17, సెప్టెంబర్ 2013, మంగళవారం
విలీనమంటే అంత వివక్ష ఎందుకు?
Categories :
POLITICS . september 17 . telangana . TOP . vimochana dinam
సీమాంధ్రలో సమైక్య ఉద్యమం మహోద్యమంగా సాగుతోంది. రాష్ట్రం విడిపోకూడదని, అందరం కలిసే ఉందామని ఉద్యోగులు, రాజకీయ నేతలు, ప్రజలు అంతా భారీ సభలు పెట్టి మరీ గర్జిస్తున్నారు (సీమాంధ్రలో ఎక్కువగా గర్జనలు జరుగుతున్నాయి కాబట్టి). వారి ఆశయం సమ్మతించదగిందే. అందరం కలిసి ఉందామని కోరడం నిజంగా గొప్ప విషయమే. తెలంగాణ సంప్రదాయాలను ఆంధ్రలో పాటించరన్న విమర్శలను తిప్పి కొట్టడానికి కొంతమంది బతకమ్మలను ఆడుతున్నారు. ఆ మధ్య బెజవాడ దుర్గమ్మకు బోనాలు కూడా పెట్టారు. అంతా బాగానే ఉంది.. కానీ, ప్రస్తుత తెలంగాణకు, ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజును ఎందుకు గుర్తించరు.. సీమాంధ్ర ప్రాంతంతో పోల్చితే హైదరాబాద్ స్టేట్ మరో పదమూడు నెలలకు పైగా నిజాం బానిసత్వంలో మగ్గి, తెలంగాణ సాయుధ పోరాటం, సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమా అని స్వేచ్ఛావాయువులు పీల్చుకొంది. భారత యూనియన్లో సెప్టెంబర్ 17, 1948న విలీనం అయ్యింది. చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ సందర్భాన్ని సంబరంగా చేసుకోవడం భావ్యం. బ్రిటీష్ పాలకుల నుంచి భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఎంత ఘనంగా సంబరాలు చేసుకుంటున్నామో.. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని కూడా అంతే సంబరంగా చేసుకోవాలి. కానీ, ఈ అంశానికి రాష్ట్ర ప్రభుత్వం అసలు ప్రాధాన్యమే ఇవ్వదు. కలిసి ఉండాలని చెబుతున్న సీఎం, ఈ ప్రాంత విమోచన దినాన్ని జరిపించాల్సిన బాధ్యత లేదా.. కేవలం ఒక్క జెండా ఎగరవేసి పరేడ్ నిర్వహించడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటో ఎవరికీ అర్థం కాదు. దీనికి పెద్ద ఖర్చు కూడా కాదే.. ఒకవేళ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం వల్ల ప్రభుత్వంపై భారం పడుతుందనుకుంటే, సెక్రటేరియెట్ లోనూ , అసెంబ్లీలోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జెండా ఎగరవేసినా సరిపోతుంది. కానీ, దీనికి మన పాలకులకు మనసొప్పదు. విమోచన దినం ఏమైనా విద్రోహ దినమా.. అంత వివక్ష ఎందుకు..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి