3, నవంబర్ 2013, ఆదివారం
ప్రాణాలు దక్కించుకుందామనుకుంటే ప్రాణాలే పోయాయి
Categories :
bokaro express . dead . gotlam accident . news . TOP . train
విజయనగరం జిల్లాలో జరిగిన విషాదకర ఘటన రైలు ప్రయాణీకుల భద్రతను మరోసారి ప్రశ్నార్థకం చేసింది. అలెప్పీ ధన్బాద్ మధ్య ప్రయాణించే బొకారో ఎక్స్ప్రెస్ గొట్లాం దగ్గరకు చేరుకునే సరికి ఎస్-1 బోగీలో మంటలు చెలరేగాయన్న వదంతులు వ్యాపించాయి. ఒక్కసారిగా ఆందోళనకు గురైన ప్రయాణీకులు చైన్ లాగి, రైల్లో నుంచి కిందకు దూకేశారు. అప్పటికే రాత్రి 7 గంటల సమయం కావడం, చీకట్లు ముసురుకోవడంతో పక్కట్రాక్ పై నుంచి రాయగడ-విజయవాడ ప్యాసింజర్ వస్తుందన్న విషయాన్ని గుర్తించలేదు. ప్రయాణీకులు బయటకు దూకడం, ప్యాసింజర్ ట్రైన్ దూసుకురావడం ఏకకాలంలో జరిగిపోయాయి. జనం తేరుకునే లోగానే, రైలు వారిని గుద్దుకుంటూ వెళ్లిపోయింది. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడిపోవడంతో, 18 మంది వరకూ చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేశారు. మృతదేహాలన్నింటినీ వెలికి తీసిన తర్వాత 8 మంది చనిపోయారని నిర్ధారించారు. వీరిలో ఏడుగురిని గుర్తించినా, మరొకరి వివరాలు తెలియడం లేదు. ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆతృతే, ప్రాణం తీసిందంటూ మృతుల బంధువులు రోధిస్తున్నారు. పక్కనే ట్రైన్ ఆగిందన్న విషయాన్ని ప్యాసింజర్ ట్రైన్ డ్రైవర్ గుర్తించి, సైరన్ మోగించినా, జనం కాస్త చూసుకుని దిగినా పెను ప్రమాదమే తప్పి ఉండేది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి