21, జులై 2011, గురువారం
ఆత్మహత్యలు.. ఆత్మాహుతి దాడులు..
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఏమైనా చేయాలనుకుంటున్న సీమాంధ్ర నేతల కొత్త వ్యూహం ఇది. తెలంగాణ నేతల రాజీనామాలతో వాతావరణం వేడెక్కడంతో, దాన్ని చల్లార్చే పనిలో పడ్డారు సీమాంధ్ర నేతలు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేయగా, తెలుగుదేశం వీధి పోరాటాలకు దిగింది. సీమాంధ్ర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలనుకొంటోంది. అయితే.. గుంటూరులో బుధవారం జరిగిన కార్యాచరణ సమావేశంలో పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనుకుంటే అది దేశం ముక్కలు చేయడమేనని ఆయన తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు, తమ దేహం ముక్కలైనా సరే.. దేశాన్ని ముక్కలు చేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. దేహం ముక్కలన్న పదానికి మరింత వివరణనూ తన ప్రసంగంలోనే ఇచ్చారు పయ్యావుల. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ఆత్మహత్యలు మాత్రమే కాదనీ, అవసరమైతే ఆత్మాహుతి దాడులూ చేస్తామంటున్నారు. అసలు, సమైక్యంగా ఉంచడానికి ఆత్మాహుతి దాడులు చేయాల్సిన అవసరం ఉందా..? ఆత్మాహుతి దాడులు చేస్తామని చెప్పడం ద్వారా పయ్యావుల ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకొంటున్నారు..? ఈ ఉద్యమాన్ని హింసాత్మకం చేయాలనుకొంటున్నారా..? సమావేశం ముగిశాక తానన్న మాటలు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలే తప్ప.. ప్రజలను రెచ్చగొట్టడానికి కాదన్నారు. అంతేకాదు, కేసీఆర్, కేటీఆర్ లు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పోల్చితే, తనవి చాలా తక్కువంటున్నారు.. అయినా... ఇదేం పద్దతి.. ఆత్మాహుతి దాడులు చేస్తామని చెప్పేవాళ్లు.. మనకు నేతలా..? ఇది ప్రజాస్వామ్యమేనా..? పోరాటం చేస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలి గానీ, హింసాత్మకంగా మార్చుతామనుకోవడం దేనికి నిదర్శనం...? సీమాంధ్ర టీడీపీ నేతలు దీనిపై ఒక్కసారి ఆలోచించాలి..? ఎందుకంటే, ఉద్యమంలో ఆవేశభరిత ప్రకటనలు చేసే నేతలు.. వాటిని ఆచరించన్న విషయం అందరికీ తెలిసినా, ఆ ప్రకటనలు విని రెచ్చిపోయే అమాయకులు, ప్రాణత్యాగాలకు సిద్ధపడే యువకులు ఎంతోమంది ఉంటారు. ఏ ఒక్క ప్రాణం పోయినా, దానికి ఇలా ఆవేశపూరిత ప్రకటనలు చేసే నేతలనే బాధ్యులను చేయాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి