వ్యాపారాల్లేవు .. ఉద్యోగాలు అసలే చేయరు.. ఉండేది అడవుల్లో.. పైగా ప్రతీక్షణం ప్రాణభయం. కానీ.. వారి సంపాదన ఎంతో తెలిస్తే.. అందరికీ కళ్లు తిరిగిపోతాయి. మల్టీ నేషనల్ కంపెనీలకు కూడా సాధ్యం కానంత రేంజ్లో వారికి ఆదాయం వచ్చి పడుతోంది.. డైరెక్ట్గా చెప్పాలంటే.. ఏడాదికి వారి సంపాదన.. ఏకంగా 140 కోట్లు.. ఇంత సంపాదిస్తోంది ఎవరో తెలుసా..? మావోయిస్టులు..
బెంగాల్లో వాళ్లే.. దండకారణ్యంలో వాళ్లే.. ఆంధ్రా ఒడిషా బోర్డర్లోనూ వాళ్లే.. చివరకు గడ్చిరోలి అడవుల్లోనూ వాళ్లే. ప్రభుత్వ బలగాలు ఎంతగా అణచాలని చూస్తున్నా.. ఎంతగా అడవులను జల్లెడ పడుతున్నా.. మావోయిస్టుల ప్రాబల్యం మాత్రం పెరుగుతూనే ఉంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రా-ఒడిషా బోర్డర్లో అయితే.. సమాంతర ప్రభుత్వాన్నే నడిపిస్తున్నారు మావోయిస్టులు. అడవుల్లోకి అడుగుపెడుతున్న జవాన్లపై మెరుపు దాడులు చేస్తూ.. వణుకు పుట్టిస్తున్నారు.
మావోయిస్టుల ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్లు చేసుకుంటూ.. తమ బలగాన్ని విస్తరిస్తున్నారు. వేలాదిమంది సాయుధ సిబ్బంది ఉన్న మావోయిస్టులు.. దళాలను నిర్వహించడం అంటే మాటలు కాదు. వారికి కావల్సిన సరుకులు, ఇతర అవసరాలను తీర్చడం వారికి సానుభూతిపరులైన ఆదివాసీలకూ సాధ్యం కాదు. కానీ, వారి బలం,బలగం రోజురోజుకూ రెట్టింపు ఎలా అవుతుందన్న దానిపై భద్రతా దళాలు ఎప్పటినుంచో నిఘా పెట్టాయి. ఈ క్రమంలోనే.. ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఢిల్లీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ మావోయిస్టుల ఆదాయ మార్గాలపై లోతైన పరిశోధన జరిపింది. మావోయిస్టులు ఏటా 140 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారని ఈ రీసెర్చ్ తేల్చింది. ఈ రిపోర్ట్లోని అంశాలనే రాజ్యసభకు సమర్పించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పరతిభాయ్ చౌదరి. ఇంత భారీగా ఆదాయాన్ని సంపాదించడానికి మావోయిస్టులు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారంటోంది ప్రభుత్వం. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ట్రాన్స్పోర్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, మైనింగ్ మాఫియా నుంచి అనధికారికంగా లెవీని వసూలు చేస్తున్నారట.
అంతేకాదు.. రాజ్యసభకు సమర్పించిన సమాధానంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి మరో విషయాన్నీ ప్రస్తావించారు. 2004 నుంచి 2014 మధ్యలో మావోయిస్టులు 5024 మందిని హత్య చేశారు. వీరిలో ఎక్కువమంది ఆదివాసీలే అంటోంది ప్రభుత్వం. మహిళా మావోయిస్టులపైనా సీనియర్లు అత్యాచారాలకు, లైంగిక వేధింపులకూ పాల్పడుతున్నారంటోంది. అయితే.. భారీగా డబ్బును వసూలు చేస్తున్న మావోయిస్టులు .. ఆ డబ్బును ఏం చేస్తున్నారన్నదే ఇప్పుడు సర్కార్ను టెన్షన్ పెడుతోంది.
కామెంట్ను పోస్ట్ చేయండి