27, మే 2011, శుక్రవారం
బాబుగారి వారసుడు
Categories :
టీడీపీ ఫ్యూచర్ లీడర్ ఎవరు?
జూనియర్ ఎన్టీఆరా..? నారా లోకేశా..?
2009 ఎన్నికల్లో జూనియర్ దూకుడు చూసిన వారంతా.. భవిష్యత్తులో పార్టీ పగ్గాలు చేపట్టేది ఎన్టీఆరే అనుకున్నారు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. సైలెంట్గా స్కెచ్ వేసిన లోకేశ్.. ఈ విషయంలో ఎన్టీఆర్ను దాటేశాడు.. పార్టీ పగ్గాలు చేపట్టడానికి సిద్ధమైపోతున్నాడు. చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఎన్టీఆర్కు దక్కకపోవచ్చు. ఆ స్థానాన్ని లోకేశ్ దక్కించుకోవచ్చు. అందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబు వారసుడిగా, టీడీపీ అధ్యక్షుడిగా లోకేశ్ని ప్రకటించే రోజులు త్వరలోనే వస్తాయన్నది టీడీపీ నేతల అంచనా.
లోకేశే తన రాజకీయ వారసుడని చంద్రబాబు ఇంతవరకూ ప్రకటించలేదు. కానీ, టీడీపీలోని కార్యకర్తలు మాత్రం అదే జరుగుతుందనుకుంటున్నారు. త్వరలోనే బాబు నోట ఈ ప్రకటన వెలువడచ్చన్న అభిప్రాయం ఎక్కువమంది నేతల్లో కనిపిస్తోంది. దీనికోసమే చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు మాత్రం, ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నారు. తమ నేత నారా లోకేశే అని ప్రకటించుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గ బాధ్యతలను లోకేశ్కు అప్పజెప్పమంటూ పార్టీ సమావేశంలో తీర్మానం కూడా చేశారు. చిత్తూరు జిల్లా టీడీపీ మీటింగ్లోనూ దీనికి ఆమోదం లభించింది. ఇక మిగిలింది.. పార్టీ అధిష్టానం నిర్ణయమే. అంటే ఇప్పుడు తేల్చాల్సింది చంద్రబాబే అన్నమాట.
చంద్రగిరి నుంచి చంద్రబాబు పీఠానికి
లోకేశ్ రాజకీయ భవిష్యత్తుకు చంద్రగిరిలో పునాదులు పడబోతున్నాయి. చంద్రబాబు చెప్పకుండానే, నియోజకవర్గ తెలుగుదేశం నేతలు ఆ పని కానిచ్చేస్తున్నారు. కానీ, దీనికి చంద్రబాబు ఎంతవరకూ అంగీకరిస్తారన్నదే సస్పెన్స్. కొడుకును రాజకీయనేతగా చేస్తామంటే.. వద్దనే తండ్రి ఉంటారా..? అన్న అనుమానం మీకు రావచ్చు. కానీ, చంద్రబాబు ఆలోచనలు వేరు. ఎందుకంటే.. అది చంద్రగిరి నియోజకవర్గం.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకస్థానం ఉంది. చంద్రబాబు నాయుడి రాజకీయ జీవితానికి పునాది పడింది ఇక్కడే. 1978లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గం నుంచే గెలుపొందారు. తెలుగుదేశంలో చేరిన తర్వాత కుప్పం నియోజకవర్గానికి మారినా, చంద్రబాబు కుటుంబానికి చంద్రగిరిలో పట్టుంది. ఆయన సోదరుడు రామ్మూర్తినాయుడు 1994లో ఎమ్మెల్యేగా ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రాజకీయరంగ ప్రవేశానికి ఎదురుచూస్తున్న లోకేశ్ను కూడా ఇక్కడినుంచే అరంగేట్రం చేయించాలన్న అభిప్రాయం చంద్రగిరి నేతలది. సొంత ప్రాంతం కావడంతో, లోకేశ్కు త్వరగా పట్టుచిక్కుతుందని, నియోజకవర్గంలో పట్టుసాధించగలరన్న నమ్మకం తెలుగు తమ్ముళ్లది. ఇప్పుడు ఇంఛార్జ్గా నియమించాలన్న తీర్మానానికి కారణం ఇదే.
చంద్రబాబు సొంతూరు చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉన్నా, అక్కడ పూర్తిస్థాయిలో టీడీపీ పట్టు సాధించలేకపోతోంది. రాష్ట్ర మంత్రి గల్లా అరుణ కుమారి చంద్రగిరి నుంచే నాలుగుసార్లు ఎన్నికయ్యారు. 1999,2004,2009లో గెలుపొంది హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశారు. గత ఎన్నికల్లో సినీనటి రోజాను బరిలోకి దించినా టీడీపీ గెలుపొందలేకపోయింది. దీంతో, టీడీపీ శ్రేణుల్లో నిరుత్సాహం పెరిగిపోయింది. ఈ ప్రాంతంలో మళ్లీ తెలుగుదేశం బలం పుంజుకోవాలంటే.. లోకేశ్కు బాధ్యతలు అప్పజెప్పడమే మార్గమంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
చంద్రగిరి నియోజకవర్గ బాధ్యతలను చేపట్టడం నారా లోకేశ్కు కత్తిమీద సామే. అక్కడ మంత్రి గల్లాకే పట్టెక్కువ. కాంగ్రెస్ కంచుకోటగా మారిన చంద్రగిరిని.. టీడీపీ పరం చేయాలంటే చాలా కష్టపడాలి. అది చంద్రబాబుకే చాలాకాలంగా సాధ్యం కావడం లేదు. మరి లోకేశ్కు సాధ్యమవుతుందా..? ప్రస్తుతం స్థానికసంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో చంద్రగిరి బాధ్యతలను లోకేశ్కు అప్పజెప్పితేనే మంచిదన్నది చాలా మంది ఆలోచన. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం మెరుగైన ఫలితాలను సాధిస్తే.. 2014 ఎన్నికల్లో లోకేశ్నే చంద్రగిరినుంచి బరిలోకి దించడానికి వీలువుతుందన్న లెక్కలనూ టీడీపీ నేతలు వేసుకుంటున్నారు. శాసనసభ ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది కాబట్టి, ఈలోగా నియోజకవర్గంలో లోకేశ్ పట్టు సాధించగలరన్న నమ్మకమూ కేడర్ను వ్యక్తవుతోంది. చంద్రగిరి విజయాన్ని చూపించి, రాష్ట్రనేతగా పార్టీలో కీలకబాధ్యతలను అప్పజెప్పే వీలుకూడా లభిస్తుంది. ఈ లెక్కన చూస్తే.. చంద్రబాబు తనయుడికి చంద్రగిరి బాధ్యతలు దక్కే అవకాశాలున్నట్లే కనిపిస్తోంది.
అయితే.. చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా చూస్తే మాత్రం, లోకేశ్కు బాధ్యతలు అప్పజెప్పడం చాలా రిస్క్ వ్యవహారమనే చెప్పొచ్చు. కాంగ్రెస్ కంచుకోటలో లోకేశ్ ఎఫెక్ట్ పనిచేస్తుందా, లేదా అన్న దానిపై చంద్రబాబుకు ఇంకా సందేహాలున్నాయి. చంద్రగిరిలో టీడీపీ బలపడితే సరే.. కానీ, బాధ్యతలు అప్పజెప్పాక, స్థానిక సంస్థల ఎన్నికల్లో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చతికలపడితే మాత్రం.. అది లోకేశ్ కేరీర్నే ముంచేస్తుంది. కానీ, వరసగా మూడుసార్లు గల్లా గెలిచారు కాబట్టి.. ఈ సారి వ్యతిరేక పవనాలు వీచే అవకాశాలే ఎక్కువన్నది టీడీపీ నేతల అంచనా. ఈ సమయంలో బలమైన నేత అక్కడ ఉంటే.. టీడీపీ గెలవడం సాధ్యమే అనుకుంటున్నారు.
నందమూరి కుటుంబం చీలుతుందా..?
చంద్రబాబు తర్వాత.. ఎవరన్న ప్రశ్నకు వస్తున్న సమాధానం.. ఎన్టీఆర్ ఫ్యామిలీని కలవరపెడుతోంది. సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు, ఆ తర్వాత ప్రచారంలోనూ వెన్నంటి ఉన్న ఆయన తనయుడు హరికృష్ణకు ఇది మరీ ఇబ్బందిగా మారింది. తన తండ్రి స్థాపించిన పార్టీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదన్న అక్కసు.. హరికృష్ణది. చంద్రబాబు వ్యూహలకు తలొగ్గాల్సి వచ్చినప్పటికీ, భవిష్యత్తులో తన కొడుకు ఎన్టీఆర్కు టీడీపీ పగ్గాలు దక్కుతాయని అంచనా వేసుకున్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా బిజినెస్లో మునిగితేలుతుండడం. ఎన్టీఆర్ హీరోగా మారి మాస్ ఇమేజ్ తెచ్చుకోవడం, ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేస్తుండడం.. హరికృష్ణ ఆశలను మరింతగా పెంచాయి. కానీ, సడన్గా సీన్ మారింది. చంద్రబాబు తర్వాత ఎన్టీఆర్ అనుకుంటే... ఆ ప్లేస్కు లోకేశ్ ఎసరు పెడుతున్నారు. చంద్రబాబు వారసుడిగా తెరపైకి రావాలనుకుంటున్నారు. చంద్రబాబు సన్నిహిత వర్గాలు దీనికి అనుగుణంగా పావులు కదుపుతూ, ఆయన మెప్పు కోసం ప్రయత్నిస్తున్నాయి.
టీడీపీలో లోకేశ్ ఎదిగితే.. దాని ఎఫెక్ట్ పడేది నందమూరి కుటుంబంపైనే. తాతలాగే సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ రాణించాలని ఉత్సాహపడుతున్న ఎన్టీఆర్కు అది గట్టి ఎదురుదెబ్బ. ఇప్పటికే లోకేశ్కు, ఎన్టీఆర్కు మధ్య సన్నిహిత సంబంధాలు లేవు. చంద్రగిరి నియోజకవర్గ బాధ్యతలో లేదంటే పార్టీలో మరో పదవినో లోకేశ్ చేపడిదే, తెలుగుదేశంలో ఆయన పట్టు పెరుగుతుంది. ఎన్టీఆర్ సినిమాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది కాబట్టి, పార్టీని పట్టించుకునే పరిస్థితి ఇప్పటికిప్పుడు ఉండదు. ఒకవేళ లోకేశ్ ఎదిగితే తనకు ముప్పుగా ఉండే ఎన్టీఆర్ను పార్టీకి దూరం పెట్టవచ్చు. దీనివల్ల ఎన్టీఆర్కు పొలిటికల్ ఫ్యూచర్ ఉండదన్నది హరికృష్ణ భయం. నందమూరి కుటుంబం పెట్టిన పార్టీ పూర్తిగా నారావారి పరమవుతుందన్న ఆందోళనా ఆయనలో కనిపిస్తోంది.
టీడీపీలో ఎన్టీఆర్ విధేయులను రెచ్చగొట్టడం ద్వారా చంద్రబాబును తమ దారికి తెచ్చుకోవాలని హరికృష్ణ వ్యూహం పన్నారు. కానీ, అది అంతగా వర్కవుట్ కాలేదు. చంద్రబాబు దెబ్బకు, అంతా సైలెంట్ కావాల్సి వచ్చింది. ఆ ప్రభావం ఎన్టీఆర్ పెళ్లిపైనా పడింది. కష్టపడి పెళ్లి కుదుర్చిన చంద్రబాబే, ఎన్టీఆర్ పెళ్లిలో చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోయారు. ఇక లోకేశ్ రాజకీయ జీవితం.. నందమూరి కుటుంబంలో చీలికలను తెచ్చేలానే కనిపిస్తోంది. 1995 సంక్షోభం తర్వాత టీడీపీకి పురంధేశ్వరి కుటుంబం దూరమయ్యింది. ఇప్పుడు బాలకృష్ణ, హరికృష్ణ కుటుంబాల మధ్యా సంబంధాలు దెబ్బతినవచ్చు. ఎందుకంటే, ఎన్టీఆర్, లోకేశ్ల మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరితే.. అల్లుడా... అన్న కొడుకా అన్న విషయాన్ని బాలకృష్ణ తేల్చుకోవాల్సి వస్తుంది. కూతురి కోసం బాలకృష్ణ లోకేశ్వైపే మొగ్గు చూపొచ్చు.
తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినా, ఆయన కుటుంబ సభ్యులకు మొదట్నుంటీ పార్టీపై పట్టులేదు. చంద్రబాబు హయాంలో ఎన్టీఆర్ తనయులు ఎన్నికలకే పరిమితమయ్యారు. తెలుగుదేశం కేడర్ కూడా వారిని ఎన్టీఆర్ వారసులగానే చూస్తుందే తప్ప.. పార్టీ నేతలుగా చూడడం లేదు. కాబట్టి.. నందమూరి ఫ్యామిలీకి రాజకీయ వారసత్వం దక్కే అవకాశాలు తక్కువనే చెప్పొచ్చు.
ఇప్పుడు మహానాడులో కనిపిస్తున్న దృశ్యాలూ.. టీడీపీ భవిష్యత్ నేత లోకేశే అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబుతో పాటు లోకేశ్ కటౌట్లు కూడా ప్రాంగణంలో ఏర్పాటయ్యాయి. వీటికి అధినేత నుంచి వ్యతిరేకత రాలేదు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ల కటౌట్లు గానీ, పోస్టర్లు గానీ మచ్చుకైనా కనిపించడం లేదు. దీన్ని బట్టి చూస్తే.. టీడీపీని పూర్తిగా నారావారి పార్టీగా మార్చేయాలన్నదే బాబు వ్యూహంగా కనిపిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బానిసత్వ భావజాలానికి దాసులైన వారి ఆలోచన ఇలాగే ఉంటుంది . వారసుడు ఎంత అర్భకుడు ఐన వాడే నాయకుడు అని అనుకునే రాజకీయనాయకుల వలన తెలుగుదేశం పార్టీయే కాదు తెలుగు జాతిని కూడా ఎవడు బాగుచెయ్యలేడు .
mana political system marlante devudivala kuda sadyam kadu