5, సెప్టెంబర్ 2011, సోమవారం
గాలి దెబ్బకు జగన్ గూబ గుయ్...
గాలి జనార్దనరెడ్డి అరెస్ట్ వ్యవహారం ఎవరిపై ఎంత ప్రభావం చూపించిందో తెలియదు కానీ.. జగన్ కు మాత్రం షాక్ కొట్టినంత పనయ్యింది. తనపై సీబీఐ జరుగుతున్న విచారణకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ రాజకీయ యాత్రకు వెళ్లిన జగన్ కు గాలి అరెస్ట్ వార్త మింగుడుపడలేదు. తనకూ అలాంటి పరిస్థితే వస్తుందన్న కంగారో ఏమో.. ఆయన వదనం వాడిపోయింది. అసలే లోలోపల రగిలిపోతున్న జగన్ కు మీడియా ఎదురవడంతో ఆయన జర్నలిస్టులపై విరుచుకపడ్డారు. సాధారణంగా ఏదైనా పెద్ద వార్త వచ్చినప్పుడు అందరి స్పందనలు తీసుకోవడం మీడియా అలవాటు. పైగా, గాలి జనార్దనరెడ్డి, జగన్ భుజం భుజం కలుపుకుని తిరిగినవారు. జగన్ వల్లే ఓబుళాపురంలో గాలి బ్రదర్స్ చక్రం తిప్పారన్న సంగతి అందరికీ తెలిసిందే. పైగా ఇప్పుడు జగన్ పైనా సీబీఐ ఎంక్వైరీ నడుస్తున్నదాయే. అందుకే ఈ అరెస్ట్ పై మీ స్పందన ఏమిటంటూ పార్లమెంటుకు బయలుదేరిన జగన్ ను మీడియా ప్రశ్నించింది. అంతే, తోక తొక్కిన త్రాచులా లేచిన జగన్, గాలి అరెస్ట్ తో తనకేమీ సంబంధమని, తనను అడగడం ఎక్కడ న్యాయమని ప్రశ్నించారు. వెళ్లి బీజేపీ నేతలను అడగండంటూ ఉచిత సలహా ఇచ్చారు. అంతటితో ఆగలేదు, మీడియా నైతిక విలువలు మర్చిపోయిందని, తానూ జర్నలిస్టేనని, తనకూ పేపరూ, పత్రికా ఉన్నాయని, తానూ విలువలు పాటిస్తున్నానని మీరూ పాటించాలని ఉపదేశం చేశారు. అసలు జగన్ ఎన్ని ఆర్టికళ్లు రాశారని, ఏ వార్తలు కవర్ చేశారని, ఏ వార్తలను సబ్ ఎడిటింగ్ చేశారని జర్నలిస్ట్ అయ్యారు..? ఏమో మొత్తం వ్యవహారం చూస్తే, తాను కూడా అరెస్ట్ అవుతానేమోనన్న భయం జగన్ లో మొదలైనట్లుంది. అందుకే... అక్కసంతా మీడియాపై చూపించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పద్ధతిగా అయితే నెక్స్ట్ అరెస్టయ్యేది జగనే.
హన్నా....దేవుడు ఊరుకుంటాడా