కోతికి కొబ్బరిచిప్ప దొరకడమూ.. టీవీ 9కి బ్రేకింగ్ న్యూస్ దొరకడమూ దాదాపుగా ఒకటే. ఏదైనా విషయాన్ని రచ్చరచ్చ చేయడంలోనూ, పీకిపాకం పెట్టడంలోనూ టీవీ9ని మించినవాళ్లు ఉండరు. ఆడవాళ్ల గొడవల దగ్గర నుంచి అంతర్జాతీయ అంశాల దాకా దేన్నైనా బ్రేకింగ్ న్యూస్ గావేయగలదు.. గంటలకొద్దీ లైవ్ లూ, డిస్కషన్ లూ నడపగలదు. అలాంటిది జగన్ కేసులో గీతారెడ్డి పేరును సీబీఐ ఛార్జ్ షీట్లో పెట్టిందన్న విషయాన్ని మాత్రం టీవీ9 పెద్దగా పట్టించుకోలేదు. అన్ని ఛానళ్లు బ్రేకింగ్స్ మీద బ్రేకింగ్స్ వేస్తుంటే, టీవీ 9 మాత్రం సాదాసీదాగా సమైక్య ఆందోళనలు చూపించింది. జగన్ కేసులో చిక్కుకున్న నాలుగో మంత్రి గీతారెడ్డి. సబితారెడ్డి విషయంలో బీభత్సంగా లైవ్ లు నడిపించిన టీవీ9, గీతారెడ్డి విషయంలోనూ, సీబీఐ తాజాగా దాఖలు చేసిన ఇందూ, లేపాక్షి ఛార్జి షీట్ల విషయంలో ఏ మాత్రం హడావుడి చేయకపోవడం వీక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి. దీనికి కారణం ఏమిటని లోతుగా పరిశీలిస్తే, కొన్ని విషయాలు బయటపడ్డాయి.
ఇందూ గ్రూప్ అధినేత శ్యాంప్రసాదరెడ్డికి, టీవీ9 యాజమాన్యానికి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఇందూ గురించి, శ్యాంప్రసాద్ రెడ్డి గురించి బ్రేకింగ్స్ గానీ, లైవ్ లు కానీ ఇవ్వొద్దని సిబ్బందికి ముందే స్పష్టమైన ఆదేశాలు వెళ్లిపోయాయట. దాంతో, అంతా ఈ అంశాన్ని వదిలేశారు. సరే, ఛానల్ వాళ్లది, ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు, ఏది వద్దంటే అది వదిలేయవచ్చు. కానీ, మీడియా తానే మార్గదర్శిలాగా, అత్యంత పవిత్రమైనదానిలా అందరికీ బుద్దులు చెబుతూ, ఇలాంటి పనులు చేయడం మాత్రం సరికాదు. ఇలాంటివి చేసే ముందు ఇతరులకు నీతులు వల్లించడం మానేస్తే మంచిది.
ఇక టీవీ9 గురించి మరో అంశం. రంగు రాళ్లు ధరించడం అంధవిశ్వాసం అంటూ బ్రేక్స్ లో టీజర్ వదులుతూ ఉంటుంది. రాత్రి 11 దాటిన తర్వాత అదే ఛానల్ లో దివ్య డైమండ్ అంటూ ఓ కమర్షియల్ ప్రసారం అవుతుంది. దివ్య డైమండ్స్ ధరించడం వల్ల జాతకం ఎలా మారిపోతుందో అందులో చెబుతుంటారు. టీవీ 9 చేసే ప్రచారానికి ఇది పూర్తిగా విరుద్ధమైన కార్యక్రమం. ఈ కమర్షియల్ డబ్బుల కోసం కక్కుర్తి పడినప్పుడు, ఆ రంగు రాళ్లు ధరించండం అంధివిశ్వాసం అన్న ట్యాగ్ లైన్ ను తీసేస్తే మంచిదేమో..
18, సెప్టెంబర్ 2013, బుధవారం
టీవీ 9 అలా చేసిందెందుకు?
Categories :
breaking news . geerareddy news . indu links . news . TOP . tv9
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి