21, నవంబర్ 2012, బుధవారం
కసబ్ సంగతి సరే.. అఫ్జల్ గురు మాటేమిటి?
ఉదయం 8 గంటలకు టీవీలు పెట్టినవాళ్లంతా ఓ రకమైన ఆశ్చర్యానికి, షాక్ కు గురై ఉంటారు. ఎందుకంటే..కసబ్ క్షమాభిక్షను రాష్ట్రపతిని తిరస్కరించాడని.. బ్రేకింగ్ న్యూస్ లు పడుతున్నాయి. అంతలోనే కసబ్ ను ఉరి తీసేశారని ఆ బ్రేకింగ్స్ మారిపోయాయి. ఇదీ మరో షాక్.. ఎందుకంటే.. కసబ్ లాంటి వ్యక్తి ఉరిని.. చివరి నిమిషం వరకూ అత్యంత గోప్యంగా ఉంచి సంచలనం సృష్టించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్ర పతి కార్యాలయంనుంచి పూణేలోని ఎరవాడ జైలు వయా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు సిబ్బంది వరకూ.. ఈ విషయంలో పెదవి విప్పకుండా రహస్యంగానే పని పూర్తిచేయడం మీడియా వర్గాలను షాక్ కు గురిచేసిందనే చెప్పాలి.
అక్టోబర్ 15న కసబ్ క్షమాభిక్ష పిటిషన్ ను కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి పంపించింది. నవంబర్ 5న ప్రణబ్ ముఖర్జీ దాన్ని తిప్పి పంపించేశారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే, అంటే నవంబర్ 7న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఉరిశిక్షను అసలు చేయాలన్న ఆదేశాలపై సంతకం పెట్టేశారు. నవంబర్ 8న ఆ ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి పంపించివేశారు. ఉరి వేయడానికి అన్ని వసతులూ ఉన్న పూణే ఎరవాడ జైలుకు నవంబర్ 19న కసబ్ ను మహారాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించింది. నవంబర్ 21 ఉదయం 7.30 గంటలకు ఉరిశిక్షకు పకడ్బందీ అమలు చేసింది.
కసబ్ ను ఉరితీయడంపై అన్ని వర్గాల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. ముంబై మారణహోమంలో 166 మంది ప్రాణాలను బలిగొని, ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన ముష్కరమూకలో ఒకడైన కసబ్ ను రహస్యంగా ఉరితీయకుండా.. బహిరంగంగా ఉరితీసి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సామాజిక ఉద్యమ కారుడు అన్నా హజారే కూడా.. కసబ్ ను బహిరంగంగా ఉరితీస్తే, ఎంతోమంది ఉగ్రవాదుల వెన్నులో వణుకుపుట్టేదనడమూ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమే. నవంబర్ 26కు అంటే.. మరో వారం రోజుల్లో ముంబైదాడులకు నాలుగేళ్లు పూర్తవుతాయి. ఆ లోగానే కసబ్ ను ఉరి తీయడం ద్వారా బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం స్వాంతన ఇచ్చిందని భావించవచ్చు. అయితే, గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనూ, పొలిటకల్ మైలేజ్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్న వాదనా వినిపిస్తోంది.
ఆఫ్జల్ గురు సంగతేమిటి..?
కసబ్ కన్నా ముందే భారత పార్లమెంట్ పై దాడికి కుట్ర పన్నిన ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరిశిక్షపై ఇంతవరకూ నిర్ణయం తీసుకోకపోవడం ఇప్పుడు ప్రధాన వార్తగా మారింది. కసబ్ ను ఉరి తీసినప్పుడు.. ఆఫ్జల్ గురును ఎందుకు ఉరి తీయరన్న వాదన వినిపిస్తోంది. అయితే.. కొన్ని రిపోర్టుల ప్రకారం ఆప్జల్ గురుతో పాటు మరో ఆరుగురికి కూడా రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించారని తెలుస్తోంది. కానీ, ఆఫ్జల్ గురు కు కూడా మరణశిక్ష వేస్తేనే.. ఉగ్రవాదుల దూకుడుకు అడ్డుకట్ట వేయగలిగే అవకాశం కొంతైనా ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి