5, అక్టోబర్ 2013, శనివారం
సమ్మెలోకి విద్యుత్ ఉద్యోగులు.. అలముకోనున్న చీకట్లు
Categories :
news . no power generation . power strike . seemandhra vidyut jac . TOP
టీనోట్ కు నిరసనగా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీసీ)లో 48 గంటల విధుల బహిష్కరణతో కలకలం సృష్టించిన సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు, నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సమ్మె మొదలుకానుంది. సీమాంధ్రలోని అన్ని పవర్ ప్లాంట్లలోనూ విధులు బహిష్కరిస్తామని విద్యుత్ జేఏసీ ప్రకటించింది. వీటీపీఎస్ లో విద్యుదుత్పత్తి జరగకపోవడంతో సీమాంధ్రలో పలు ప్రాంతాల్లో అంధకారం కొనసాగుతోంది. వీటీపీఎస్ సామర్థ్యం 1760 మెగావాట్లు కాగా, కేవలం 250 మెగావాట్లు మాత్రమే కష్టంమీద ఉత్పత్తి జరుగుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ లో జలవిద్యుదుత్పత్తిని కూడా నిలిపివేస్తామని ప్రకటించింది సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ. సీమాంధ్రలో మొత్తం 4500 పైగా మెగావాట్ల విద్యుత్ ప్రతీరోజు అవసరం. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోనూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఒక్కసారిగా విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడం వల్ల సీమాంధ్రలో పలుచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి కూడా వెళ్లకూడదని విద్యుత్ ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణపై కేంద్రం వెనక్కి తగ్గేవరకూ తమ సమ్మె కొనసాగుతుందని, ఈ సారి ఎలాంటి అత్యవసర సర్వీసులకూ మినహాయింపు ఇవ్వడం లేదని ప్రకటించారు విద్యుత్ ఉద్యోగులు. కొద్దిపాటి విద్యుత్ నే ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడానికి నానా కష్టాలు పడుతున్న అధికారులు, ఇంత భారీ మొత్తంలో ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ ను కొనుగోలు చేసే అవకాశం కూడా లేదు. పైగా, ఒక్కసారిగా భారీ లోటు ఏర్పడడం వల్ల దక్షిణాది గ్రిడ్ కుప్పకూలే అవకాశం ఉందంటున్నారు విద్యుత్ నిపుణులు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి