మళ్లీ దీక్షల హడావుడి మొదలయ్యింది. జనాల్ని పిచ్చోళ్లను చేస్తూ రాజకీయ నాయకులు ఆడే పరమపదసోపానపు ఆట రంజుగా సాగుతోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఒకరినికరు అధిగమించేందుకు, ఒకరికి క్రెడిట్ దక్కకుండా మరొకరు ప్రయత్నించేందుకు రాజకీయ శకునులు పాచికలు వేస్తున్నారు.
రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి జగన్ హైదరాబాద్ లో దీక్ష చేస్తుంటే, రాష్ట్ర విభజనతో ఇక జాతీయ రాజకీయాలే దిక్కనుకుంటున్న చంద్రబాబు ఢిల్లీలో సమైక్యాగ్రహం(సత్యాగ్రహం అనలేమేమో..?) చేపట్టారు. సీమాంధ్రలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజల మనోభావాలకు తగ్గట్లుగా ఇలా దీక్షలకు దిగడం రాజకీయనాయకుల దృష్టిలో చూసినప్పుడు తప్పు కాదు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల అభిమానం దక్కించుకోవాలి కాబట్టి, నేతలు ఈ తరహా కుటిలయత్నాలు ఎన్నో చేస్తుంటారు. కొంతకాలం క్రితం కేసీఆర్ కూడా చేసింది ఇదే. అయితే, అప్పుడు పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం, అన్ని రాజకీయపార్టీలు విభజనకు అంగీకరించడంతో కేంద్రం దిగిరావాల్సి వచ్చింది. ఈ సారి ఇటు జగన్, అటు చంద్రబాబు చేస్తున్న దీక్షలకు కేంద్రం దిగివస్తుందా రాదా అన్నదే ఊహకు అందని విషయం.
అయితే, నిజంగా చంద్రబాబుకు, జగన్కు దీక్షలు చేసే నైతికహక్కు ఉందా అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న. ప్రజల కోసమే నేతలు దీక్ష చేస్తున్నట్లైతే గనక ఈ దీక్షలు వాస్తవానికి ఎప్పుడో చేసి ఉండాలి. డిసెంబర్ 9న తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం, తిరిగి డిసెంబర్ 23న మాటమార్చగానే, వీరిద్దరూ దీక్ష చేసి ఉండాలి. తెలంగాణ ప్రజలను మోసం చేయవద్దంటూ గొంతు విప్పాలి. కానీ, అప్పుడు చేయలేదు. ఇప్పుడు చేసే హక్కు కూడా లేదు.
ఇంకా కాదంటే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న రెండు రోజులకు చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి, అపరమేధావిలా సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాలని, సీమాంధ్ర అభివృద్దికి ప్రత్యేక పథకాలను అమలు చేయాలంటూ ప్రకటన చేశారు. దాని బదులు, సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, సమన్యాయం కోసం దీక్ష చేస్తున్నానని అంటే కాస్త సీమాంధ్ర ప్రజల్లోనైనా గౌరవం దక్కి ఉండేది. కానీ, అప్పుడు ఆ మాటే ఎత్తని బాబుకు, ఇప్పుడు దీక్ష చేసే హక్కే లేదు.
సీడబ్ల్యూసీ ప్రకటనకు ముందే వైసీపీఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, సమన్యాయం పేరుతో కొంతకాలం కబర్లు చెప్పి, సమైక్య శంఖారావం పేరుతో చెల్లెలిని సీమాంధ్రల నడిపించిన జగన్కూ ఇప్పుడు దీక్ష చేసే నైతిక హక్కు లేదు. ఇడుపులపాయలో తండ్రి సమాధి సాక్షిగా రాష్ట్రాన్ని విభజించమనే శక్తిగానీ, విభజిస్తే ఆపే శక్తిగానీ లేదంటూ వీరలెవల్లో ఫోజిచ్చిన వైఎస్ తనయుడు, అదే మాటకు కట్టుబడి ఉంటే గనక దీక్ష చేయాల్సిన అవసరమే లేదు.
వీరిద్దరి దీక్షలు జనాన్ని మోసం చేయడానికి, రాజకీయంగా లబ్ది పొందడానికే తప్ప, సీమాంధ్ర ప్రజలకు ఏదో పొడిచేయడానికి కాదు. వైసీపీ ఇప్పటికీ సీమాంధ్ర పార్టీ అయిపోయింది కాబట్టి, రాజకీయ అవసరాల దృష్ట్యా సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ చేస్తుందనుకోవచ్చు. కానీ, తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతున్న చంద్రబాబు, ఈ దీక్షను సమన్యాయం కోసమే చేస్తున్నట్లు చెబుతున్నారు. అసలు సమన్యాయం అంటే ఏమిటి..? ఏం చేస్తే రెండు ప్రాంతాలకు న్యాయం చేసినట్లవుతుంది? ఏం చేస్తే రెండు ప్రాంతాల ప్రజలు ఆమోదాన్ని తెలుపుతారు..? ఈ ప్రశ్నలకు టీడీపీ అధినేత బాబు గానీ, టీడీపీ నేతలు గానీ సమాధానం చెప్పగలరా..? సమైక్యంగా ఉంచితే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందన్న గ్యారెంటీని జగన్ ఇవ్వగలరా.. ? ఈ పరిస్థితుల్లో కేంద్రం వెనక్కి తగ్గితే, సీమాంధ్రలో ఆందోళనలు తగ్గవచ్చేమోగానీ, తెలంగాణలో మొదలుకాకుండా ఉంటాయా..? అందుకే, దీక్షలతో, రెచ్చగొట్టే మాటలతో కాక, సమస్య పరిష్కారానికి ఏం చేయాలన్నది విజ్ఞత గల నేతల్లా అటు జగన్, ఇటు చంద్రబాబు ఆలోచించాల్సి ఉంది. ఉద్యమం ఇంకా కొనసాగితే అంతిమంగా నష్టపోయేది రాష్ట్రం, జనమే కాబట్టి, పరిష్కారానికి కాంగ్రెస్ తో కలిసికట్టుగా ఈ రెండు పార్టీలు వెతకాల్సి ఉంది.
8, అక్టోబర్ 2013, మంగళవారం
ఈ దీక్ష అప్పుడు చేయలేదెందుకు ?
Categories :
chandrababu . congress . deeksha . jagan . POLITICS . samaikya protest . tdp . telangana . TOP . ysrcp
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి