12, మే 2011, గురువారం
కడప దెబ్బ
అందరి కళ్లూ అటువైపే.. అందరి ఆలోచనలూ అంతమయ్యేది అక్కడే. కడప ఎన్నిక ఫలితాలు ఎలా ఉంటాయన్నదే. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో విజయం ఎవరిదన్నదానిపై టెన్షన్ పెరుగుతోంది.. ఫలితాలు ఇచ్చే పంచ్ గురించి రాజకీయపార్టీలు కలవరపడుతున్నాయి. అదే కడప దెబ్బ. ఆ దెబ్బ ఎలా ఉండబోతోంది. ఎవరికి తగలబోతోంది..?
కడప కోట ఎవరిది? జగన్ గెలుస్తాడా..? భారీ మెజార్టీ సాధిస్తాడా..?
జగన్ను ఢీ కొడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ విజయం సాధిస్తారా?
వైఎస్ కంచుకోటలో కాంగ్రెస్ జెండాను ఎగరేస్తారా? జగన్ జోరుకు బ్రేక్ వేస్తారా..?
జగన్ గెలిస్తే ఏమవుతుంది? కడప దెబ్బ రాజధానికి తగులుతుందా? రాష్ట్ర ప్రభుత్వానికి పంచ్ ఇస్తుందా..?
లేదంటే, కడప ఓటర్లే జగన్కు పంచ్ ఇస్తారా? ఆశలను అడియాశలు చేస్తారా..?
ఇక పులివెందుల ఉప ఎన్నికదీ ఇదే పరిస్థితి. ఓ వైపు వైఎస్ సతీమణి విజయమ్మ, మరో వైపు వైఎస్ సోదరుడు వివేకానంద. ఎన్నికల ముందు వరకూ వీరిద్దరూ ఒకే కుటుంబ సభ్యులైనా, ఎన్నికల నుంచి మాత్రం రాజకీయ ప్రత్యర్థులు. వీరిలో విజయం దక్కించుకునేదెవరు..? విజయమ్మ విజయం సాధిస్తే ఏమవుతుంది? వివేకా ఓట్లను కొల్లగొడితే ఏమవుతుంది?
కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్నా, విజయం సాధిస్తుందన్న నమ్మకాలు లేవు. మరి టీడీపీదీ మూడో స్థానమేనా..? లేక, ఈసారైనా ముందంజ వేస్తుందా..?
కడప ఎన్నికల ఫలితాలే ఇప్పుడు భవిష్యత్ రాజకీయాలకు దిశానిర్దేశం చేయబోతున్నాయి. రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టబోతున్నాయి. గెలుపోటముల ఆధారంగానే, ఈ సమీకరణాలు మారొచ్చు. కాంగ్రెస్ విజయం సాధించినా, జగన్ గెలుపొందినా పెనుమార్పులు తప్పకపోవచ్చు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతున్న ఆధిపత్యపోరు మరింత తీవ్రం కావచ్చు. ఈ రెండు పార్టీల్లో ఆధిపత్యం ఎవరిదన్నది.. మరికొన్ని గంటల్లోనే వెలువడే ఫలితాలు తేల్చబోతున్నాయి. భవిష్యత్ రాజకీయాన్ని కళ్లకు కట్టబోతున్నాయి. అయితే.. ఈ రాజకీయం ఎలా ఉంటుందన్నదే ఆసక్తికరం.
జగన్ గెలిస్తే?
కడప లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అందరికన్నా బలమైన అభ్యర్థి వైఎస్ జగన్. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి, తండ్రి పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ను స్థాపించి, సోనియాకు ఎదురుతిరిగారు జగన్. కాంగ్రెస్ తరపున గెలిచిన లోక్సభ స్థానానికి రాజీనామా చేసి, సొంతగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో గెలవడం జగన్కు అత్యంత ప్రతిష్టాత్మకం. అందుకే గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డారు. పోలింగ్ ముగిసిన తర్వాత భారీగా మెజార్టీ పై ఆశలు పెట్టుకున్నారు.
వైఎస్ మరణానంతరం పులివెందుల లోక్సభ స్థానం నుంచి ఏకగ్రీవంగా గెలిచిన ఆయన సతీమణి విజయమ్మ కూడా తనయుడి బాటలోనే నడిచారు. పదవిని వదులుకొని, ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. తాను గెలవడమే కాక, విజయమ్మను గెలిపించుకోవడమూ జగన్కు ముఖ్యమే. వైఎస్ సెంటిమెంట్ బలంగా పనిచేస్తుందని నమ్ముతున్న జగన్.. గెలుపుపై నమ్మకం పెట్టుకున్నారు.
ఈ రెండు స్థానాల్లో గెలవకపోతే జగన్ పరువు పోతుంది. కాంగ్రెస్ను ఎదిరించి నిలబడలేకపోయారన్న అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుంది. అంతకన్నా.. రాష్ట్ర రాజకీయాలను మార్చగలిగే అవకాశం చేజారుతుంది. భవిష్యత్ రాజకీయ శక్తిగా ఎదిగే ఛాన్స్ మిస్ అవుతుంది. కడప ఉప ఎన్నికల్లో జగన్ శిబిరానికి ఏమాత్రం వ్యతిరేక ఫలితం వచ్చినా, దాని ప్రభావం కోలుకోలేని రీతిలోనే ఉంటుందన్నది నిర్వివాదాంశం. కేవలం గెలవడం మాత్రమే కాదు.. భారీ మెజార్టీ సాధించడమూ ముఖ్యమే. బొటాబోటీగా గట్టెక్కినా జగన్కు కష్టమే. పొలిటికల్ ఇమేజ్ డామేజ్ అవుతుంది. వైఎస్ సెంటిమెంట్ నీరుగారిపోతుంది. అందుకే ఫలితాల వెలువడే సమయం దగ్గర పడే కొద్దీ జగన్ శిబిరంలో గుబులు పెరుగుతోంది. అయితే, ఈ పరిస్థితి రాదనే నమ్మకంతో ఉన్నారు జగన్.
జగన్ గెలిస్తే మాత్రం రాష్ట్ర రాజకీయాలపై పెను ప్రభావం పడొచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు. కాంగ్రెస్ను టార్గెట్ చేసుకొని జగన్ తన వ్యూహాలను పదునుపెట్టడం మొదలుపెడతారు. కాంగ్రెస్ పతనమే లక్ష్యంగా పావులు కదుపుతారు. కడప విజయంతో మరింత బలాన్ని సంపాదించుకున్నజగన్ను కంట్రోల్ చేయడం కాంగ్రెస్కు సాధ్యం కాకపోవచ్చు. కడప ఇచ్చిన స్ఫూర్తితో, మరిన్ని రాజకీయ ఎత్తుగడలనూ జగన్ వేయవచ్చు. కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలతో ఇబ్బందులు పడుతున్న జగన్ వర్గం ఎమ్మెల్యేలు, మరింత స్వేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగించవచ్చు. ఒకవేళ పార్టీ వేటు వేసినా, వైఎస్ సెంటిమెంట్తో మళ్లీ ఎన్నికలకు సిద్ధం కావచ్చు. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి, మధ్యంతరాన్ని సృష్టించడానికీ, జగన్ ప్రయత్నించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కడప ఎన్నికల ఫలితాలు.. అంతటి శక్తిని అందిస్తాయి. అంతేకాదు.. వైఎస్పై హక్కు మాకే ఉందని చెప్పుకుంటున్న కాంగ్రెస్కు, ఇక ఆ అవకాశం కూడా ఉండదు.
కాంగ్రెస్ గెలిస్తే?
కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పకడ్బందీ ప్లాన్ను అమలు చేసింది. జగన్కు అంగబలం, అర్థబలం రెండూ ఉండడం, సొంతజిల్లా కావడం, వైఎస్ సెంటిమెంట్ బలంగా ఉండడంతో, వ్యూహాత్మకంగా పావులు కదిపింది. జగన్ను ఎలాగైనా ఓడించాలని వ్యూహప్రతివ్యూహాలకు పదును పెట్టింది. అన్నిరకాలుగా జగన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించింది.
జగన్కు కాంగ్రెస్ ఇచ్చిన తొలిషాక్.. వైఎస్ వివేకానంద. వదినమ్మపైనే పోటీ చేసేలా వివేకానందను పురిగొల్పింది. దీంతో, వైఎస్ కుటుంబంలోనే చీలిక వచ్చింది. వైఎస్ సతీమణి విజయమ్మకు రాజకీయ అనుభవం లేకపోవడం, వివేకానందకు పులివెందులలో మంచి పట్టుఉండడంతో, ఈ ఎత్తుగడ వేసింది. మరి కాంగ్రెస్ వేసిన ఎత్తుకు జగన్ చిత్తవుతారా లేదా అన్నది తెలియాలంటే.. ఫలితాలు వెల్లడయ్యేవరకూ ఆగాల్సిందే. వివేకానంద మాత్రం, తనదే విజయమని గట్టిగా నమ్ముతున్నారు.
పులివెందుల నియోజకవర్గంలో విజయమ్మకు సెంటిమెంట్ కలిసివచ్చేదిగానే కనిపిస్తున్నా, వివేకానంద నుంచి పోటీ తప్పకపోవచ్చు. కానీ, కడప లోక్సభ స్థానంలో మాత్రం జగన్కు కాంగ్రెస్ అడ్డుకట్ట వేయలేదేమో అనిపిస్తోంది. ఎంతో సమాలోచనలు జరిపి, వైఎస్కు బద్ద విరోధైన డీఎల్ రవీంద్రారెడ్డినే ఎంపీ స్థానానికి పోటీ చేయించడం ద్వారా, వైఎస్ వ్యతిరేక ఓట్లను సంపాదించుకోవాలన్న ప్లాన్ కాంగ్రెస్ది. జగన్ను ఎదిరించి నిలబడగలిగేది డీఎల్ మాత్రమే కాబట్టి పోటీకి దింపింది. మరి, డీఎల్ నిజంగా జగన్ను విజయాన్ని అడ్డుకుంటారా..? లేక జగన్ జోరు ముందు డీలా పడిపోతారా అన్నది ఈవిఎంలు డిసైడ్ చేయబోతున్నాయి.
జగన్ గెలిస్తే ఏమవుతుందో కాంగ్రెస్కు తెలుసుకాబట్టే, ఈ ఎన్నికలపై ప్రత్యేకదృష్టి పెట్టింది. ఎలాగైనా విజయం సాధించాలని, నేరుగా మంత్రులనే రంగంలోకి దించింది. కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాల పరిధిలో ప్రచార వ్యవహారాలను పర్యవేక్షించడానికి 12 మంది మంత్రులను పంపించింది. అధికార బలాన్ని వినియోగించింది. ఈ ఎన్నికల్లో గెలుపొందితే కాంగ్రెస్కు ఎంతో లాభం. పక్కలో బల్లెంలా మారిన జగన్ను పూర్తిగా కట్టడి చేయొచ్చు. పైగా, జగన్కు జనంలో బలం లేదని నిరూపించవచ్చు. జగన్ ఓడిపోతే, కడపతోనే వైఎస్సార్ పార్టీ కథ అయిపోతుంది. అదే, జగన్ గెలిస్తే మాత్రం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది. సంస్థాగతంగా బలాన్ని పెంచుకుంటుంది. అందుకే, మొగ్గ దశలోనే తుంచేయడం కోసం, కడప ఎన్నికలను పావుగా వాడుకొంటోంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో గెలిస్తేనే ఇది సాధ్యం. మరి కాంగ్రెస్ కడప లోక్సభ స్థానంలో గెలుస్తుందా..?
కాంగ్రెస్ ఓడి.. జగన్ గెలిస్తే.. పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంటుంది. అధికారంలో ఉండి కూడా గెలవలేకపోతే, అది అతిపెద్ద అవమానమే. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కెరీర్పైనా ఇది ఎఫెక్ట్ చూపించవచ్చు. అందుకే, ఎన్నికల ఫలితాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతగానో ఎదురుచూస్తోంది.
జగన్ గెలిస్తే, పార్టీపై ఎంత ఎఫెక్ట్ పడుతుందో కూడా కాంగ్రెస్ నేతకు తెలియంది కాదు. ఇంతవరకూ తటస్థంగా ఉన్నవాళ్లంతా, నిదానంగా, జగన్వైపు జంప్ చేయొచ్చు. అందుకే, ముందస్తు జాగ్రత్త చర్యలనూ తీసుకొంటున్నారు. జగన్ గెలుపును పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఓ ఎంపీ స్థానంగానే పరిగణించాలంటున్నారు. ఒక్క ఎంపీ స్థానమే అయినప్పుడు.. మందీమార్భలాన్ని మోహరించి మరీ ప్రచారం ఎందుకు చేసిందన్నదే.. అసలు మ్యాటర్.
భవిష్యత్ దర్శనం
జగన్కు, కాంగ్రెస్కు మధ్య సాగుతున్న యుద్ధంలో భాగంగా కడప ఉపఎన్నికలు ఊడిపడ్డాయి. వీటి పుణ్యమా అని, కడపలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది తెలుగుదేశం. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో టీడీపీ ఇంతవరకూ ఖాతా తెరవలేదు. ఈసారి కూడా గెలుస్తుందన్న నమ్మకం లేదు. అయినా, పోటీకి దిగింది. కడప లోక్సభ స్థానంలోనూ మైసూరారెడ్డిని బరిలోకి దించినా విజయం సాధిస్తుందన్న నమ్మకం మాత్రం లేదు.
జగన్కే గెలిస్తే మాత్రం, కొత్త పార్టీకి రెక్కలు వచ్చినట్లే. ఉప ఎన్నికలకు ముందే పార్టీని అనౌన్స్ చేసిన జగన్, ఆ పార్టీ పేరుపై కార్యక్రమాలను మరింత ఉధృతం చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో ఇప్పటికీ వైఎస్ అంటే అభిమానం ఉన్నవారిని తనవైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. ఎన్నికల ఫలితాల అనంతరం, ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా, ప్రభుత్వంలోనే తిరుగుబాటు రావచ్చని, జగన్ వర్గం ఆశాభావంతో ఉంది. ఏదో రకంగా ప్రభుత్వం పడిపోవాలని కోరుకొంటోంది.
జగన్ విజయం.. వైఎస్సార్ కాంగ్రెస్ విస్తరణకు దోహదపడుతుంది. ఇంతవరకూ పెద్దగా దృష్టిపెట్టని తెలంగాణ వైపు జగన్ కన్నేయవచ్చు. కడప ఉప ఎన్నిక విజయాన్ని చూసి, ఈ ప్రాంతంలోనూ క్యాడర్ పెరుగుతుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వైఎస్సార్ పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఉపఎన్నికల్లో విజయం సాధిస్తే, ఆ ధైర్యంతో తెలంగాణలోనూ తిరగొచ్చు. అయితే, ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా ఉండడానికి తెలంగాణపై స్పష్టమైన వైఖరిని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం తీసుకుంటే, తెలంగాణలోనూ కాంగ్రెస్కు ఇబ్బంది తప్పదు
మెజార్టీపైనే కన్ను
కడప ఎన్నికల్లో గెలుపొందితే, రాష్ట్ర రాజకీయాల్లో జగన్ హవా మొదవలవడం ఖాయంగానే కనిపిస్తోంది. మెజార్టీనే ఈ విషయంలో కీలక పాత్ర పోషించవచ్చు. సాధారణ మెజార్టీతో జగన్ గెలిస్తే సెంటిమెంట్ వర్కవుట్ అయినా, కాంగ్రెస్కు పట్టుందని చెప్పుకునే వీలుంటుంది. కానీ, భారీ మెజార్టీని సాధిస్తే మాత్రం చిక్కులు తప్పవు. అధిష్టానం నుంచి అక్షింతలూ తప్పవు. ఇదే కాంగ్రెస్ నేతలను కలవర పరుస్తోంది. అయినా ఓట్ల విషయంలో నమ్మకంతోనే ఉంది కాంగ్రెస్. తెలుగుదేశానిదీ ఇదే పరిస్థితి. జగన్ గెలిచినా పర్వాలేదు.. కానీ మెజార్టీ మాత్రం దక్కకూడదు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్,టీడీపీల కోరిక. ఈ ఎన్నికలతో జగన్ బలపడితే, ఈ రెండు పార్టీలకూ భవిష్యత్తులో ఇబ్బందే. జగన్ ఓడితే , ఈ రెండు పార్టీలకూ పండగే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి