12, జులై 2011, మంగళవారం
కిశోర్ కు కేబినెట్ హోదా దేనికి సంకేతం?
రాష్ట్రానికి చెందిన కిశోర్ చంద్రదేవ్ కు కేబినెట్ హోదా ఉన్న పంచాయతీరాజ్, గిరిజనాభివృద్ధి శాఖలను కేటాయించారు ప్రధానమంత్రి. ఇంతవరకూ రాష్ట్రం నుంచి జైపాల్ రెడ్డి ఒక్కరికే కేబినెట్ హోదా ఉంది. దీనిపై సీమాంధ్ర నేతలు అవకాశం వచ్చినప్పుడల్లా మండిపడుతున్నారు. తమ ప్రాంతానికి కేబినెట్ హోదా ఇవ్వడం లేదంటూ చెప్పుకొస్తున్నారు. సమైక్య ఉద్యమంలో భాగంగా, అధిష్టానంతోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణకు ఒక్క సహాయమంత్రి పదవి లేకున్నా.. సీమాంధ్రకు నలుగురు సహాయమంత్రులు ఉన్నా వారు సంతృప్తి చెందలేదు. ఓ వైపు రాష్ట్ర విభజన విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం, అనూహ్యంగా కిశోర్ చంద్రదేవ్ కు పదవిని కట్టబెట్టింది. వాస్తవానికి నిన్నటి వరకూ కిశోర్ చంద్రదేవ్ పేరు ప్రచారం లేదు. ఆశావహుల్లో కావూరి పేరు ఎక్కువగా వినిపించింది. ఆయన ఎప్పటినుంచో మంత్రి పదవికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ, సమైక్య ఉద్యమంలో ఆయన పాత్ర ఎక్కువగా ఉండడం మైనస్ గా మారింది. ఉద్యమానికి దూరంగా ఉండే కిశోర్ చంద్రదేవ్ ను ఎంపిక చేయడం ద్వారా ఉద్యమాలతో హడావిడి చేసేవారికి పదవులు దక్కవన్న విషయాన్ని స్పష్టం చేసింది. అంతేకాదు, తెలంగాణ సమస్యకు పరిష్కారంగా మూడు అంశాలను పరిశీలిస్తున్న అధిష్టానం త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలోనే సీమాంధ్రకూ ఒక కేబినెట్ పదవిని అందించినట్లు తెలుస్తోంది. ప్రతిపాదన విషయమూ తమ దాకా వచ్చిందని తెలంగాణ నేతలూ ప్రకటించడం చూస్తుంటే, త్వరలోనే పరిష్కారం లభించే అవకాశమూ ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి