17, ఫిబ్రవరి 2011, గురువారం
ఉద్యమమా.. ? ఉద్రేకమా?
తెలంగాణ సాధనకు సహాయనిరాకరణోద్యమం మొదలయ్యింది. ఈ పోరాటానికి ముందునుంచీ మద్దతు చెబుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. తొలిరోజు హడావిడి చేసింది. ఆందోళనలకు దిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తనతో అసెంబ్లీలోనూ.. అసెంబ్లీ ఆవరణలోనూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే.. పరిస్థితి అదుపుతప్పి భౌతికదాడులకు దారితీయడమే వివాదాస్పదమవుతోంది. అది ఉద్యమమా.. లేక ఉద్రేకమా..?
శాసన సభ బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని టీఆర్ఎస్ అడ్డుకుంది. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలింది. అంతటితో ఆగకుండా.. గవర్నర్ చేతుల్లోని ప్రసంగ ప్రతులను లాక్కొని చింపేయడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నించారు. గవర్నర్ దగ్గర ఉన్న మైక్ను విరగగొట్టారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్.. బయటకు తరలించారు. ఆ తర్వాత శాసనసభ మీడియాపాయింట్లోనూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సభలో జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. మీడియాతో మాట్లాడుతున్న జయప్రకాశ్ నారాయణతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవకు దిగారు.
ఇదే సమయంలో ఓ వ్యక్తి జేపీపై దాడి చేశాడు. ఆయన తలపై కొట్టాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జేపీని చుట్టుముట్టి వాగ్వాదానికి దిగడంతో ఆయన తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఇలా ఓ శాసనసభ్యుడిపై.. శాసనసభ ఆవరణలోనే ఇలా దాడి ఎందుకు జరిగింది..? ఈ దాడి దేనికి సంకేతం..? అసలు ఇలా దాడి చేయడం ఎంతవరకూ సబబు?
అక్కడ హన్మంత్ షిండే..
నిజామాబాద్ జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు ఘోరపరాభవం ఎదురయ్యింది. జుక్కల్ మండలంలో జరిగిన ధూం ధాం కార్యక్రమానికి హాజరుకావడానికి వచ్చిన హన్మంత్ షిండేను స్థానికులు నిలదీశారు. తెలంగాణ ద్రోహిగా విమర్శించారు. జనం నుంచి వచ్చిన స్పందనతో ఒక్కసారిగా షాక్ తిన్నారు ఎమ్మెల్యే. అనంతరం ఆయనపై దాడి మొదలయ్యింది. రాజీనామా చేస్తానంటూ షిండే ప్రకటించినా ఆందోళన కారులు చల్లబడలేదు. పైపెచ్చు ఆయనపైకి రాళ్లు, కర్రలు, కర్చీలు విసరడం మొదలుపెట్టారు.
పోలీసులు వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపుతప్పింది. మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు.. షిండే వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత తగలబెట్టారు. ఈ సంఘటనలో ఎమ్మెల్యే షిండేతో పాటు.. మరెంతో మందికి గాయాలయ్యాయి. ధూంధాం కార్యక్రమమూ ఆగిపోయింది. షిండేపై దాడి జరగడం.. ఆ తర్వాత జేపీపైనా దాడి జరగడం సంచలనం సృష్టించింది. ఈ రెండు సంఘటనలూ.. తెలంగాణ ఉద్యమంపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.
ఈ దాడులు ఎందుకోసం..?
లోక్సత్తా అధ్యక్షుడిపైనా, టీడీపీ ఎమ్మెల్యే పైనా జరిగిన దాడులపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతీ ఒక్కరూ దాడులను ఖండించారు. నిజమే.. అసెంబ్లీ ఆవరణలోనే జయప్రకాశ్ నారాయణపై దాడి జరగడం ఏమాత్రం ఆహ్వానించతగింది కాదు. ఉద్యమం పేరుతో భౌతిక దాడులకు దిగడమూ సరికాదు. జేపీపై దాడిని అంతా ఖండించాల్సిందే..
అయితే.. జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలే ఆయనపై దాడికి పురిగొల్పినట్లు టీఆర్ఎస్ చెబుతోంది. అసెంబ్లీలో మైక్ను విరగగొట్టడం.. సమావేశాలకు ఆటంక పరచడంపై జేపీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బయటకువచ్చిన జేపీ..మీడియా ముందు తన ఆవేదనను వెళ్లగక్కారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందంటూ విమర్శించారు. కేవలం టీఆర్ఎస్ వ్యవహార శైలినే విమర్శించడంతో ఆ పార్టీ శాసనసభ్యులు జేపీపై ఆగ్రహం వెళ్లగక్కారు. మీడియా ముందే ఆయన్ను అడ్డగించారు. గవర్నర్ను అడ్డుకోవడంపై అంతగా స్పందిస్తున్న జేపీ, మార్షల్స్ దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించడంలేందంటూ ఆయనతో గొడవకు దిగారు. ఈ సమయంలోనే ఓ వ్యక్తి జేపీపై దాడి చేశాడు.
ఆవేశంలోనే ఈ సంఘటన జరిగిందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నప్పటికీ.. అలా దాడి చేస్తున్న వ్యక్తిని ఆపడానికి మాత్రం ఎవరూ ప్రవర్తించలేదు. పైగా ప్రోత్సాహించడానికి మరింత ప్రయత్నించారు. ముఖ్యంగా కేసీఆర్ తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆవేశంగా కనిపించారు. ఇదే అనుమానాలను కలిగిస్తుంది. ఎవరికైనా భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది.. దానిపై అభ్యంతరాలుంటే అడ్డుకునే హక్కు కూడా ఎదుటివారికి ఉంటుంది. అయితే.. దాడి చేయడం అన్నదే ఇక్కడ అభ్యంతరకరం. ఇక టీడీపీ ఎమ్మెల్యేపై హన్మత్షిండేపై జరిగిన దాడిలోనూ ప్రజల ఉద్రేకం కనిపిస్తుంది. టీడీపీకి రాజీనామా చేయకపోవడం, ఇటీవల రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడంతో షిండేపై తెలంగాణ వాదులు ఆగ్రహంతో ఉన్నారు. అవకాశం చిక్కడంతో ఆయనపై దాడికి దిగారు. కానీ, ఇలా దాడులు చేయడం ద్వారా.. ఉద్యమకారులు ఏం చెప్పాలనుకుంటున్నారు..? ఇది ఉద్యమానికి మేలు చేస్తుందా..? ఉద్యమాన్ని నీరుగార్చుతుందా..? ఒక్కసారి ఆలోచించాలి.
సహాయనిరాకరణ ఎలా జరిగింది..?
తెలంగాణ సాధన దిశలో ఉద్యమకారులు మరో అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. గాంధీ చూపించిన బాటలో నడవాలని నిర్ణయించారు. సహాయనిరాకరణోద్యమాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజలు, ఉద్యోగుల నుంచి దీనికి విశేష స్పందన లభించింది. జేఏసీ పిలుపుకు అనుగుణంగా, ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు తీసుకోవడానికి చాలామంది నిరాకరించారు. ప్రధాన హైవేలపై ఉన్న టోల్గేట్లలో డబ్బులు కట్టడానికి చాలామంది నిరాకరించారు. చాలాచోట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుని, వాహనాలను పంపించివేశారు.
సహాయనిరాకరణోద్యమం సింగరేణినీ తాకింది. జేఏసీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా, సింగరేణి కార్మికులు టూల్డౌన్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు తమ విధులను బహిష్కరించారు. టీఎన్జీవో, ఎన్జీవో సంఘాలు జేఏసీ ప్రకటించిన సహాయ నిరాకరకణ మద్దతు ఇవ్వడంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
హైదరాబాద్లోనూ సహాయనిరాకరణ ఉద్రిక్తంగా సాగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో.. జై తెలంగాణ అనడానికి వీల్లేదంటూ కార్మికులను కమిషనర్ ఆదేశించడం వివాదస్పదమయ్యింది. దీనికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్ వీరికి మద్దతు పలికింది.
పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టేవరకూ ఈ సహాయ నిరాకరణను కొనసాగిస్తామని ఉద్యోగసంఘాలు ప్రకటించాయి. వీరికి టీఆర్ఎస్, టీడీపీలు మద్దతు పలుకుతుండడంతో, సహాయ నిరాకరణ ఉధృతంగానే సాగే అవకాశాలున్నాయి. ఈ ఉద్యమం ఇదే స్థాయిలో కొనసాగితే.. ప్రభుత్వానికి తీవ్ర నష్టం ఏర్పడుతుందని, అప్పుడు తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టక తప్పదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
వాస్తవానికి, సహాయ నిరాకరణ ఉద్యమ ఉద్దేశం కూడా ఇదే.. శాంతియుతంగా ఆందోళన చేపట్టడం ద్వారా ప్రభుత్వానికి తీరనినష్టం కలిగించి.. తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలన్నది జేఏసీ ఆలోచన. కానీ, జనం ఉద్రేకంతో, నేతల దుందుడుకు చర్యలతో.. ఈ శాంతియుత ఉద్యమానికి భంగం కలిగే పరిస్థితి కనిపిస్తోంది.
కాంగ్రెస్ నేతలేమయ్యారు..?
తెలంగాణలోనూ, అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సమయంలో.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కనిపించలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు కాక, మరో ఇద్దరు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. తెలంగాణ అంటే రొమ్మువిరుచుకుని నిలబడతామని చెప్పుకునే కాంగ్రెస్ నేతలంతా కీలకమైన ఈ సమయంలో ఢిల్లీలో మకాం వేశారు. చెప్పాలంటే.. రాష్ట్రంలో ఏర్పడే పరిస్థితులను ముందుగానే ఊహించినట్లున్నారు కాంగ్రెస్ నేతలు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ అంశం లేదన్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు.. చల్లగా ఢిల్లీకి జారుకున్నారు. ఒకవేళ రాష్ట్రంలో ఉంటే తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరు కావాలి. గవర్నర్ ప్రసంగించే సమయంలో వీరంతా మౌనంగా ఉంటే టీఆర్ఎస్ సహా తెలంగాణ వాదులనుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలి. అలాగని ప్రసంగానికి అడ్డుతగిలితే, అధిష్టానం నుంచి తిట్లు తినాలి. అందుకే.. ఏ గొడవలోనూ చిక్కుకోకూడదని చల్లగా.. ఢిల్లీకి జారుకున్నారు.
సహాయ నిరాకరణ తీవ్రంగా మొదలైన నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలది నిజంగానే గడ్డు పరిస్థితి. ఓ వైపు తెలంగాణపై అధిష్టానం స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం.. మరోవైపు తెలంగాణ వాదులు, టీఆర్ఎస్ నుంచి విమర్శలు పెరుగుతుండడం.. ఈ రెండింటిమధ్యా నలిగిపోతున్నారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. అందుకే, ఏదో ఒకటి తేల్చమంటూ ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ కీలక నేతలతో వరసగా సమావేశమవుతున్నారు.
తెలంగాణ మంత్రులు మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించక తప్పని పరిస్థితి. పైగా పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్రం ఉండి అనవసరమైన వివాదాల్లో తలదూర్చకూడదని మిగిలిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. పైగా, ఢిల్లీలో ఉంటూ, తెలంగాణ సాధన కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామనీ చెప్పుకునే వీలు కూడా ఉంటుంది. అందుకే.. కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోనే మకాం పెట్టారు. ఇప్పటికే ప్రణబ్ ముఖర్జీతో సమావేశమైన నేతలు.. సోనియా అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక టీఆర్ఎస్, టీడీపీ నేతలే ప్రస్తుతం తెలంగాణ విషయంలో దూకుడుగా ఉన్నారు. అయితే ఉద్యమాన్ని నియంత్రించగలిగే శక్తిమాత్రం వీరి చేతుల్లో లేదు. విద్యార్థులు, ఉద్యోగుల చేతుల్లోకి ఇది వెళ్లిపోయింది. కాకపోతే.. ఉద్యమం ఉద్రిక్తంగా మారకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం వీరిపైనే ఉంది. అప్పుడే ఉద్యమం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
do not be over excited sir. you also see the comments of JP and governer as a telangana person. the way they comment about telangana is regrettable(Like not in syllabus etc).
If an attack on them makes you to excite this much then the attack on moral of 4Cr telangana people will definetly be