2, అక్టోబర్ 2013, బుధవారం
మోడీతో బాబు ములాఖత్
ఎన్డీఏతో ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఉవ్విళ్లూరుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఢిల్లీలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉదయం ఢిల్లీలో జరిగిన సిటిజన్స్ ఫర్ ఎకౌంటబుల్ గవర్నెన్స్ సదస్సులో ఈ ఇద్దరు నేతలు పాల్గొన్నారు. ఒకరికొకరు ఎదురుపడగానే ఆత్మీయ కరచాలనం చేసుకున్నారు. ఇక ఆ సదస్సులో ఎన్డీఏ పరిపాలనపై ప్రశంసలు కురిపించారు చంద్రబాబు. హైవేలు, మొబైల్ కనెక్టివిటీ, అభివృద్ధి విషయంలో వాజ్ పేయి ఆదర్శవంతమైన పాలన అందించారన్నారు చంద్రబాబు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో దేశం సంక్షోభంలో చిక్కుకుపోయిందని, ఆ కూటమిని గద్దె దించడానికి 2014 ఎన్నికలే మంచి అవకాశమని ఆయన అన్నారు. ఈ సారి కూడా కాంగ్రెస్ ను గెలిపిస్తే, మళ్లీ కష్టాలు కొనితెచ్చుకున్నట్లేనని ప్రకటించారు చంద్రబాబు. ఆ తర్వాత ప్రసంగించిన నరేంద్రమోడి మాత్రం బాబు ప్రస్తావనే తేలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి, బాబు పాలన గురించి నామమాత్రమైనా ప్రస్తావించలేదు. ఇక సదస్సు ముగిసిన తర్వాత, మోడితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు చంద్రబాబు. తాజా రాజకీయ పరిస్థితుల గురించి, వచ్చే ఎన్నికల గురించి వీరిద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం. బీజేపీ-టీడీపీ పొత్తుపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబునే నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బాబు రాక వల్ల ఎన్డీఏ బలపడుతుందని బీజేపీ భావిస్తుంటే, బీజేపీతో కలవడం వల్ల మోడి మ్యాజిక్ వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాలుస్తుందని చంద్రబాబు ఆశిస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి