6, సెప్టెంబర్ 2013, శుక్రవారం
రేపు ఏమవుతుందో?
Categories :
apngo . hyderabad . lb stadium meeting . POLITICS . save andhra pradesh . TOP
ఏపీఎన్జీవోలు తలపెట్టిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభ నేపథ్యంలో హైదరాబాద్లో హైటెన్షన్ ఏర్పడింది. కేవలం ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని హైకోర్ట్ స్పష్టంగా చెప్పినప్పటికీ, ఉద్యోగేతర వర్గాలు సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పోలీసులు కూడా ఉద్యోగులకు మాత్రమే అనుమతిస్తామని చెప్పినప్పటికీ, వీరంతా రావడం ఉద్రిక్తతలను సృష్టించేలా కనిపిస్తోంది. సమైక్యాంధ్ర కోసం చేస్తున్న సభ కన్నా, సీమాంధ్రుల బలాన్ని హైదరాబాద్ లో చూపించాలన్న భావన బలపడడంతో, పెద్ద ఎత్తున సమైక్యవాదులు తరలివస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో హైదరాబాద్ లో మిలియన్ మార్చ్, సాగర హారాలకు అనుమతి ఇవ్వకుండా చివరిదాకా లాక్కొచ్చి, చివరకు హైకోర్ట్ అనుమతి ఇచ్చినా జిల్లాల సరిహద్దుల్లో భారీగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన పోలీసులు, ఈ సారి మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగేతర వర్గాలు భారీగా హైదరాబాద్ కు వస్తున్నా ఎక్కడా అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. వస్తున్న తెలంగాణను అడ్డుకుంటున్నారన్న ఆగ్రహంతో ఉన్న తెలంగాణ వాదులకు, ఈ చర్య మరింత రెచ్చగొట్టేలానే కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సభను అడ్డుకుంటామని విద్యార్థి సంఘాలు, ఎంఆర్పీఎస్ ప్రకటించడంతో రేపు హైదరాబాద్లో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఏపీఎన్జీవోలు నిర్వహిస్తున్న సభను బలప్రదర్శనగా మార్చకుండా, కేవలం ఉద్యోగులు మాత్రమే పాల్గొనేలా చేస్తే శాంతియుత వాతావరణం నెలకొనే అవకాశాలున్నాయి. అందర్నీ హైదరాబాద్ సభకు అనుమతిస్తే, పరిస్థితులు అదుపు తప్పే అవకాశాలే ఎక్కువ.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి