ఊహించిందే జరిగేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పన్నినా.. ఎంతగా వ్యతిరేక ప్రచారం చేసినా.. అవి గుజరాత్ లో మోడి ప్రాభవానికి గండికొట్టలేకపోయినట్లే కనిపిస్తోంది. గుజరాత్లో రెండో విడత పోలింగ్ ముగిసిన వెంటనే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ.. మళ్లీ నరేంద్ర మోడికే పట్టంకట్టాయి. ఇవి నిజమైతే గనక.. వరసగా మూడోసారి బీజేపీని గుజరాత్ లో అధికారంలోకి తెచ్చిన ఘనత మోడికి దక్కుతుంది. ఇది ఓ అరుదైన, అనితరసాధ్యమైన రికార్డుగా నిలిచిపోతుంది. పైగా, గతంలో కన్నా.. ఈ సారి బీజేపీకి మరికొన్ని సీట్లు పెరిగేలానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీని కాదని సొంత పార్టీ పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ సొంతప్రాంతమైన సౌరాష్ట్ర ప్రాంతంలోనూ పటేళ్లు.. మోడి మెడలోనే దండవేసినట్లు తెలుస్తోంది. గురువారం జరిగే ఓట్ల లెక్కింపుతో వాస్తవ ఫలితాలు వెల్లడవుతాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో అప్పుడే బీజేపీలో ఉత్సాహవాతావరణం నెలకొంది. అటు కాంగ్రెస్ లో నిస్తేజం అలముకొంది.
గుజరాత్ లో బీజేపీ విజయం సాధిస్తుందన్న అంచనాలతో.. ఆపార్టీలో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీ జయకేతనం ఎగరవేయాలంటే.. మోడినే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకొంది. ఇటీవలే సుష్మా స్వరాజ్, అద్వానీలు కూడా ప్రధాని పదవికి మోడీని అర్హుడిగా పేర్కొనడంతో.. ఆయనకు లైన్ క్లియర్ అయినట్లే. దీంతో.. హిందుత్వం బదులు వచ్చే ఎన్నికల్లో బిజేపీ మోడిత్వాన్ని ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
18, డిసెంబర్ 2012, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి