసింది. సాఫ్ట్వేర్ కంపెనీల విజ్ఞప్తి మేరకు జూన్ నెలాఖరు వరకు గడువు పొడిగించింది. ఇప్పుడు అదీ ముగిసింది. అయినా.. కంపెనీల ఒత్తిడిమేరకు మరోసారి పెంచే యోచనలో ఉంది టీటీడీ.
ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును దక్కించుకోవడానికి...ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలు టీసీఎస్, విప్రో, ఐబీఎం, హెచ్.పి, మహీంద్రా టెక్, ఇన్ఫోసిస్ టెండర్లు వేశాయి. కాంట్రాక్ట్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ ప్రాజెక్టు దక్కితే ప్రపంచవ్యాప్తంగా మరింత పేరు తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో కొన్ని సంస్థలు ఢిల్లీస్థాయిలో పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం ఈ పథకం కోసం దేశంలో ఇప్పటివరకు వాడని నూతన సాఫ్ట్వేర్ను కొన్ని కంపెనీలు ఇప్పటికే రూపొందించాయి. ఆ వివరాల్ని ఆయా కంపెనీలు టీటీడీకి చెందిన ఎలక్ట్రానిక్ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకువెళ్లాయి. మరి ఎవరికి శ్రీవారి సేవ దక్కుతుందో.. ఎవరిని ఆ ఏడుకొండలస్వామి కరుణిస్తాడో వేచి చూడాల్సిందే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి