4, జనవరి 2013, శుక్రవారం
ఆయన సాధించారు.. ఈయన సాధిస్తారా..?
Categories :
chandrababu . padayatra . POLITICS . TOP . ysr
పాదయాత్ర పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వరసగా రెండు సార్లు ప్రతిపక్షంలో ఉండి... జావగారిన కాంగ్రెస్కు మళ్లీ జవసత్వాలు అందించింది వైఎస్ పాదయాత్రే. మండుటెండలను సైతం లెక్కచేయక జనంలోకి నడుచుకుంటూ వెళ్లిన రాజశేఖర్రెడ్డిని జనం అందంలం ఎక్కించారు. కాంగ్రెస్కు అధికారం అందించారు.
తెలుగుదేశం పార్టీది కూడా అదే పరిస్థితి. వైఎస్ దెబ్బకు.. టీడీపీ రెండుసార్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్న చంద్రబాబు.. వైఎస్ నే అనుసరించారు. వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర మొదలుపెట్టారు.
అప్పటి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ పాదయాత్ర చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్కు, వైఎస్సార్సీపీకి, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు. వైఎస్ పాదయాత్ర ఏప్రిల్ 9, 2003న చేవెళ్లలో ప్రారంభమై... 58 రోజుల పాటు సాగి... జూన్ 14న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. 1468.8 కిలో మీటర్ల మేర వైఎస్ నడిచి రికార్డు సృష్టించారు. అక్టోబర్ 2న హిందూపురం నుంచి మొదలైన చంద్రబాబు పాదయాత్ర.. ఇప్పటివరకూ ఎనిమిది జిల్లాల్లో సాగింది. 94 రోజుల పాటు నడిచిన టీడీపీ అధినేత.. 1500 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. జనవరి 26కే తొలిదశ పాదయాత్రను పూర్తిచేయాలనుకున్నా... మార్చి 29వరకూ వస్తున్నా మీకోసంను బాబు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
53 ఏళ్ల వయస్సులో 44 డిగ్రీల మండే ఎండల్లో పాదయాత్ర చేసి జనం గుండెల్లో నిలిచిపోయారు వైఎస్సార్. ఎంతమంది వారించినా... వద్దని ఎంతగా చెప్పినా.. మొండిగానే ముందడుగు వేసిన వైఎస్.. జనానికి ఎన్నో హామీలు ఇచ్చారు. కరెంట్ సమస్యలతో సతమతమవుతున్న రైతన్నలకు.. ఉచితకరెంట్ హామీని వాగ్ధానం చేశారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి ఘనవిజయం దక్కేలా చేసింది. 63 ఏళ్ల వయస్సులో పాదయాత్ర మొదలుపెట్టిన చంద్రబాబు కూడా భారీగానే హామీలు గుప్పిస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. గిరిజన డిక్లరేషన్ను ప్రకటించారు. పాదయాత్రలో ఉండగానే తెలంగాణపై అఖిలపక్షానికి లేఖ పంపించారు. వైఎస్ తరహాలో.. ఈ పాదయాత్ర తెలుగుదేశానికి మళ్లీ అధికారాన్ని అందిస్తుందని భావిస్తున్నారు చంద్రబాబు.
అప్పుడు వైఎస్కు.. ఇప్పుడు చంద్రబాబుకూ.. పాదయాత్రలో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అయినా.. ఇద్దరూ మధ్యలో యాత్రను విరమించుకోలేదు. తూర్పుగోదావరి జిల్లాలోనే విశ్రాంతి తీసుకుని పాదయాత్రను వైఎస్ మళ్లీ కొనసాగించారు. చంద్రబాబు కాలి వేలుకి గాయమైనా.. లెక్కచేయకుండా నడుస్తూనే ఉన్నారు. అయితే.. నరాలపై ఒత్తిడి పెరుగుతుండడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికే వైఎస్ రికార్డును అధిగమించిన చంద్రబాబు.. తొలివిడత యాత్ర పూర్తయ్యే సరికి.. ఎన్ని కిలోమీటర్లు నడిచినా.. అది సరికొత్త రికార్డుగానే మిగిలిపోనుంది. అయితే.. వైఎస్లా ఈ పాదయాత్ర చంద్రబాబుకు అధికారాన్ని మళ్లీ అందించగలుగుతుందా.. అన్నది ఎన్నికలు అయితేగానీ తెలిసే అవకాశాలు లేవు.. తెలుగు తమ్ముళ్లు మాత్రం.. వస్తున్నా మీకోసం.. తమకు అధికారాన్ని తెచ్చిపెడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి