14, జూన్ 2011, మంగళవారం
కౌన్సిల్ కలకలం
తెలంగాణ ఉద్యమంతో తలపట్టుకున్న యూపీఏ సర్కార్.. సరికొత్త స్కెచ్ వేసింది. రాష్ట్రాన్ని విభజించకుండా.. ఉద్యమాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఏం చేయాలో పాలబోని కేంద్ర ప్రభుత్వానికి.. గూర్ఖాలాండ్ వ్యవహారం మంచి ఎనర్జీని ఇచ్చింది. అందుకే.. ఇప్పుడు అదే తరహా పరిష్కారాన్ని తెలంగాణ ముందు ఉంచాలనుకొంటోంది కేంద్ర ప్రభుత్వం... అదే స్వయంప్రతిపత్తి గల మండలి ఏర్పాటు.
తెలంగాణ విషయంలో ఏడాదిన్నరగా కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న దోబూచులాటకు ఇక తెరపడబోతోంది. తెలంగాణ అంశాన్ని అలానే వదిలివేస్తే.. మరింత జఠిలం అవుతుందనుకుంటున్న మన్మోహన్ సర్కార్.. సమస్యను పరిష్కరించడానికి ప్రత్యక్ష కార్యాచరణ మొదలుపెట్టినట్లే కనిపిస్తోంది. అందులో భాగంగానో ఓ ఫార్ములాను సిద్ధం చేసింది. దానికి అందర్నీ ఒప్పించడమే ఇక మిగిలి ఉంది. అదే.. అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు.
తెలంగాణ తరహాలోనే ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన గూర్ఖాల్యాండ్ ఉద్యమానికి కౌన్సిల్ ఏర్పాటుతోనే శుభం కార్డు పడింది. అందుకే.. ఇదే ప్లాన్ను తెలంగాణకు అమలు చేయాలనుకొంటోంది కేంద్ర ప్రభుత్వం. దానికోసమే కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రాన్ని విభజించకుండా.. అటానమస్ కౌన్సిల్ను తెరపైకి తెస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అంతర్భాగంగా ఉంటూనే.. దాని పరిపాలన వ్యహారాలు చక్కబెట్టడానికి ప్రత్యేకంగా ఓ మండలిని ఏర్పాటు చేస్తారు. దీనికి స్వయంప్రతిపత్తి ఉంటుంది. అంటే.. ఓ రకంగా తెలంగాణకు స్వయం పాలన ఇవ్వడం అన్నమాట. అయితే.. రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలన్నీ దీనికి ఉండవు. చట్టాలు రూపొందించే అధికారం ఉండదు. కేవలం వనరుల వినియోగంపైనే హక్కులుంటాయి.
తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సుముఖంగా లేరంటూ వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణను విభజించకుండా.. అటామనస్ కౌన్సిల్ ఏర్పాటుకు పావులు కదులుతున్నాయి. త్వరలోనే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయొచ్చు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొంటామంటూ చాలాకాలంగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్న తీరు చూస్తుంటే... కౌన్సిల్ ఏర్పాటుకే శ్రీకారం చుట్టొచ్చనిపిస్తోంది.
కాంగ్రెస్ సిద్ధమేనా..?
తెలంగాణ కోసం ప్రత్యేకమండలిని ఏర్పాటు చేయాలనుకొంటోంది కేంద్రం. రాష్ట్రంలో ఇరు ప్రాంతాల వారికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం ఇదిమాత్రమే అని భావిస్తోంది. కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ కూడా ఈ దిశగా సూచన చేయడంతో.. కేంద్రం ముందడుగు వేస్తోంది. రాష్ట్రాన్ని ఉమ్మడిగానే ఉంచుతూ.. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి నిర్ధిష్టమైన రాజ్యాంగ రక్షణలు కల్పించడంతో పాటు, రాజకీయ సాధికారత కోసం చట్టబద్దమైన తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ కమిటీ ఆరో సిఫార్సులో ఉంది. ఈ నిబంధననే అమలు చేయాలంటూ కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు కూడా చెప్పడంతో.. కేంద్ర ప్రభుత్వం ఆ దిశలోనే కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణ సమస్య సంక్లిష్టమంటూ ఇటీవలే గులాంనబీ ఆజాద్ చెప్పడం.. బొత్స ప్రమాణస్వీకారం సందర్భంగా జాతీయవాదులమంటూ కేంద్రమంత్రి జైపాల్రెడ్డి వ్యాఖ్యానించడం... ఇందులో భాగమే కావచ్చు.
తెలంగాణకు ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేసి, దాని ద్వారానే ఈ ప్రాంతంలో పాలన కొనసాగించే అవకాశాలుంటాయి. దీన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ నేతలను ఒప్పించడానికి హైకమాండ్ ప్రయత్నించవచ్చు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా లేదన్న విషయాన్ని ఇప్పటికే పార్టీ నేతలకు సూచనప్రాయంగా వెల్లడించారంటూ ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే, ఇప్పట్లో రాష్ట్ర విభజన జరగడం దాదాపు అసాధ్యమే. దాని బదులు, ప్రాంతీయ మండలి ఏర్పాటే తెరపైకి రావచ్చు. సోనియా చెబితే... తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎవరూ దీన్ని వ్యతిరేకించకపోవచ్చు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ గులాంనబీ ఆజాద్.. స్వదేశానికి రాగానే దీని ఏర్పాటుకు అడుగులు పడొచ్చు. కాంగ్రెస్ నేతల ముందు ఆజాద్.. కౌన్సిల్ ప్రతిపాదనను ఉంచే అవకాశాలున్నాయి. అందర్నీ ఒప్పించే బాధ్యతనూ ఆజాదే చేపట్టవచ్చు. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం సమావేశం కాబోతున్నారు. ప్రత్యేక మండలి విషయాన్ని ఎంపీలతో ఆయనా చెప్పే అవకాశాలున్నాయి.
కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు... కేంద్ర ప్రతిపాదనకు ఒప్పుకుంటే.. కౌన్సిల్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.ఆ తర్వాత టీఆర్ఎస్ను ఒప్పించడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలుపెడుతుంది. దానికీ ఇప్పటినుంచే వ్యూహం రచిస్తోంది. 2014 ఎన్నికల వరకూ ఈ ప్రతిపాదనకు అంగీకరించమని టీఆర్ఎస్ను కోరవచ్చు. తెలంగాణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పాలకమండలిలో ఛాన్స్ ఇస్తామనీ ఒప్పించవచ్చు. టీఆర్ఎస్ కూడా కేంద్ర ప్రతిపాదనకు ఒప్పుకుంటే.. తెలంగాణ అటానమస్ కౌన్సిల్ ఏర్పాటుకు అడ్డంకులు పూర్తిగా తొలిగిపోయినట్లే. టీడీపీ తెలంగాణ ఫోరం మాత్రం మండలి ఏర్పాటుకు ఒప్పుకోమంటోంది. అయితే.. టీడీపీ వ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వం పెద్దగా లెక్క చేయకపోవచ్చు.
బెంగాల్లో ఏం జరిగింది.?
ప్రత్యేక రాష్ట్రం కోసం దాదాపు రెండున్నర దశాబ్దాలుగా పోరాడుతున్నారు గూర్ఖాల్యాండ్ ప్రజలు. 1980ల్లో సుభాష్ ఘీసింగ్ నేతృత్వంలోని గూర్ఖా లిబరేషన్ ఫ్రంట్ ప్రత్యేక రాష్ట్రం కోసం తీవ్రంగా పోరాడింది. ఆందోళనలు హింసాత్మకం అయ్యాయి. ఈ పోరాటంలో దాదాపు 1200 మంది వరకూ చనిపోయారని అంచనా. దీంతో.. కేంద్రంతో సుభాష్ ఘీసింగ్ ఓ ఒప్పందాన్ని చేసుకుని పోరాటాన్ని ఆపేశారు. ఆ ఒప్పందంలో భాగంగా తెరపైకి వచ్చిందే.. డార్జిలింగ్ గూర్ఖా హిల్ కౌన్సిల్. అయితే.. గూర్ఖాల్యాండ్ ప్రజల ఆశలను నెరవేర్చడంలో ఇది విఫలం కావడంతో 2005లో మరోసారి తిరుగుబాటు మొదలయ్యింది. సుభాష్ ఘీసింగ్ అనుచరుల్లో కీలకమైన బిమల్ గురంగ్.. కౌన్సిల్కు వ్యతిరేకంగా పెద్ద పోరాటాన్ని లేవదీశారు.
తెలంగాణలో మలివిడత పోరాటం మొదలుకావడం.. ఉధృతంగా సాగడం.. కేంద్రం వెంటనే స్పందించడం చూసిన తర్వాత.. గూర్ఖా ఉద్యమకారుల్లో మళ్లీ ఆశ చిగురించింది. కౌన్సిల్ కన్నా.. ప్రత్యేక రాష్ట్రమే కావాలంటూ గూర్ఖా జనముక్తి మోర్చా డిమాండ్ చేసింది. భారీగా ర్యాలీలు నిర్వహించింది. తెలంగాణ ఉద్యమం తరహాలోనే పోరాటం సాగించింది. విద్యార్థులను, న్యాయవాదులను, ఉద్యోగులను.. అందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసింది.. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ముందుకు కదిలింది.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించడానికి, తెలంగాణతో పాటే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడానికి ఒప్పించేందుకు తీవ్రంగానే ప్రయత్నించింది. అయితే.. ఇవేవీ పూర్తిస్థాయిలో సత్ఫలితాలను ఇవ్వలేదు. తెలంగాణ విషయంలో కేంద్ర హోమంత్రి చిదంబరం ప్రత్యేకంగా ప్రకటనలు చేయడం.. శ్రీకృష్ణ కమిటీని కేవలం ఆంధ్ర ప్రదేశ్కే పరిమితం చేయడం.. గూర్ఖాల్యాండ్ వాసుల్లో నిరాశను నింపాయనే చెప్పొచ్చు. కానీ, వారు పోరాటాన్ని మాత్రం ఆపలేదు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, గూర్ఖాజనముక్తి మోర్చా అభ్యర్థులే డార్జిలింగ్లోని మూడు సీట్లలో విజయం సాధించడం చూస్తే.. ఇప్పటికీ ప్రజల్లో ప్రత్యేకవాదం బలంగా ఉందన్న విషయం అర్థమవుతుంది. అయితే.. మూడున్నర దశాబ్దాల వామపక్ష కంచుకోటను బద్ధలుకొట్టిన మమతా బెనర్జీ.. గూర్ఖాల్యాండ్ విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. గూర్ఖాల్యాండ్ ఉద్యమకారులతో ప్రత్యేకంగా సమావేశమైన దీదీ.. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ సమసిపోయిందని సంచలన ప్రకటన చేసారు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
గూర్ఖాల్యాండ్ సమస్యను పరిష్కరించడంలో బెంగాల్ సీఎం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను వదులుకుంటే.. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తామన్నది మమత హామీ. దీదీ కారణంగా బెంగాల్లో మార్పు వస్తుందని భావించిన గూర్ఖాలు.. దీనికి ఒప్పుకున్నారు. అంతేకాదు.. ఇంతవరకూ అమల్లో ఉన్న కౌన్సిల్ను కూడా ప్రక్షాళన చేయబోతున్నారు. పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూస్తామని మమత ప్రకటించారు. దీంతోపాటు.. డార్జిలింగ్ను స్విట్జర్లాండ్లా మార్చుతామని బెంగాల్ కొత్త సీఎం చెప్పడమూ గూర్ఖాల్యాండ్ ఉద్యమకారుల్లో మార్పు తెచ్చింది. అందుకే.. మూడు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాన్ని పక్కన పెట్టారు. బెంగాల్ జెండా కిందే అభివృద్ధి చెందడానికి సిద్ధమయ్యారు.
అయితే.. గూర్ఖాజనముక్తిమోర్చా.. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడంపై ఇతర గూర్ఖా పార్టీలు కస్సుబుస్సుమంటున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి జీజేఎం కట్టుబడి లేదంటూ విమర్శిస్తున్నాయి. పరిస్థితి చూస్తుంటే.. మిగిలిన పార్టీలన్నీ కలిసి మరో ఉద్యమాన్నిసృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ పార్టీలను మమతా బెనర్జీ ఎలా బుజ్జగిస్తారన్నదానిపైనే.. గూర్ఖాల్యాండ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
కలకలం
తెలంగాణకు కౌన్సిల్ ఏర్పాటు తథ్యమన్న వార్తలు వెలువడ్డ నేపథ్యంలో ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు మొగ్గుచూపడంలేదన్న విషయమూ బయటకు పొక్కడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం ఢిల్లీలో చిదంబరం, ప్రణబ్లను కలిసినప్పుడు ఈ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. దీనిపై క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
డార్జిలింగ్ తరహా పరిష్కారం తెలంగాణకు ఆమోదయోగ్యం కాదంటున్నారు కాంగ్రెస్ ఎంపీలు. తెలంగాణ ఆకాంక్ష వెనుకున్న నేపథ్యానికి, గూర్ఖాలాండ్ ఉద్యమానికి పోలికే లేదంటున్నారు. అంతేకాక... డార్జిలింగ్ తరహాలో ప్రాంతీయమండళ్లను తెలంగాణ విషయంలో ఎప్పుడో విఫలమయ్యాయన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
మరోవైపు.. అటానమస్ కౌన్సిల్ వ్యవహారంతో కాంగ్రెస్ వైఖరి తేటతెల్లమయ్యిందని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడానికే దీన్ని తెరపైకి తెస్తున్నారంటోంది. పెద్దమనుషుల ఒప్పందం.. ఆరుసూత్రాల పథకాన్ని నీరు గార్చినట్లే.. దీని విషయంలోనూ వ్యవహరిస్తారని అంచనా వేస్తున్నారు..
ప్రత్యేక రాష్ట్రం కోసమే తీవ్రంగా పోరాడుతున్న టీఆర్ఎస్ కూడా దీనికి ఎంతవరకూ ఒప్పుకుంటుందన్నదీ ప్రశ్నార్థకమే. మరోసారి మోసపోతున్నామని తెలంగాణవాదులు భావిస్తే మాత్రం.. ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుంది. దీనికి తోడు.. ప్రాంతీయ మండళ్లకు చట్టబద్ధమైన రక్షణలు కల్పించాలంటే మాత్రం రాజ్యాంగాన్ని సవరించాలి. దీనికి మూడింట రెండొంతుల మెజార్టీ ఉంటేనే సాధ్యమవుతుంది. మరి.. తెలంగాణ విషయంలో పార్లమెంట్లో పూర్తిబలం లేదని వాదిస్తున్న యూపీఏ సర్కార్కు.. ఈ విషయంలో ఎలా నెగ్గుకొస్తుంది.? రాజ్యాంగబద్ధమైన కౌన్సిల్ను ఎలా ఏర్పాటు చేస్తుంది? ఇది కూడా అంత సులువైన వ్యవహారమేమీ కాదు..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి