రాష్ట్ర విభజనపై ఓ వైపు సీమాంధ్ర రగులుతుండగానే, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రా ఉద్యోగులు వాళ్ల ప్రాంతానికి వెళ్లిపోవాల్సిందేనని, అక్కడ ఏర్పడే ప్రభుత్వంలో వారు పనిచేయాల్సి ఉంటుందని, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తారని, ఆంధ్రా ఉద్యోగులకు ఎలాంటి ఆప్షన్లు ఉండవని కేసీఆర్ అన్నారు. ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోయాక తెలంగాణ వారికి ప్రమోషన్లు ఇచ్చి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు అందిస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. ఆంధ్రా ఉద్యోగులంతా వెళ్లిపోవాలనడంపై సీమాంధ్ర ఉద్యోగులు, నేతలు మండిపడుతున్నారు.
అయితే, కేసీఆర్ అన్నట్లు ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్ ఉండదని చెప్పడం అవివేకమే. ఎందుకంటే, ఉద్యోగాలను రెండు ప్రభుత్వాల అవసరాలకు తగ్గట్లుగా కేంద్రం పంచుతుంది. ప్రాంతాల వారీగా ఉద్యోగులు సమానంగా ఉంటే ఏ సమస్యా ఉండదు. తేడా ఉంటే మాత్రం ఉద్యోగుల అభీష్టం మేరకు లేదంటే, ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉద్యోగుల పంపిణీ ఉంటుంది. ఇక పదేళ్ల పాటు హైదరాబాదే రాజధాని కాబట్టి, సీమాంధ్రకు చెందిన సచివాలయం, అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ హైదరాబాద్ నుంచే పనిచేస్తాయి. ఈ పదేళ్లలో ఒక్క ఉద్యోగి కూడా హైదరాబాద్ దాటి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇక రాజధాని మారిన తర్వాత, సహజంగానే ఉద్యోగులు ఆ రాజధానికి వెళ్లాల్సి ఉంటుంది. పదేళ్ల సమయంలో ఎంతో మంది రిటైర్ అవుతారు, కొత్తగా మరెంతో మంది రిక్రూట్ అవుతారు. రిటైర్ అయిపోయే వారికి సమస్య ఉండదు, కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ముందే దీనిపై క్లారిటీ ఉంటుంది కాబట్టి ఏ గొడవా లేదు. దాదాపు సగం మంది మాత్రం కొంత సర్వీస్ తో ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఇళ్లు, ఆస్తులు కూడబెట్టుకున్న వారికి మాత్రం ఈ బదిలీ వ్యవహారం ఇబ్బందిగానే ఉంటుంది. వారి ఆస్తులను ఇక్కడే ఉంచుకోవడం ద్వారానో లేదంటే అమ్ముకుని, కొత్త ప్రాంతలో మళ్లీ ఆస్తులు కొనుక్కోవడం ద్వారానే సర్దుబాటు చేసుకోవచ్చు. అంతకు మించి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. తెలంగాణ వచ్చే ప్రభుత్వం నిజంగానే సీమాంధ్ర ఉద్యోగులపై వివక్ష చూపిస్తే మాత్రం, న్యాయపరంగా పోరాటం చేయడానికి ట్రిబునల్స్, కోర్టులు ఎలానూ ఉండనే ఉన్నాయి. అందుకని, కేసీఆర్ ఏదో అన్నాడని ఎవరూ భయపడాల్సిన పనే లేదు.
రాష్ట్రంలో ఉద్విగ్న భరిత వాతావరణ నెలకొన్న పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి వాళ్లు కూడా, కాస్త సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చిన్న మాటైనా సరే, పెను అనుమానాలకు తావిచ్చి, పెద్ద ఉద్యమాలను సృష్టిస్తుంది.
2, ఆగస్టు 2013, శుక్రవారం
కేసీఆర్ చెప్పినట్లు, ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందేనా..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఏమోనండీ. భయపడాలేమో!
ఈ స్వార్థపూరితశక్తులకు వంతపాడే కేంద్రప్రభుత్వాలు ఉన్నంత వరకూ తప్పక భయపడాలి మరి. ఈ కేంద్రంలో చక్రంతిప్పే పార్టీలకూ రాష్ట్రంలో ఉనికిచాటుకునే పార్టీలకూ కూడా రాజకీయప్రయోజనాలే ముఖ్యం కాని ప్రజాప్రయోజనా ఏమాత్రం పట్టవని ఇప్పటికైనా మనం తెలుసుకోవటం అత్యవసరం.