1, మార్చి 2011, మంగళవారం
గన్నుల రాజ్యం
గన్నులు పేలుతున్నాయి...
తూటాల వర్షం కురుస్తోంది..
చూస్తుండగానే.. జనంపైకి దూసుకువస్తున్నాయి
పేరుకే అవి ప్లాస్టిక్ గుళ్లు...
పోయేది మాత్రం ప్రజల ప్రాణాలు..
పోలీసు జులం పెరుగుతోంది...
ప్రజల ప్రాణాలతో పోలీసులు ఆడుకుంటున్నారు..
ప్రజలపైకి తుపాకులు పేల్చుతూ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు.
ఏదో ఓ సంఘటన అని సరిపెట్టుకోలేం..
రాజధాని నుంచి.. శ్రీకాకుళం దాకా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి
ఆందోళన ఎక్కడైనా... ఎప్పుడైనా.. దేనికైనా... పోలీసుల ట్రీట్మెంట్ మాత్రం ఇదే..
ఆందోళన కారులపైకి తుపాకులు ఎక్కుపెట్టడం.. ప్రాణాలు బలితీసుకోవడం..
పోలీసైతే ప్రాణం తీయొచ్చా..?
ఆందోళనకారులంటూ.. హత్యలు చేయవచ్చా..?
పోలీసులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందా..?
ఇది ప్రజాప్రభుత్వాల పాలనా.. .. లేక పోలీసు రాజ్యమా..?
ప్రభుత్వానికి వ్యతిరేకమైతే ప్రాణం తీయాల్సిందేనా..?
అసలు ప్రజలపైకి తుపాకులు ఎక్కుపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?
శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల అరాచకత్వం రాజ్యమేలింది. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ మాకొద్దన్న పాపానికి.. ఫిబ్రవరి 28న జనంపై తూటాల వర్షం కురిసింది. ఇది అకస్మాత్తుగా జరిగింది కాదు.. ప్రాణ రక్షణ కోసం జరిగింది అంతకన్నా కాదు.. ఉద్దేశపూర్వకంగా జరిగిన కాల్పులివి. ప్రజలను భయపెట్టడానికి చేసిన కాల్పులివి. ప్రజలపై గన్నులు ఎక్కుపెట్టడానికి పోలీసులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో చెప్పడానికి ఒకే ఒక్క నిదర్శనం ఈ బ్యానర్... ఆ బ్యానర్లో ఉన్న విషయం ఇదీ...
"ఓ ప్రజలారా! మీరు అక్రమ సంఘంగా గుమిగూడియున్నారు. మీరు తక్షణమే చెదిరిపోవలెను. లేనియెడల పోలీసువారు మీపై తుపాకులతో కాల్పులు జరిపెదరు. మీకు ప్రాణహాని కలుగును. ఈ వార్నింగ్ బోర్డ్ చూసి వెళ్లిపోండి! వెళ్లిపోండి!! వెళ్లిపోండి!!!".
ఇదీ పోలీసులు ప్రదర్శించిన బ్యానర్. ఇందులోనే స్పష్టంగా చెప్పేశారు. దగ్గరకొస్తే కాల్చేస్తామని. ఆందోళనలను అరికట్టడానికి ఎన్నో మార్గాలున్నాయి. అన్నింటిలోకి అంతిమంగా చేయాల్సింది ఫైరింగ్. అది కూడా కేవలం ప్లాస్టిక్ బుల్లెట్లతోనే చేయాలి. కానీ, శ్రీకాకుళంలో పోలీసులు మాత్రం ముందుగానే ఫైరింగ్ మొదలుపెట్టారు... రెండు విలువైన ప్రాణాలను బలితీసుకున్నారు.. రెండు కుటుంబాలను విధిపాలు చేశారు. ఎంతోమందిని గాయపరిచి ఆస్పత్రి పాలు చేశారు. పోలీసులు ఇంతగా ఎందుకు తెగించారు.. ఆందోళన చేస్తున్న ప్రజలేమన్నా సంఘవ్యతిరేక శక్తులా.. తీవ్రవాదులా.. లేదంటే, కరుడుగట్టిన నేరస్తులా..? ఎందుకు కాల్చిపాడేశారు..
పోలీసు కాల్పులను ప్రధాన కారణం థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రజలను వ్యతిరేకించడమే. తమ భూముల్లో, తమ గ్రామాల్లో చిచ్చురేపడానికి వస్తున్న థర్మల్ ప్రాజెక్టును వ్యతిరేకించడం నేరమా..? దానికే ప్రాణాలను తీసేస్తారా..? పోలీసులకు ఎంత ధైర్యం.. ఎంతమందిని చంపినా ఎవరూ అడగరనే ధీమానా..?
పైగా, ఇది ప్రభుత్వ ప్రాజెక్టు కానే కాదు.. ఓ ప్రైవేటు ప్రాజెక్టు. బడబాబులకు కోట్లు సంపాదించే ప్రాజెక్టు. సంతబొమ్మాలి మండలం కాకరాపల్లిలో నిర్మిస్తున్న 2640 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు ఈ వివాదానికి కేంద్ర బిందువు. ఈస్ట్కోస్ట్ ఎనర్జీ ప్రైవేట్ లిమిలెట్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల గ్రామాలు నాశనం అవుతాయన్న భయంతో స్థానికులు ఈ ప్రాజెక్టును ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం పనులను అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ప్రాజెక్టు సమీపంలోని గ్రామాల్లోకి వస్తున్న వారిని తనిఖీలు చేస్తున్నారు. స్థానికులను కూడా ఎటూ వెళ్లనివ్వడం లేదు. దీనికి తోడు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న వారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమయ్యిందన్న వార్త.. ప్రజల్లో ఆందోళనను రేకెత్తించింది. పోలీసులు తీరుకు నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు. వారిపై పోలీసులు లాఠీలు ఝులిపించడంతో.. అటువైపు నుంచి రాళ్లవర్షం కురిసింది. అంతే.. తుపాకులకు పనిచెప్పారు పోలీసులు...
టియర్గ్యాస్ షెల్స్ పడడంతో వడ్డితాండ్రలో 50 ఇళ్లు, వరికుప్పలు కాలిపోయాయి. ఎంతో కష్టపడి కూడబెట్టిందంతా అగ్నికి ఆహుతయ్యింది. చాలాకుటుంబాలకు నిలువనీడ లేకుండా పోయింది. ప్రజలకు అవసరం లేని ప్రాజెక్టు కోసం.. ఇంత తాపత్రయ పడాలా..? పర్యావరణానికి హాని చేయడంతో పాటు, స్థానికుల భూములను మింగేసే ప్రాజెక్టుకోసం కాల్పులు జరపాలా..?
ఆరునెలల వ్యవధిలోనే..
జూలై 14, 2010. శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లిలో జరిగిన సంఘటనే కొన్నాళ్ల క్రితం సోంపేటలో చోటుచేసుకుంది. అక్కడా ఇదే పరిస్థితి. నాగార్జున్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ నిర్మించతలపెట్టిన థర్మల్ విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉద్యమించారు. వారిపైనా పోలీసులను ప్రయోగించింది ప్రభుత్వం. అక్కడా కాల్పులు జరిగాయి. సోంపేటలో ప్రాజెక్టును చుట్టుముట్టిన ప్రజలపై రెండుమార్లు లాఠీఛార్జి చేసిన పోలీసులు... ఆ తర్వాత కాల్పులకు ఒడిగట్టారు. ఈ ఫైరింగ్లో ఇద్దరు చనిపోయారు.
సోంపేట కాల్పుల ఘటన అనంతరం.. ఆ ప్రాంతంలో పవర్ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులను కేంద్రప్రభుత్వం రద్దుచేసింది. దాంతో ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయింది. కానీ.. ఒక్క పవర్ ప్రాజెక్టు కోసం 19 మంది గ్రామాల ప్రజలను బలిచేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అనుకోవడమే అత్యంత దారుణమైన విషయం. ప్రభుత్వ నిర్ణయానికి ఎదురుతిరిగినందుకు, అమాయకులను కాల్చి చంపించింది సర్కార్. అయితే.. ఈ కాల్పుల ఘటన తర్వాత దోషులను శిక్షిస్తామని చెప్పింది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ప్రజలకోసమే పాలిస్తూ ఉంటే... ఇలాంటి కాల్పుల ఘటన మరోసారి జరగకుండా చూడాలి. అదుపుతప్పిన పోలీసులను కటకటాల వెనక్కి నెట్టాలి. కానీ, అది జరగలేదు. దాని ఫలితమే ఇప్పుడు కాకరాపల్లిలో మళ్లీ కాల్పులు. అది కూడా మళ్లీ శ్రీకాకుళం జిల్లాలోనే జరగడం... సోంపేట ఘటన జరిగిన ఆరు నెలలకో మరోసారి కాల్పులకు దిగడం.. ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోంది.
పైగా, ఈ కంపెనీకి ఇంతవరకూ పర్యావరణ అనుమతులే లేవని తేలుతోంది. రాజ్యసభలో ఈ విషయంపై కేంద్రమంత్రి జైరాం రమేశ్ స్వయంగా ప్రకటన చేశారు. ఇలా అనుమతులు లేని కంపెనీకోసం.. ప్రభుత్వం ఎందుకంత తాపత్రయపడింది. పోలీసు బలగాలను మోహరించి మరీ, పనులు ఎందుకు చేయించింది. అడ్డుకోవడానికి వచ్చిన జనంపైన కాల్పులు ఎందుకు జరిపించింది..? ఈ ప్రశ్నలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఉద్యమం అన్న పేరెత్తితేనే వీపు చీరేస్తున్నారు పోలీసులు. ఓ వైపు కాల్పులు జరిపి, ఊళ్లను తగలబెట్టి జనాన్ని భయపెట్టిన పోలీసులు.. ఇళ్లల్లో ఉన్న వారిని కూడా వదిలిపెట్టడం లేదు. పోతినాయుడు పేట, వట్టితాండ్ర సహా ఇతర గ్రామాల్లో ఇళ్లల్లోకి చొరబడి మరీ జనాన్ని చావబాదుతున్నారు. ఎదురుతిరిగినవారిని అరెస్ట్ చేస్తున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 25నే పోలీసులు ఇలాంటి దుశ్చర్యలకు ఒడిగట్టారు. ఆందోళన చేస్తున్న జనంపైకి టియర్గ్యాస్ను ప్రయోగించారు. లాఠీఛార్జి చేశారు.
పవర్ ప్రాజెక్టును స్థానికులు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో ప్రభుత్వానికి తెలియంది కాదు. అయినా సరే, ప్రజల ఆవేశాన్ని లెక్కచేయక, ప్రాజెక్టు నిర్మాణాన్ని పోలీసు బలగాల మధ్య కొనసాగించడానికి నిర్ణయించింది. అందుకే.. కాకరాపల్లి మరో సోంపేటగా మారిపోయింది. మరో రెండు ప్రాణాలు బలైపోయాయి. తుపాకులు పేల్చాలని పోలీసులకు ఉబలాటం పెరిగిపోతున్నా.. కంట్రోల్ చేయకపోవడం చూస్తుంటే.. ఇదంతా ప్రభుత్వం చేస్తున్న పనిలానే భావించాల్సి ఉంటుంది.
బలి తీసుకుంటున్న తూటాలు
మార్చి 27, 2006
గంగవరంలో కాల్పులు.
విశాఖ సమీపంలో నిర్మించిన గంగవరం పోర్టును వ్యతిరేకించినందుకు.. మ్యత్సకారులపై విరుచుకపడ్డారు పోలీసులు. దొరికిన వారిని దొరికినట్లు చావబాదడంతో పాటు.. కాల్పులకూ ఒడిగట్టారు. తామింతకాలం బతికిన గ్రామాన్ని వదులుకోలేమన్నందుకు ఒకరి ప్రాణం తీశారు. గంగవరం ఆందోళనను అణిచివేయడానికి కాల్పులు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది ఎవరికీ తెలియదు. కానీ, పోలీసులు ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. ఆందోళనకారులు తమ మాట లెక్కచేయలేదని, ప్రాణ రక్షణ కోసమే కాల్పులు జరపాల్సి వచ్చిందని. ఇదెంత అబద్దమో అందరికీ తెలిసిందే.
జులై 28, 2007
ముదిగొండ కాల్పులు
సీపీఎం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త భూపోరాటంలో భాగంగా, ఖమ్మం జిల్లా ముదిగొండలోనూ జనం ధర్నా చేశారు. స్థానిక సీఐకు, సీపీఎం నేతకు మధ్య జరిగిన తోపులాటతో పరిస్థితి అదుపుతప్పింది. ఆందోళకారులు, పోలీసులు కాసేపు రాళ్లను విసురుకున్నారు. ఆ తర్వాత, పోలీసులు ఫైరింగ్ చేశారు. పోలీసులు తూటాలకు ఎనిమిది మంది నేలకొరిగారు. ఇలా చనిపోయిన వారిలో ఆందోళనలతో ఏమాత్రం సంబంధంలేని ఓ మహిళ, ఓ లారీ డ్రైవర్, ఓ విద్యార్థి చనిపోవడమే విషాధకరం. పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా కాల్పులు జరుపుతున్నారో చెప్పడానికి ఇదో నిదర్శనం.
ఆగస్టు 28, 2000
బషీర్బాగ్ కాల్పులు.
విద్యుత్ టారిఫ్ పెంచడాన్ని నిరసిస్తూ రాజధానిలో ఆందోళన చేస్తున్న వారిపై కాల్పులకు తెగబడ్డారు పోలీసులు. విచక్షణారహితంగా సాగిన ఈ కాల్పుల్లో, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మందికి గాయాలయ్యాయి. గుర్రాలపై కవాతు చేస్తూ.. ఆందోళనకారులను చిత్రహింసలకు గురిచేశారు పోలీసులు. దీనిపై పదేళ్లపాటు సాగిన విచారణ.. ఎవరినీ దోషులుగా తేల్చకుండానే ముగిసిపోయింది.
ఇక తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటినుంచీ, ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలకు అంతేలేదు. విద్యార్థులను భయపెట్టడానికి భారీగా పోలీసు బలగాలను మోహరించి, ఆందోళనకు సిద్ధమైన వారిపై కాల్పులకూ తెగించింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులను చావబాదినందుకు పోలీసులు ప్రమోషన్లు కూడా కట్టబెట్టింది. ఉస్మానియాలో చిన్నపాటి ర్యాలీ చేసినా, టియర్గ్యాస్ను ప్రయోగించడం, రబ్బరు బుల్లెట్లతో కాల్చడం పరిపాటిగా మారిపోయింది.
ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజలు.. తమను పాలించడం కోసం... తమకు అన్ని సదుపాయాలు సక్రమంగా అందేలా చూడడం కోసం ఎన్నికల్లో గెలిపిస్తారు. ఎన్నికైన వారు.. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ.. ప్రజామన్నను పొందాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం ఇదే. కానీ, ఎన్నికల వరకూ ఒకలా.. ఎన్నికయ్యాక మరోలా ఉండే మన పాలకులు.. ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. అందుకే.. ప్రజలకు అవసరం లేకపోయినా.. ఎన్నో ప్రాజెక్టులకు అనుమతులిస్తున్నారు. పంటపొలాలను, గ్రామాలకు గ్రామాలను, ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారు. ఎదురుతిరిగితే.. తుపాకులతో బెదిరిస్తున్నారు. లొంగకపోతే ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. అందుకే.. ప్రజాస్వామ్యం ఇప్పుడు ఖాకీస్వామ్యంగా మారిపోయింది. పాలన తుపాకుల నీడలో సాగుతోంది. ప్రభుత్వం చెప్పినట్లు ప్రతీ ఒక్కరూ వినాల్సిందే. వినకపోతే.. ప్రాణం మిగలదు. అలాంటప్పడు దీన్ని ప్రజాస్వామ్య పాలన అనగలమా..? నియంతృత్వానికి ఇదేమైనా తక్కువా..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చిత్తడి భూముల దగ్గర థర్మల్ విద్యుత్ కేంద్రం కడితే ఆ భూములు ఎండిపోతాయని తెలియనంతగా కళ్లు తెరిచి నిద్దరోతున్నారు. http://telugu.stalin-mao.in/44512845