సీబీఐ కోర్టులో ఉదయమే ఈ కేసులో వాదనలు మొదలుకానున్నాయి. కుంభకోణానికి పాల్పడ్డ లాలూకు తక్కువ శిక్ష ఎందుకు వేయాలన్నదానిపై వాదనలను విననుంది కోర్టు. లాలూ తరపున సీనియర్ అడ్వకేట్ సురేందర్ సింగ్ వాదించబోతున్నారు. లాలూ కుంభకోణానికి పాల్పడినట్లు నేరుగా సాక్షాలు ఎక్కడా లేకపోవడంతో పాటు, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన వ్యక్తి కావడం, డయాబెటిస్, హైపర్ టెన్షన్తో బాధపడుతుండడాన్ని పరిగణనలోకి తీసుకుని తక్కువ శిక్ష విధించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేయనున్నారు. మధ్యాహ్నం వరకూ కేసులో వాదనలను కోర్టు వింటుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం ఈ కేసులో శిక్షలను ఖరారు చేయనుంది. లాలూ ఇప్పటికే దోషిగా తేలడంతో అరెస్ట్ అయ్యి బిర్సా ముండా సెంట్రల్ జైల్లో ఉన్నారు. శిక్ష ఖరారైన తర్వాత వెంటనే బెయిల్ తెచ్చుకునే అవకాశం కూడా లూలూకు లేదు. దీనిపై హైకోర్టులో వెంటనే అప్పీల్ చేసుకునే వీల్లేకుండా, రేపట్నుంచి పదిహేను రోజుల పాటు రాంచీ హైకోర్ట్ దసరా సెలవుల్లో ఉండనుంది. కోర్టు సెలవులు పూర్తయ్యే వరకూ లాలూ జైల్లోనే ఉండాలి. ఆ తర్వాతన్నా బెయిల్ వస్తుందా లేదా అన్నది సందేహమే.
నేరచరితులను రక్షించుకునే ఆర్డినెన్స్ను కేంద్రం ఉపసంహరించుకోవడంతో, లాలూ రాజకీయ జీవితానికి సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పు చరమగీతం పాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడినవాళ్లు శిక్షాకాలం పూర్తైన తర్వాత ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో, లాలూకు కనీసం ఐదేళ్లు శిక్ష పడినా మరో రెండు మూడు ఎన్నికల వరకూ పోటీ చేయడానికి లాలూకు వీలుండదు. అప్పటికే వయసైపోతుంది కాబట్టి చేసేదేమీ ఉండదు. నితీశ్ హవాకు బీహార్లో కొట్టుకుపోయిన ఆర్జేడీ... లాలూ జైలు పాలైతే పూర్తిగా నిర్వీర్యమైపోవచ్చు. లాలూ భార్య రబ్రీదేవి,కొడుకు కలిసి పార్టీని నడిపిస్తామని చెబుతున్నా, బీహార్ రాజకీయాలను ఎంతవరకూ తట్టుకోగలరన్నది సందేహమే. ఏ రకంగా చూసినా, సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పు లాలూ పొలిటికల్ లైఫ్కు ఎండ్ కార్డ్ వేస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కామెంట్ను పోస్ట్ చేయండి