అవినీతి అక్రమాలంటూ ఎన్నో స్టింగ్ ఆపరేషన్లు చేసి సంచలనాలు సృష్టించిన తెహల్కా అధిపతి తరుణ్ తేజ్ పాల్, తాను ఎదగడం కోసం ఎన్నో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. తెహల్కా బ్రాండ్ ను చూపించి, ఎంతోమందినుంచి డొనేషన్లు తీసుకున్న తేజ్ పాల్ వాటిని వారిపేర్లమీదే షేర్లుగా చూపించి, భారీ ప్రీమియాలుగా అమ్ముకుని సొంత అకౌంట్లో వేసుకున్నాడని తెలుస్తోంది. ఇలా అమ్ముకున్న తర్వాత వచ్చిన సొమ్ములో ఒక్కపైసా కూడా డొనేషన్ ఇచ్చిన వారికి రాలేదు. ఇలాంటి వారిలో కేంద్రమంత్రి కపిల్ సిబల్ కూడా ఉండడం విశేషం. ఆయన దగ్గర డొనేషన్ తీసుకున్న తేజ్ పాల్ సిబల్ కు తెలియకుండానే షేర్లను కేటాయించి, తర్వాత వాటిని బ్రీఫ్ కేస్ కంపెనీలకు అమ్మి తన ఖాతాలో వేసుకున్నాడు. తెహల్కా లో పెట్టుబడుల్లో జరిగిన అక్రమాలపై ఆ సంస్థలోనే పనిచేసిన రామన్ కిర్పాల్ ఫస్ట్ పోస్ట్ కోసం విశ్లేషణాత్మక కథనం అందించారు. అందులో వివరాలు..
తెహల్కా ఒక్క షేర్ మూల విలువ 10 రూపాయాలు. కానీ, ఓ సమయంలో ఓ రోజు మాత్రం ఈ షేర్ ను రూ.13,189 రూపాయాలకు అమ్మేశారు. అయితే, ఇలా అమ్ముకున్న షేర్లన్నీ తేజ్ పాల్ కుటుంబసభ్యులవి, ఇటీవలే తెహల్కా ఎండీ పదవికి రాజీనామా చేసిన షోమా చౌదురివి కావడం విశేషం. తెహల్కాలో పెట్టుబడులు చూస్తే దాదాపు 65 శాతం తృణమూల్ రాజ్యసభ ఎంపీ కేడీసింగ్ కు చెందిన అనంత్ మీడియాది. 19 శాతం మాత్రమే తేజ్ పాల్ ది. ఈ కంపెనీలో రాంజెఠ్మలానికి 165 షేర్లు, కపిల్ సిబల్ కు 80 షేర్లు, లండన్ ఉంటున్న వ్యాపారవేత్త ప్రియాంక గిల్ కు 4242 షేర్లు ఉండేవి. అయితే, వీరిపేర్లమీద షేర్లు ఉన్న విషయం వారికి తెలియదు. రక్షణ కుంభకోణం మీద తెహల్కా స్టింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత, దేశవ్యాప్తంగా తేజ్ పాల్ పేరు మారుమోగిపోయింది. కాంగ్రెస్ లో ఎంతోమంది ఆయనకు సన్నిహితులయ్యారు. దీన్ని సాకుగా అవకాశంగా మల్చుకున్న తేజ్ పాల్ 2005లో చాలామంది నుంచి డొనేషన్ల రూపంలో నిధులు సేకరించారు. 2005లో కపిల్ సిబల్ కూడా ఇలానే 5 లక్షల రూపాయలు తెహల్కాకు డొనేషన్ గా ఇచ్చారు. ఆయన పేరుమీద 80 షేర్లను అలాట్ చేసిన తేజ్ పాల్ ఆ విషయాన్ని మాత్రం సిబల్ కు తెలియజేయలేదు. దీనిపై వివరణ అడిగితే, తాను కేవలం విరాళం మాత్రమే ఇచ్చానని, షేర్ల సంగతి తనకు తెలియదని ఆయన చెప్పారు. జెఠ్మలాని పరిస్థితి కూడా ఇంతే. ఇదే సమయంలో రాజకీయనాయకులు, బాలీవుడ్ స్టార్ల దగ్గర నుంచి దాదాపు 2 కోట్ల రూపాయలను తేజ్ పాల్ డొనేషన్లుగా స్వీకరించినట్లు సమాచారం. తెహల్కాను ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఇలా విరాళాలిచ్చిన వారిలో అమీర్ ఖాన్, నందితాదాస్ లాంటి వారు ఉండడం విశేషం.
కేడీ సింగ్ కాకుండా, తెహల్కాలో ప్రధానంగా మరో ఐదుగురు ఇన్వెస్టర్లున్నారు. ఫక్రుద్దీన్ తాహిర్ భాయ్ ఖోరాకివాలా, ఏకే గురు హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ లైటెడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, వెల్డన్ పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాజస్థాని పత్రిక ప్రైవేట్ లిమిటెడ్ లు పెట్టుబడులు పెట్టాయి. ఖోరాకివాల్, రాజస్థాన్ పత్రిక మినహా మిగిలిన కంపెనీలన్నీ కొన్నిరోజులకే మాయమైపోయాయి. ఇవన్నీ బ్రీఫ్ కేస్ కంపెనీలని తెలుస్తోంది.
- 2003లో ఫీచర్స్ ఎడిటర్ గా ఉన్న షోమా చౌదురికి రూ.10 చొప్పున 1500 ఈక్విటీ షేర్లను కంపెనీ కేటాయించింది. జూన్ 14,2006న వీటిలో 500 షేర్లను రూ.13,189కు ఏకే గుర్తు హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఆమె అమ్మేసింది. వీటి ద్వారా ఆమెకు దాదాపు రూ.66 లక్షలు దక్కాయి. అంటే రూ. 5వేల కొన్న 500 షేర్ల కారణంగా మూడేళ్లలోపే ఆమెకు 66 లక్షలు అందాయన్నమాట. అప్పటికి తెహల్కా ఆర్థికపరిస్థితి కూడా బాలేదు. ఈ సమయంలో ఏకే గుర్తు కంపెనీ అంత ఎందుకు పెట్టి కొనిందన్నదానికి సరైన వివరణే లేదు.
- అదే రోజు తరుణ్ తేజ్ పాల్ భార్య గీతన్ బత్రా 2వేల షేర్లను ఏకే గుర్తు కంపెనీకి రూ.13189 కే అమ్మేశారు. దీనివల్ల ఆమెకు రూ.2.94 కోట్లు దక్కాయి. 20 వేల పెట్టుబడికి దాదాపు మూడు కోట్ల ఆదాయమన్నమాట.
- తేజ్ పాల్ సోదరుడు మింటీ కున్వర్ అదే రోజు 1500 షేర్లను ఏకే గుర్తు కంపెనీకి రూ.13189 కే అమ్మేశారు. దీనివల్ల అతనికి దాదాపు రూ.2 కోట్లు దక్కాయి.
- తేజ్ పాల్ తండ్రి ఇంద్రజిత్ వెయ్యి షేర్లను ఏకే గుర్తు కంపెనీకి రూ.13189 కే అమ్మేశారు. దీనివల్ల అతనికి దాదాపు రూ.1.32 కోట్లు దక్కాయి.
- తేజ్ పాల్ తల్లి శకుంతల్ కూడా వెయ్యి షేర్లను ఏకే గుర్తు కంపెనీకి రూ.13189 కే అమ్మేశారు. దీనివల్ల ఆమెకు దాదాపు రూ.1.32 కోట్లు దక్కాయి.
- తేజ్ పాల్ సోదరి, తెహల్కా సీవోవోగా వ్యవహరిస్తున్న నీనా శర్మ 432 షేర్లను అదే రోజు అదే ధరకు అదే కంపెనీకి అమ్మేశారు. దీనివల్ల ఆమెకు రూ.57 లక్షలు దక్కాయి.
- ఈ సమయంలోతేజ్ పాల్ మాత్రం ఒక్క షేర్ ను కూడా అమ్మలేదు. కానీ, అదేరోజు ఆయన శంకర్ శర్మ, దేవినా మెహ్రా పేరిట ఉన్న 4125 షేర్లను ఒక్కోదానికి కేవలం రూ.10 మాత్రమే ఇచ్చి కొనుక్కున్నారు. అంటే ఒకేరోజు తెహల్కా షేరు విలువ రెండు రకాలుగా ఉందన్నమాట. ఒకదాని ధర రూ.10 అయితే, మరో దారి ధర రూ.13189.
ఇక తెహల్కా ప్రధాన ఇన్వెస్టర్లలో ఖోరాకివాలా కథ మరోలా ఉంది. గోద్రా అల్లర్ల అనంతరం తెహల్కా ఎన్నో స్టింగ్ ఆరేషన్లను నిర్వహించింది. ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో ఖోరాకివాలా దాదాపు రూ.4.65 కోట్ల రూపాయలను ఆయన డొనేషన్ గా అందించారు. కానీ దీన్ని పెట్టుబడిగా చూపించిన తేజ్ పాల్ వాటిని 19326 ఈక్విటీ షేర్లుగా చూపించారు. 2006లో ఈ షేర్లన్నింటినీ ఒక్కో దాన్ని రూ.13189 చొప్పున ఏకే గుర్తు కంపెనీకి అమ్మేశారు. దీనివల్ల రూ.25.49 కోట్లు వచ్చాయి. వాస్తవానికి ఇవన్నీ ఖోరాకివాలాకు వెళ్లాలి. పద్మశ్రీ అవార్డు కూడా పొందిన ఖోరాకివాలా 2011లో మరణించారు. ఇప్పటికీ ఆ డబ్బు ఆయన కుటుంబానికి అందలేదు.
మరో విచిత్రమైన విషయం ఏమిటంటే తెహల్కాలో 2006లో దాదాపు రూ.40 కోట్లు పెట్టుబడి పెట్టిన ఏకే గుర్తు కంపెనీ ఏడాదిలోనే మాయమైపోయింది. అంటే డొనేషన్ల రూపంలో వచ్చిన సొమ్మునంతా ఇలా తన సొంత అకౌంట్లలోని మళ్లించుకున్నారు తేజ్ పాల్.
30, నవంబర్ 2013, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి