12, నవంబర్ 2013, మంగళవారం
కిరణ్ వెనకడుగుకు కారణమేమిటో..?
Categories :
cm kiran . congress . jaggareddy . POLITICS . rachabanda . sangareddy . telangana . TOP . trs
కాంగ్రెస్ నేతల బహిష్కరణ, టీఆర్ఎస్, టీజేఏసీ బంద్కు పిలుపునిచ్చినా, మెదక్ జిల్లా సంగారెడ్డిలో బుధవారం రచ్చబండ నిర్వహించాలని డిసైడ్ అయ్యి, అన్ని ఏర్పాట్లు చేసుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఢిల్లీలో విభజన ప్రక్రియ ఊపందుకున్న తరుణంలో, తెలంగాణ నుంచే రచ్చబండకు శ్రీకారం చుట్టడం ద్వారా, సమైక్యవాదాన్ని బలంగా వినిపించాలని భావించారు సీఎం కిరణ్. ఈ విషయంలో తన వెన్నంటి నడిచే సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి సహకరించడంతో సంగారెడ్డి రచ్చబండకు ఏర్పాట్లు శరవేగంగా సాగాయి. అసలే కిరణ్ పేరెత్తితే, కస్సుమంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఈ సభను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరూ సభకు హాజరుకాకూడదంటూ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడే ఏకంగా ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి అంతకుముందెప్పుడూ లేదు. పైగా, టీఆర్ఎస్, టీజేఏసీలు కూడా బంద్కు పిలుపునివ్వడంతో సంగారెడ్డిలో ఉత్కంఠభరిత వాతావరణం ఏర్పడింది. అయినా సరే, సభను నిర్వహిస్తానంటూ జగ్గారెడ్డి చెప్పడం కాకపుట్టించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ముఖ్యమంత్రితో సమావేశమైన సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డిలు సీఎంతో రచ్చబండపై చర్చ జరిపారు. సీఎం పర్యటిస్తే, మరింత వ్యతిరేకత వస్తుందని, తాము కూడా హాజరుకాలేని పరిస్థితి ఉందంటూ వివరించారు. దీంతో, ప్రస్తుతానికి సంగారెడ్డి సభను వాయిదా వేసుకోవాలని కిరణ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి