7, ఫిబ్రవరి 2011, సోమవారం
ఎవరికోసం ఈ విలీనం..?
Categories :
రాష్ట్ర రాజకీయాలను మార్చుతామని.. సరికొత్త రాజకీయాన్ని ప్రజలకు పరిచయం చేస్తామని... ఎన్నో గొప్పలతో.. ఎంతో హంగుతో.. మరెంతో ఆడంబరంతో ప్రారంభమయ్యింది మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ. కానీ.. మూడేళ్లు కూడా పూర్తిచేసుకోకుండానే, రాజకీయాలను నెగ్గలేక.. రాష్ట్ర రాజకీయాల్లో ఒంటరిగా సాగలేక.. ప్రజారాజ్యం జెండాను వదిలి కాంగ్రెస్ జెండాను చేపట్టాల్సిన పరిస్థితి చిరంజీవికి వచ్చేసింది. దీనికి కారణం ఏమిటి? ఏఏ అంశాలు విలీనానికి దోహదం చేశాయి..? ఎవరి లాభం ఎంతెంత?
ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురు చూసి మోసపోకూడదన్న విషయం జనానికి తెలిసినా... ఎందుకో అంతా ఆయన్ను నమ్మారు. తెలుగు వెండితెరపై మెగాస్టార్గా వెలుగొందిన చిరంజీవి ఏదో చేస్తారని ఆశించారు. చిరంజీవి కూడా అలానే గొప్పలు చెప్పారు. రాష్ట్ర భవితను మార్చేస్తామంటూ బీరాలు పలికారు. సామాజికన్యాయాన్ని సాధిస్తానంటూ సవాల్ చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టేటప్పుడు చిరంజీవిలో ఉన్న ఆత్మవిశ్వాసం వేరు. అప్పటి ఆలోచనలు వేరు. అప్పటి ధైర్యం వేరు. అందుకే ముందడుగు వేశారు.
అదే చిరంజీవి.. మూడేళ్లు తిరగకుండానే మారిపోయారు. పూర్తిగా మారిపోయారు. ఎవరినైతే ఎక్కువగా విమర్శించారో.. ఎవరికైతే తాను పోటీ అనుకున్నారో... ఎవరి నుంచి అధికారాన్ని అందుకోవాలనుకున్నారో.. ఆ కాంగ్రెస్ పార్టీతోనే చేతులు కలిపేశారు. ఎన్నో ఆశలు, ఆశయాలతో ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పంచన పడేశారు. కాంగ్రెస్ వాదిగా మారిపోయారు. ఎంత ఘనంగా పార్టీని ప్రారంభించారో.. అంతే ఘోరంగా కాంగ్రెస్లో విలీనం చేసేశారు. పవిత్రపుణ్యక్షేత్రం తిరుపతిలో లక్షలాది మంది సమక్షంలో అత్యంత ఆడంబరంగా ప్రజారాజ్యాన్ని ప్రారంభించిన చిరంజీవి... ఢిల్లీలో సోనియా నివాసమైన టెన్ జన్పథ్ ముందు అతి సామాన్యంగా విలీన ప్రకటన చేశారు.
విలీన ప్రకటనను చిరంజీవి చేస్తున్న సమయంలో కాంగ్రెస్ తరపున ఆయన వెంట ఉంది.. ఒక్క వీరప్పమొయిలీ మాత్రమే. పార్టీ మొత్తాన్ని విలీనం చేస్తున్నా.. సోనియాగాంధీ బయటకు వచ్చి మీడియా ముందు చిరంజీవితో చేతులు కలపలేదు. కనీసం ఆయనతో కలిసి ఫోటో కూడా దిగలేదు. కాంగ్రెస్ కండువా వేయలేదు. అంతెందుకు.. విలీనం కోసం హైదరాబాద్ వచ్చి చిరంజీవిని ఆహ్వానించిన ఆంటోనీగానీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ గానీ.. మీడియాముందుకు రాలేదు. పార్టీ మొత్తాన్ని పణంగా పెట్టినా.. చిరంజీవికి సరైన గౌరవం దక్కలేదు. కాంగ్రెస్-పీఆర్పీల విలీనంపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్నా.. ఎన్నో వదంతులు వినిపించినా.. విలీనం ఇంత ఘోరంగా ఉంటుందన్న విషయాన్ని ఎవరూ ఊహించలేదు. అందుకే.. అందరికీ షాక్.. చిరంజీవి ఎందుకు రాజీ పడ్డారని...? ఎక్కడ రాజీపడ్డారని.. ?
ప్రజారాజ్యం పీడ వదిలించుకోవాలనే.. చిరంజీవి ఈ విలీనానికి సిద్ధమయ్యారా..? ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదనే కాంగ్రెస్లో చేరిపోయారా..? చిన్నచిన్న పార్టీలే కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుంటూ, ఎన్నికల్లో ఎక్కువసీట్లు దక్కించుకుంటున్న సంకీర్ణశకంలో చిరంజీవి ఇలాంటి నిర్ణయం ఎందుకుతీసుకున్నారు.? దీనికి బలమైన కారణం ఏమైనా ఉందా..?
జనంపైనే నింద
చిరంజీవి కావాల్సింది ఏమిటి?
సామాజికన్యాయమా..? లేక..
అధికారమా..?
చిరంజీవి చేయాలనుకొంటోంది ఏమిటి?
ప్రజాసేవా...? లేక
పదవిని వెలగబెట్టడమా...?
చిరంజీవిని చూస్తే.. ఎవరికైనా ఈ అనుమానాలు కలగక మానవు. ఎందుకంటే.. ప్రజారాజ్యాన్ని దేనికోసమైతే పెట్టారో దాన్ని సాధించకుండానే కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు చిరంజీవి. కాంగ్రెస్ను, టీడీపీని కాదనుకొని, ప్రజారాజ్యంకి ఓట్లేసి గెలిపించిన దాదాపు 70 లక్షలమంది ఓటర్లను (ఇది చిరు చెప్పుకుంటున్న ఫిగర్) నిలువునా మోసం చేశారు. ఓటును నవ్వులపాలు చేశారు. కనీసం మరో మూడేళ్లు ఆగితే వచ్చే ఎన్నికల్లోనైనా తన సత్తా ఏమిటో తెలుసుకుందామన్న ఆలోచన కూడా చిరంజీవికి లేదు. అప్పటివరకూ వెయిట్ చేసే ఓపికా ఆయనకు లేదు. అర్జెంట్గా తన భారాన్ని దింపుకోవాలనుకున్నారో ఏమో... విలీనం చేసేశారు. పార్టీ పెట్టడం కోసం.. చిరంజీవి రాజకీయాల్లోకి రావడం కోసం ముందస్తుగా చేసిన ప్రయత్నాలకు తీసుకున్నంత కాలాన్ని కూడా ఈ విలీనం కోసం తీసుకోలేదు. పార్టీ పెట్టడం కోసం అభిమానులు, మహిళామణులు, రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను ఎంతో పకడ్బందీగా స్వీకరించిన చిరంజీవి... విలీనం విషయంలో కనీసం అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. అందుకే.. ఈ విలీనం ఇంత వివాదాస్పదమయ్యింది.
కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన తీరే వింతగా కనిపిస్తుంది. ఓ చిన్న లీడర్ చేరినా ఓ బహిరంగ సభను పెట్టి ఘనంగా ఆహ్వానం పలుకుతారు. అలాంటింది.. ఏకంగా పార్టీనే విలీనం చేస్తుంటే.. ఎంత హంగూ ఆర్భాటాలతో చేయాలి. వాస్తవానికి సోనియా గాంధీతో చర్చలు ముగిసిన తర్వాత, పీఆర్పీనేతలు, కార్యకర్తలతో అసలువిషయాన్ని చెప్పి.. ఆ తర్వాత బహిరంగ సభ పెట్టి విలీనాన్ని ప్రకటిస్తారని అంతా అంచనా వేశారు. కానీ, చిరంజీవి మాత్రం టెన్ జన్పథ్ ముందే తన జెండాను పీకేస్తున్నట్లు ప్రకటించేశారు. రాజకీయంగా చిరంజీవి ఇంకా ఎదగలేదనడానికి, ఈ మూడేళ్లకాలంలో ఎలాంటి పాఠాలను నేర్చుకోలేదనడానికి ఈ సంఘటనే ఓ నిదర్శనం.
కాంగ్రెస్ ప్రజారాజ్యం విలీనానికి కారణం ఎవరు? ఎవరి వల్ల ఈ విలీనం జరిగింది? దీనికి చిరంజీవి చెబుతున్న సమాధానం ప్రజలు. అవును.. తాను పార్టీ పెట్టినందుకు కృతజ్ఞతగా అధికారం ఇవ్వకపోవడం వల్లే.. విలీనం చేయాల్సి వచ్చిందంటున్నారు. రాష్ట్ర ప్రజలనే నిందిస్తున్నారు. 2009 ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనుకుంటే... పద్దెనిమిది సీట్లు మాత్రమే కట్టబెట్టడాన్ని సాకుగా చూపిస్తున్నారు. ఇంత తక్కువ బలంతో ఏమీ చేయలేం కాబట్టే.. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో ముంచేస్తున్నామంటున్నారు.
రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎన్నికలు ఎలా సాగుతాయో తెలియదనడం, వాటిని ఎదుర్కోలేకపోయామనడం.. చిరంజీవి చేతగానితనానికి నిదర్శనం. వాస్తవానికి ఇలాంటి రాజకీయాలనే ఆయన మార్చుతానని తిరుపతిలో జరిగిన ఆవిర్భావసభలో ప్రకటించారు. కానీ.. ఇప్పుడు జరిగింది మాత్రం పూర్తి విరుద్ధం. తానింతకాలం విమర్శించిన కుళ్లురాజకీయాల్లోనే ఆయన కూరుకుపోతున్నారు. ప్రజారాజ్యం అన్నది ఇక ముగిసినపోయిన అధ్యాయం. ఎన్నికలైనప్పటినుంచీ ఎప్పుడెప్పుడు పీకేద్దామా అన్న ఆతృతలో ఉన్న చిరంజీవి అండ్ టీం.. తాము అనుకున్నపనిని అద్భుతంగానే ముగించేశారు.
అసలు ఆంతర్యం
తెలుగు సినిమాపై తిరుగులేని నాయకుడు చిరంజీవి. హిట్స్ పరంగా, కలెక్షన్ల పరంగా.. మెగాస్టార్. తెలుగునేలపై ఆయనుకున్న అభిమానులు మరెవరికీ ఉండకపోవచ్చు. అదే చిరంజీవిని రాజకీయం వైపు దృష్టి మళ్లించేలా చేసింది. పాలిటిక్స్లోకి ఎంటరై.. పవర్ను చేజిక్కించుకోవడానికి ఆయన వేగంగానే పావులు కదిపారు. ఏడాదిపాటు సాగిన ఊహాగానాలకు తెరదించుతూ ఆగస్ట్ 17, 2008న హైదరాబాద్లో మీడియా సమావేశం పెట్టి మరీ అనౌన్స్ చేశారు చిరంజీవి. ఆగస్టు 26న తిరుపతిలో భారీబహిరంగ సభను పెట్టి పార్టీ పేరును అనౌన్స్ చేశారు.
సేవే లక్ష్యం.. ప్రేమే మార్గం అన్న క్యాప్షన్ను పార్టీ పేరుకు తగిలించారు. సామాజికన్యాయాన్ని పార్టీ సిద్ధాంతంగా ప్రకటించారు. సామాజిక న్యాయమంటూ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం, జనరల్ స్థానాల్లో ఎస్సీ,ఎస్టీలను పోటీచేయించడం వంటి కొన్ని కీలక నిర్ణయాలను అమలు పరిచారు. కానీ, వారి తరపున పూర్తిస్థాయిలో ప్రచారాన్ని మాత్రం చిరంజీవి నిర్వహించలేదు. అసలు టికెట్ల కేటాయింపులోనే ఎన్నో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మార్పు తెస్తామని ప్రకటించడమే తప్ప, ఆచరణలో ఎలా చేస్తామన్నది చెప్పలేకపోయారు. ప్రజలను మెప్పించలేకపోయారు. ఫలితం.. ఎన్నికల్లో ఘోరఓటమి.
కాంగ్రెస్, టీడీపీల్లో సామాజిక న్యాయం అమలు జరగడం లేదనే, ఆ అంశాన్ని పార్టీ సిద్ధాంతంగా మలుచుకున్నారు చిరంజీవి. మరి ఇప్పుడు కాంగ్రెస్తోనే కలవడంలో ఆంతర్యం ఏమిటి? సామాజికన్యాయానికి నీళ్లు వదిలినట్లేనా..? కాదంటున్నారు చిరంజీవి. కాంగ్రెస్ ఉండి సామాజికన్యాయానికి పాటుపడుతానంటున్నారు. అలాగని.. ఇంతవరకూ కాంగ్రెస్ పార్టీలో సామాజికన్యాయం లేదనుకోవచ్చా..? అంటే ఈ విషయాన్ని ఏమాత్రం ఒప్పుకోరు కాంగ్రెస్ నేతలు. అన్ని వర్గాలకు ఎక్కువ ప్రధాన్యం దక్కేది.. ఎక్కువ స్వేచ్ఛ దక్కుతున్నది కాంగ్రెస్లోనే అంటారు. అలాంటప్పుడు.. కాంగ్రెస్లో ఏరికోరి చేరాల్సిన అవసరం చిరంజీవికి ఏమొచ్చిందన్నది చిక్కు ప్రశ్నే. వాస్తవానికి కాంగ్రెస్తో చిరంజీవి చేతులు కలపడం వెనుక ఎన్నోకారణాలున్నాయి. అందులో కీలకమైంది ఆర్థిక వ్యవహారాలు. అధికారం లేకపోవడం, అరకొరగా ఎమ్మెల్యేలు ఉండడం పీఆర్పీకి సమస్యగా మారాయి. పార్టీ కార్యక్రమాలకు ఖర్చుపెట్టడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిధుల సమీకరణ పెద్దగా జరగడం లేదు. లక్షల్లో డొనేషన్లు వస్తుంటే.. కోట్లల్లో ఖర్చవుతోంది. ఎన్నికల తర్వాత ఈ రెండేళ్ల నిర్వహణే ఎంతో కష్టంగా సాగింది. ఇక కాడిని తాను మోయలేననుకుంటున్నారు చిరంజీవి. అందుకే.. అర్థాంతరంగానే వదులుకోవడానికి సిద్ధపడ్డారు. పైగా, పీఆర్పీలోని ఎమ్మెల్యేలను కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారిపోయింది. తన వాళ్లను జగన్ ఎక్కడ తన్నుకుపోతారో అన్న భయం చిరంజీవిది. అదే కాంగ్రెస్లో చేరిపోతే.. తనకు ఏ ఇబ్బందులూ ఉండవు. పైగా, అధికారం చేతికందుతుంది. అవకాశం ఉంటే ఏ మంత్రిపదవో అందుతుంది. తనవాళ్లకూ రాష్ట్రంలో రెండు మూడు పదవులు దక్కవచ్చు. ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉంది కాబట్టి అప్పటికల్లా కాంగ్రెస్లో పూర్తిగా కలిసిపోవచ్చు. ఫక్తు కాంగ్రెస్ వాదిలా మారిపోవచ్చు. కాంగ్రెస్లో ప్రస్తుతం ప్రజాకర్షక నేతలు ఎవరూ లేకపోవడం.. జగన్ను ఎదుర్కోవడానికి ఎవరో ఒకరు అవసరం ఉండడం... చిరంజీవికి కలిసివచ్చాయి. అందుకే.. కాంగ్రెస్ అడిగిందే తడవుగా విలీనానికి ఊ కొట్టేశారు.
సినిమాల కోసమేనా..?
వెండితెర జీవితాన్ని వదులుకొని పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేశానని చెప్పుకున్న చిరంజీవికి కొన్నాళ్ల క్రితమే మళ్లీ మనసుమారింది. రెండు పడవల ప్రయాణం సాధ్యం కాదని చెప్పిన నోటితోనే.. రెండిటికీ సిద్ధమని తేల్చేశారు. ఎన్నికల్లో విజయం సాధించలేకపోవడం.. అధికారం దక్కకపోవడంతో ఇక సినిమాలే మార్గం అనుకున్నారు. చాలాసార్లు ఈ విషయాన్ని స్పష్టం చేశారు కూడా. పర్సనాలిటీని తగ్గించుకోవడానికి ప్రత్యేక ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు పీఆర్పీని కాంగ్రెస్లో కలపడం వెనుకా.. ఈ సినిమా యాంగిల్ ఉందన్న అనుమానాలున్నాయి. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ సినిమాల్లో నటించడం చాలా కష్టమైన పనన్న విషయం చిరంజీవికి తెలుసు. నిరంతరం ఏదో ఓ సమస్యలు.. ఏదో ఓ కార్యక్రమం ఉంటే షూటింగ్కు హాజరు కాలేరు. అదే పార్టీనే లేకపోతే.. తన ప్రొఫెషన్కు న్యాయం చేయవచ్చన్నది చిరంజీవి అంతరంగం. కాంగ్రెస్లో సభ్యుడిగా ఉంటే ఏ సమస్యా ఉండదు. పార్టీకోసం ప్రచారం చేయాల్సి ఉన్నా, అది ప్రతీరోజు చేసే పనికాదు. అందుకే, ప్రజారాజ్యం రూపురేఖలు లేకుండా చేసే ఈ విలీనానికి సిద్ధపడినట్లు స్పష్టమవుతుంది.
అయితే.. చిరంజీవి ఇక సినిమాల్లో నటిస్తారా అంటే.. చెప్పడం కష్టమే. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీకి చిరంజీవితో ఎన్నో అవసరాలున్నాయి. ముఖ్యంగా జగన్ ముప్పును ఎదుర్కోవడానికి చిరంజీవినే ఆయుధంగా వాడుకోవాలనుకుంటోంది. త్వరలో జరగబోయే కడప ఉప ఎన్నికల్లోనూ చిరంజీవితో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బృహత్తర బాధ్యతను చిరు భుజస్కంధాలపై ఉంచే ప్రయత్నం చేస్తోంది. అందుకే, విలీనానికి ఇంత తొందరగా పావులు కదిపింది. ఈ లెక్కన చూస్తే.. సినిమాల్లో నటించే అవకాశం ఇప్పట్లో చిరంజీవి రాకపోవచ్చు. ప్రజారాజ్యం నిర్వహణ, ఇతర ఇబ్బందులు తొలిగిపోయినా... సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. ఇంతవరకూ తనకు తానే నిర్ణయాలు తీసుకున్న చిరంజీవి.. ఇప్పుడు అమ్మదయ లేకపోతే ఏమీ చేయలేరన్నది సుస్పష్టం. చిరంజీవి సినిమా తీస్తే.. కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందనుకుంటే మాత్రం.. ఆ దిశలో చిరును తప్పకుండా ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ హైకమాండ్. దానికి అధిష్టానాన్ని ఒప్పించాల్సింది చిరంజీవే.
నమ్మినవారి పరిస్థితి?
చిరంజీవిని నమ్ముకుని పార్టీలోకి వచ్చినవారి పరిస్థితి అయోమయంలో పడింది. విలీనంపై పీఆర్పీ,కాంగ్రెస్ నేతలు హ్యాపీగా ఉన్నా, కిందిస్థాయి కేడర్కి మాత్రం ఇబ్బందులు తప్పకపోవచ్చు. పైగా, ఇప్పుడు పీఆర్పీ ఎమ్మెల్యేల్లో వచ్చే ఎన్నికల్లో ఎంతమందికి టికెట్లు దక్కుతాయన్నదీ అనుమానమే. ఒకవేళ వీరికే టికెట్లు ఇవ్వాలనుకుంటే, అక్కడ పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు వ్యతిరేకించవచ్చు. వీరిని పీఆర్పీనేతలు ఎలా కలుపుకువెళతారన్నదీ అనుమానమే. వీరికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత చిరంజీవిదే.
ఈ మాటపైనైనా ఉంటారా..?
చెప్పిన మాటకు కట్టుబడిఉంటామని పదేపదే చెబుతారు చిరంజీవి. కానీ, ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పటినుంచీ పదేపదే తన మాటలను తప్పుతూనే ఉన్నారు. ఒకటీరెండు కాదు... ఎన్నో విషయాల్లో ఇలా మాటతప్పి.. పార్టీ పరువును బజారున పడేశారు. ఎంతోమంది నేతలను దూరం చేసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీని వదిలిన కొంతమంది మాటల్లో చెప్పాలంటే.. ఆ పార్టీ ఓ కంపెనీ. ప్రజాప్రయోజనాల కన్నా.. వ్యక్తిగత ప్రయోజనాలే పార్టీలో ఎక్కువని విమర్శించేవారు ఎంతోమంది.
ఇక సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉంటామని చెప్పిన చిరంజీవి ఆ తర్వాత మాట మార్చేశారు. సమైక్యనినాదాన్ని చేపట్టారు. ఆదెబ్బకు తెలంగాణ ప్రాంతంలో పార్టీ పట్టు కోల్పోయింది. ఇక సినిమాల విషయంలోనూ అంతే.. నటించనని చెప్పి.. మళ్లీ మేకప్ వేసుకోవడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్లో విలీనం అయ్యే ప్రసక్తేలేదంటూ ఒకప్పుడు ప్రకటించిన చిరంజీవి .. ఇప్పుడు అదే పార్టీలో కలిసిపోయారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పి.. అధికార పక్షంలో చేరిపోయారు. ఇలా ఎప్పటికప్పుడు తాను చెప్పిన మాటను తప్పుతూనే ఉన్నారు చిరంజీవి. ఇప్పుడు మంత్రి పదవుల కోసం కాంగ్రెస్లో విలీనం కాలేదంటున్నారు. వారు ఇచ్చినా తమకు పదవులు అక్కర్లేదంటున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ పదవులు ఇస్తామంటే వద్దనరు. మరికొన్ని రోజుల్లోనే మంత్రిపదవిలో చిరంజీవిగానీ, పీఆర్పీ ఎమ్మెల్యేలు గానీ కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాంగ్రెస్లో ఉంటూ పార్టీ బలోపేతానికి పనిచేస్తానని ఇప్పుడు చెబుతున్న చిరంజీవి.. కొన్నాళ్ల తర్వాత కాంగ్రెస్నే వదిలి వచ్చేసినా రావచ్చు. దటీజ్ చిరు.
కాంగ్రెస్లోనైనా చిరంజీవి చిత్తశుద్ధితో పనిచేసి ప్రజాసేవకు అంకితమైతే చరిత్రలో నిలిచిపోతారు.. లేదంటే చరిత్రహీనుడవుతారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Very Good Analysis!.
The way he is behaving, the chances for "లేదంటే చరిత్రహీనుడవుతారు" are more.
"విలీన ప్రకటనను చిరంజీవి చేస్తున్న సమయంలో కాంగ్రెస్ తరపున ఆయన వెంట ఉంది.. ఒక్క వీరప్పమొయిలీ మాత్రమే."
That show how useless he is for Sonia and Congress. He betrayed 70 Laksh Telugu people by selling them to Sonia. For what? We may never know for what he sold 70 Lakh Telugu people to Sonia. Bible says Judas betrayed Jesus for 33 Silver coins.
In this post you forgot to ask the most relevant question.
Who created "Politician Chiranjeevi" and why?
Answer: YSR created "Politician Chiranjeevi" to split anti-YSR and anti-Congress votes to come to power 2nd time.
In Indian politics, this was one of the most successful plan so far.
Chiranjeevi, from the inception (political career) was betraying Telugu people for personal gains.
అందుకే అన్నారు. " ఆంధ్రులు ఆరంభ సూరులు" అని.