24, ఆగస్టు 2011, బుధవారం
అన్నా దీక్ష విరమిస్తారా..?
Categories :
anna hazare . news . TOP
అన్నా డిమాండ్లను కేంద్రం అంగీకరిస్తుందా..?
అన్నా హజారే దీక్ష విరమిస్తారా..?
విషమిస్తున్న అన్నా ఆరోగ్యం..
సర్కార్ ఏం చేస్తుంది..?
జన్లోక్పాల్ బిల్లుకోసం అన్నా హజారే చేస్తున్న దీక్ష తొమ్మిదవరోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం క్రమంగా విషమిస్తోంది. కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకింది. వెంటనే ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. కానీ హజారే మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. కానీ, ఆస్పత్రికి మాత్రం వెళ్లేది లేదని తేల్చి చెప్పారు.
అన్నా ఆరోగ్యం విషమించడంతో కంగారుపడ్డ మన్మోహన్ సర్కార్.. చర్చల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రణబ్ ముఖర్జీ, సల్మాన్ ఖుర్షీద్లను రాయబారానికి దింపింది. అన్నా బృందాన్ని చర్చలకు ఆహ్వానించింది. ప్రణబ్ టీంతో అరవింద్ కేజ్రీవాల్, కిరణ్బేడి, ప్రశాంత్ భూషణ్లు మూడుగంటలకు పైగా చర్చలు జరిపారు. జన్లోక్పాల్ను కూడా స్టాండింగ్ కమిటీకి పంపిస్తామంటూ ప్రధాని హామీతో కూడిన లేఖను ప్రణబ్.. అన్నా టీంకు అందించారు. అయితే ఈ ప్రతిపాదనను అన్నా బృందం తిరస్కరించింది. తమ బిల్లును పార్లమెంట్లోనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది.
ప్రధానిని లోక్పాల్ బిల్లు పరిధిలోకి తెచ్చే విషయంలో కేంద్రానికి పెద్దగా వ్యతిరేకత లేదని అన్నా టీం అంటోంది. కానీ.. మూడు విషయాల్లో మాత్రం అన్నాటీంకు.. సర్కార్కు మధ్య ప్రతిష్టంభన నెలకొంది. తొలిరోజు చర్చలు పూర్తిగా సఫలం కాకపోవడంతో ఇవాళ కూడా మరోసారి అన్నాటీం.. ప్రణబ్ బృందంతో భేటీ కానుంది. తొలి రోజు చర్చల సారాంశాన్ని ప్రణబ్.. ప్రధానికి తెలియజేశారు. కాంగ్రెస్ కోర్ కమిటీ కూడా అత్యవసరంగా భేటీ అయ్యి అన్నా టీం డిమాండ్లపై చర్చించింది. ఇవాళ అఖిల పక్ష భేటీలోనూ వీటిపై చర్చించనున్నారు. అన్ని డిమాండ్లకు అంగీకరిస్తేనే దీక్ష విరమిస్తానని అన్నా బెట్టు చేస్తుండడంతో.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి