5, అక్టోబర్ 2013, శనివారం
బొత్స సామ్రాజ్యం కూలుతోందా
Categories :
botsa . congress . POLITICS . samaikya protest . seemandhra . stone attack . TOP . viziayanagaram
ఉత్తరాంధ్రలో ఇంతకాలం ఏకఛత్రాధిపత్యం వహిస్తూ, విజయనగరం రాజకీయాలను పూర్తిగా శాసిస్తూ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నిర్మించుకున్న సామ్రాజ్యపు పునాదులు, సమైక్య ఉద్యమ దెబ్బకు బీటలు వారుతున్నాయి. ఇంతకాలం బొత్స ఇంటివైపు కన్నెత్తి చూడడానికి కూడా జనం, ప్రత్యర్థులు భయపడే పరిస్థితి ఉండగా, ఇప్పుడు సొంత ఇంటికి రావాలంటేనే బొత్స కుటుంబం భయపడే పరిస్థితి వచ్చేసింది. ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి బొత్స భార్య ఝాన్సీ పూర్తిగా నిరాకరించడం, బొత్స మొదట్లో విభజనకు అంగీకరించి, ఈ మధ్య సమైక్యవాదాన్ని వినిపిస్తున్నా ఆయన వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమైక్యవాదులు బొత్స కుటుంబమే లక్ష్యంగా విజయనగరంలో ఆందోళన చేపట్టారు. శుక్రవారం బొత్స కుటుంబానికి చెందిన సత్యవిజన్ కేబుల్ కార్యాలయాన్ని తగలబెట్టి, ఇంటిపైనా, కాలేజ్ పైనా దాడులు చేశారు. శనివారం బొత్స సోదరుడు శ్రీనివాసరావు ఇంటిపైనా దాడులు చేసి, కేబుల్ పరికరాలను ధ్వంసం చేశారు. బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లిలోని ఆయన కార్యాలయాలన్నింటినీ ధ్వంసం చేశారు. ఇవాళ కాంగ్రెస్ నేత తమ్మనశెట్టి ఇంటిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. పోలీసులు ఆందోళనలు నియంత్రించడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా, వాటి తీవ్రత క్రమంగా పెరుగుతోందే తప్ప, తగ్గుముఖం పట్టడం లేదు. కలెక్టరేట్ దగ్గర జరిగిన ఆందోళనలు కూడా హింసాత్మకంగా మారాయి. పోలీసులపై ఆందోళనకారులు తరచూ రాళ్లదాడికి దిగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బొత్స ప్రత్యర్థులు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న వదంతులున్నాయి. ఆందోళనల్లో ఇద్దరు విద్యార్థులు చనిపోయారంటూ వ్యాపించిన వదంతులు కూడా సమైక్యవాదుల్లో మరింత ఆగ్రహాన్ని కలిగించాయి. అయితే, ఇంతవరకూ ఎవరూ చనిపోలేదని వదంతులు నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, బొత్స సామ్రాజ్యం కూలిపోతున్నట్లే కనిపిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి