బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన పీప్లీలైవ్ సినిమా గుర్తుందా.. ఇప్పుడు అలాంటి ఘటనే నిజంగా జరుగుతోంది. కాకపోతే, అక్కడ ఆత్మహత్య కోసం మీడియా పడిగాపులు గాస్తే, ఇప్పుడు మాత్రం వేయి టన్నుల బంగారు నిధి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ప్రతీ క్షణం ప్రత్యక్ష ప్రసారం చేయడం కోసం లైవ్ వాహనాలను మోహరించింది. ఒకప్పుడు ఎక్కడుందో కూడా తెలియని దాండియా ఖేర్ గ్రామాన్ని ప్రతీ ఇంటిలోనూ ప్రతీ రోజూ కనిపించేలా, వినిపించేలా చేస్తోంది. మీడియా హడావుడికి జనం కూడా కుప్పలు తెప్పలుగా దాండియా ఖేర్ గ్రామాన్ని వెదుక్కుంటూ వస్తున్నారు. వీరిని అదుపు చేయడానికి ఓ పోలీస్ ఔట్ పోస్ట్ను ఏర్పాటు చేయడంతో పాటు భారీగా భద్రతను కూడా కల్పించాల్సివచ్చింది.
దాండియా కథేమిటి..?
దాండియా ఖేర్, ఉత్తరప్రదేశ్లోని ఉన్నవ్ జిల్లాలో ఉన్న ఓ మారుమూల గ్రామం. ఈ గ్రామంలోనే 150 ఏళ్ల క్రితం నాటి ఓ కోట, అందులో అద్భుతమైన ఓ శివాలయం ఉన్నాయి. ఈ శివాలయంలోనే వెయ్యిటన్నుల బంగారం నిక్షిప్తం అయ్యి ఉందన్న వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా షికారు చేస్తోంది. ఇంతకాలం ఎవరికీ తెలియని ఈ విషయం ఇంతలా ప్రచారం పొందడానికి కారణం ఓ సాధువు కల.. దానికి ఓ నాయకుడి ఉత్సాహం.. ఆపై పురావస్తుశాఖ పరుగులు. ఉన్నవ్లో ఉండే శోభన్ సర్కార్ అనే సాధువుకు కొంతకాలం క్రితం ఓ కల వచ్చిందంట. దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం, రూపాయి మారకం విలువ పడిపోడంతో తీవ్ర ఆందోళనలో పడిపోయానని చెప్పుకుంటున్న సదరు సాధువుకు.. కలలో దాండియా ఖేర్ ను ఒకప్పుడు పాలించిన రాంభక్ష్సింగ్ కలలోకి వచ్చాడట. ఆలయం పరిసర ప్రాంతాల్లో వెయ్యిటన్నుల బంగారాన్ని దాచిపెట్టానని దాన్ని వెలికి తీసి దేశాన్ని కాపాడాలని చెప్పాడట. దీనిపై ప్రధానికి కూడా లేఖ రాశానంటున్న శోభన్ సర్కార్, అక్కడినుంచి జవాబు మాత్రం రాలేదంటున్నాడు. ఇంతలోనే తనకు వీర విధేయుడైన కేంద్రమంత్రి చరణ్ దాస్ మహంత్ చెవిలో ఈ ముక్క చెప్పాడా సాధువు. ఆయన కాస్తా వెళ్లి ఆ రహస్యాన్ని రాహుల్ ముందు విప్పాడు. ఇంకేముంది.. యువరాజా వారు వెంటనే ఆ వెయ్యి టన్నుల బంగారం అంతు చూడాలంటూ పురావస్తు శాఖను ఆదేశించాడట. ఎన్నో సర్వేలు, మరెన్నో లెక్కలు వేసుకుని కానీ కదలని పురావస్తుశాఖ సార్ గారి ఆదేశాలతో ఉరుకులు పరుగులు మీద దాండియా ఖేర్ కోటకు చేరుకుంది. సాధువుతో మాట్లాడి ఆయన చూపించిన ప్రాంతాల్లో డ్రిల్లింగ్ మొదలుపెట్టింది. భూమిలో గట్టిగా ఏదో తగిలిందని అది నేలమాలిగే అయి ఉంటుందని అప్పటికప్పుడు నిర్ధారణకు వచ్చేసి పూర్తిస్థాయిలో తవ్వకాలను మొదలుపెట్టింది.
దాండియా ఖేర్లో బంగారు నిధి ఉందని తెలిసిన వెంటనే చుట్టుపక్కల నుంచి జనం ఈ ఆలయాన్ని చూడడానికి బారులు తీస్తున్నారు. ఇంక బియ్యంగింజంత ఉన్నదాన్ని బండరాయంత చేసే మీడియా ఉత్సాహానికైతే లెక్కేలేదు. జాతీయ ఛానళ్లకు చెందిన దాదాపు 20 ఓబీ(లైవ్) వ్యాన్లు దాండియాలో తిష్టవేశాయి. సీనియర్ రిపోర్టర్లను ఎప్పటికప్పుడు సమాచారం అందించడానికి మోహరించాయి. వీరందరి సందడితో దాండియా ఖేర్ స్థానికులకు మాత్రం కొత్త ఉపాధి దొరికింది. ఆలయం చుట్టుపక్కల హోటళ్లను, టీ దుకాణాలను ఏర్పాటు చేసి జోరుగా బిజినెస్ మొదలుపెట్టారు. బంగారం దొరుకుతుందో లేదో గానీ, మాకు మాత్రం పని దొరికిందంటున్నారు స్థానికులు. తమ ఊరి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగడం విని సంతోషపడిపోతున్నారు.
మరోవైపు ఈ తవ్వకాల వ్యవహారం సుప్రీంకోర్టునూ చేరింది. కోర్టు పర్యవేక్షణలోనే జరగాలంటూ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. అటు ఈ తవ్వకాల విషయంలో తనకు సరైన గౌరవం ఇవ్వకపోతే మాత్రం నిధిని వెలికితీసేవారికి కష్టాలు తప్పవంటూ ముందునుంచే హెచ్చరిస్తున్నాడు బంగారు కల గన్న శోభన్ సర్కార్.
18, అక్టోబర్ 2013, శుక్రవారం
వెయ్యి టన్నుల బంగారం ఏమోగానీ.. వారి పంట మాత్రం పండుతోంది
Categories :
1000 tonnes gold . asi . daundia kheda . excavation . news . temple . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి