21, జూన్ 2011, మంగళవారం
తెలంగాణ అమరజీవి
తెలంగాణ పేరు చరిత్రలో ఉన్నంతకాలం.. జయశంకర్ పేరుకూడా నిలిచే ఉంటుంది. భౌతికంగా ఆయన ఈ నేలపై ఉండకపోవచ్చు.. కానీ, నిత్య చైతన్యజ్యోతిగా.. జనం గుండెల్లో వెలుగుతూనే ఉంటారు. తెలంగాణ సాధనకు మార్గాన్ని చూపిస్తూనే ఉంటారు. ఆయనకు 24 గంటలు నివాళి అర్పిస్తోంది. ఆయన ఆత్మకు శాంతికలగాలని ప్రార్థిస్తోంది.
కొత్తపల్లి జయశంకర్.. తెలంగాణ ఉద్యమానికి చుక్కాని. మలివిడత పోరాటం ఇంత ఉధృతంగా, సుదీర్ఘంగా సాగుతోందంటే దానికి కారణం జయశంకరే. ఆయనిచ్చిన సలహాలే. ఉద్యమం పక్కదారిపట్టకుండా ఎప్పటికప్పుడు చక్కదిద్దిన ప్రొఫెసర్ ఆయన. కేవలం ఓ కాలేజ్లోనే.. కొంతమంది విద్యార్థులకో ఆయన ప్రొఫెసర్ కాదు.. యావత్ తెలంగాణకూ ప్రొఫెసరే.
ఆయన ఆశయం ఒకటే.. ఆశ ఒక్కటే. విద్యార్థి జీవితం నుంచి కంకణం కట్టుకొన్నది ఒక్కదానికోసమే.. గొంతులో ప్రాణం ఉన్నంతవరకూ ఆయన పోరాడింది కూడా దానికోసమే... అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. తన జీవితం మొత్తం తెలంగాణ సాధనకే అంకితం చేశారు ప్రొఫెసర్ జయశంకర్. ఊపిరి ఆగేవరకూ దానిగురించే ఆలోచించారు. ఆ ధ్యాసలోనే కన్నుమూసారు..
1952లోనే ఉద్యమజీవితం మొదలుపెట్టారు జయశంకర్. అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం మద్రాస్ రాష్ట్రానికి చెందిన వారికి ఉద్యోగాలను కట్టబెట్టడాన్ని నిరసిస్తూ సాగిన విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత.. రాష్ట్ర విలీనాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం సాగించారు. విద్యాజీవితంలో ఎన్నో మెట్లు పైకెదిగినా, ఎన్నో పదవులను అందుకున్నా.. ప్రొఫెసర్ ఆలోచనలు మాత్రం తెలంగాణ చుట్టూనే పరిభ్రమించాయి. అందులో భాగంగానే.. 1969 ఉద్యమంలోనూ పాలుపంచుకున్నారు. కానీ, రాజకీయ నాయకుల కుట్రలకు ఉద్యమం బలైపోయింది. అప్పటి పరిస్థితులను తలచుకొని ఎంతో కలత చెందారు జయశంకర్. అయితే.. ఉద్యమాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. రాజకీయనాయకులతో, ప్రభుత్వాలతో మేథోపోరాటం మొదలుపెట్టారు. తెలంగాణపై ఎన్నో పరిశోధనలు సాగించి.. ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని అందరికీ అర్థమయ్యేలా ఎన్నో ఆర్టికల్స్ రాశారు. పుస్తకాలు ప్రచురించారు.
2004 నుంచి సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని మలివిడత పోరాటంగా భావిస్తే.. దానికి చుక్కాని జయశంకర్. మేథావులను, రాజకీయనేతలను, ఉద్యమసంస్థలను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత ఆయనది. ఆయన వ్యక్తిత్వం వల్లే.. పరస్పర భిన్నాభిప్రాయాలున్నప్పటికీ అంతా ఒక్కటయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని విస్తరించడంలో తెరపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కనిపించినా.. తెరవెనుక ఉన్న శక్తిమాత్రం కొత్తపల్లి జయశంకరే.
ఐదు దశాబ్దాల పోరాటంలో ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకోలేదు ప్రొఫెసర్ జయశంకర్. తన వ్యతిరేకులను కించపరుస్తూ మాట్లాడలేదు. పాలకుల విధానాలు తూర్పారబట్టినా.. ఎంతో విచక్షణతో ప్రవర్తించారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అన్ని వేదికలపైనా ప్రస్తావిస్తూ, ఉద్యోగుల్లో,ప్రజల్లో,రాజకీయనేతల్లో మార్పును తేవడానికే ప్రయత్నించారు. తెలంగాణపై జరిగే వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించే వారు వేసే ప్రశ్నల్నింటికీ జవాబులు ఇస్తూ వచ్చారు. అంతేకాదు.. చీప్ పబ్లిసిటీని ఆయన ఎప్పుడూ కోరుకున్నదిలేదు. నీచమైన భాషను ఉపయోగించిందీ లేదు. పదవుల కోసమూ ఏనాడూ ఆయన పాకులాడలేదు. అదే ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. అదే ఆయనకు అగ్రపీఠాన్ని దక్కేలా చేసింది.
జయశంకర్ది ఉద్యమజీవితం. జీవితాంతం ఆయన ఏ ఒక్కరికో కొమ్ము కాయలేదు. ఏ ఒక్క వర్గానికో ప్రాధాన్యం ఇవ్వలేదు. తప్పు ఎవరు చేసినా చక్కదిద్దారు. తెలంగాణ ఉద్యమంలో భాగం పంచుకునే ప్రతీ ఒక్కరికీ సహాయం అందించారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుసంపాదించుకున్నారు. చిరకాలం జనం గుండెల్లో నిలిచిపోతారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
don't know much about him..but he always behaved gentleman in the media. thanx for the information. we lost a good human being with values& character, I feel.