కాంగ్రెస్ హైకమాండ్ ఆశీస్సులతో అనూహ్యంగా సీఎం పదవిని అందుకుని పరిపాలననంతా తన చేతుల్లోకి తీసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారు. సమైక్య ఉద్యమం మొదలైన పదిరోజుల దాకా పెద్దగా స్పందించని సీఎం, ఉద్యమ తీవ్రతను చూసి రూట్ మార్చారు. ఈ ఉద్యమాన్నే తన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పే మెట్టుగా మార్చుకోవాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో తనకు మరో రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశ్యం లేదని చెప్పినప్పటికీ, సీఎం వర్గం ఆమేరకు కసరత్తు చేసినట్లే తెలుస్తోంది. విశాఖ పర్యటనకు సోమవారం వెళ్లాల్సిన సీఎం, అక్కడే కాంగ్రెస్ అధిష్టానానికి తనకు సంబంధం లేదనే విషయాన్ని ప్రకటించడానికి ఏర్పాట్లు జరిగాయి. కానీ, చివరి నిమిషంలో ఆ పర్యటన వాయిదా పడింది.
ప్రస్తుతం సీఎం కిరణ్ తీరు చూస్తుంటే, తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికన్నట్లే ఉందని కాంగ్రెస్ లోని సీనియర్లు, మంత్రులే బాహటంగా వాపోతున్నారు. పార్టీని, మంత్రిమండలిని ఆత్మరక్షణలో పడేసేలా సీఎం కామెంట్లు చేస్తుండడంపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానంతో తలపడే స్టార్ బ్యాట్సమెన్ గా, సమైక్య సింహంగా సీఎం కిరణ్ ను ఇప్పటికే సీమాంధ్ర నేతలు, ఉద్యమకారులు పైకెత్తేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మరెవరూ అధిష్టానంతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి లేకపోవడంతో సమైక్యవాదులకు ఏకైక లీడర్ గా సీఎం కనిపిస్తున్నారు. అందుకే, ఉద్యోగుల్లో, ఉద్యమకారుల్లో ఆయనకు పూర్తి మద్దతు లభిస్తోంది. పైగా జగన్ సమైక్య స్టాండ్ తీసుకున్నప్పటికీ, కాంగ్రెస్ తో ఒప్పందంలో భాగంగానే బెయిల్ దక్కించుకున్నారన్న ప్రచారం ఆయనకు మైనస్ గా మారింది. సీమాంధ్రలోనూ ఇప్పుడు జగన్ పూర్తిస్థాయిలో ఆదరణ లేదు. ఇక అటు తెలంగాణ, ఇటు సమైక్య మాటలతో టీడీపీ ఎటూ కాకుండా ఉంది. కాంగ్రెస్ అధిష్టానంపై సీమాంధ్ర ప్రజలంతా మంటతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్ కొత్త పార్టీ పెడితే, అది అందరికీ ప్రత్యామ్నాయంగా ఎదిగి, వచ్చే ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయవచ్చన్న చర్చ సమైక్యవాదుల్లో జరుగుతోంది. దీన్నంతా గమనించే, విశాఖ వేదికగా తాను కాంగ్రెస్ నుంచి బయటకు వస్తున్నానని సీఎం చెప్పాలనుకున్నట్లు సమాచారం. మంత్రి గంటా ఏర్పాటు చేసిన ఈ టూర్ లో వంద కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ను సీఎం ప్రారంభించాల్సి ఉంది. ఎక్కడా కాంగ్రెస్ జెండా అన్నది కనిపించకుండా, కేవలం సీఎం పోస్టర్లతోనూ, సమైక్యసింహం అంటూ కటౌట్లతోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. అయితే, సీఎం ప్రెస్ మీట్ పై అధిష్టానం తీవ్ర ఆగ్రహంగా ఉండడం, ఆయన ఫోన్ కాల్స్ కు కూడా స్పందించకుండా పక్కన పెట్టడం, చివరకు ఎవరు వెళ్లినా సమయం ఇచ్చి మాట్లాడే దిగ్విజయ్ కూడా సీఎం ఫోన్లకు స్పందించకపోవడంతో, ప్రస్తుతానికి ఈ కొత్త పార్టీ కాన్సెప్ట్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఏమైనా సమైక్య ఉద్యమం ఇదే స్థాయిలో కొనసాగి, కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ వైపే అడుగులు వేస్తే మాత్రం సీఎం కొత్త పార్టీ పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.
1, అక్టోబర్ 2013, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి