రాష్ట్ర విభజన సెగ ఆర్టీసీని అథోగతి పాలు చేస్తోంది. సమైక్య ఉద్యమం కారణంగా ఇప్పటికే సీమాంధ్ర జిల్లాల్లో బస్సులు అరకొరగా నడుస్తున్నాయి. సర్వీసులు రద్దు కావడం కారణంగా రోజుకు నాలుగుకోట్ల రూపాయల వరకూ ఆర్టీసీ నష్టపోతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 4600 కోట్ల రూపాయల నష్టాల్లో ఆర్టీసీ ఉంది. ఆర్టీసీ ఉపయోగపడుతున్నంతగా, ప్రజలకు ఉపయోగపడే మరో ప్రభుత్వ సర్వీసు రాష్ట్రంలో లేదు. ఆర్టీసీ ఛార్జీలకు, ప్రైవేటు బస్సు ఆపరేటర్ల ఛార్జీకి మధ్య వ్యత్యాసం చూస్తే అది అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఆర్టీసీ అన్నదే లేకపోతే, ప్రైవేటు ఆపరేటర్ల దోపిడీకి హద్దనేదే ఉండదు. అలాంటి ఆర్టీసీకి ఇప్పుడు సమ్మెట పోటు మొదలయ్యింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలోని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈ నెల 12 నుంచి సమ్మెకు దిగుతున్నాయి. అటు ఈ సంఘాల తీరుకు నిరసనగా, రాష్ట్ర విభజన చేయాలంటూ తెలంగాణలోని ఆర్టీసీ యూనియన్లూ అదే సమయం నుంచి సమ్మెకు సిద్ధమయ్యాయి. ఈ పోటాపోటీ సమ్మెల వల్ల నష్టపోయేది ఎవరు.. రాష్ట్ర విభజనకు ఆర్టీసీకి సంబంధం ఏమిటి.. కార్మికులారా ఒక్క క్షణం ఆలోచించండి. గతంలోనూ తెలంగాణలో సమ్మె జరిగినప్పుడు వచ్చిన నష్టం ఇంతవరకూ పూడ్చుకోలేకపోయింది ఆర్టీసీ. మీ మనోభావాలకు తగ్గట్లుగా పోరాడడంలో తప్పు లేదు. కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యంతో, రకరకాల కారణాలతో అసలే సగం చచ్చిన ఆర్టీసీని మీరు పూర్తిగా చంపకండి. మీకు అన్నం పెడుతున్న తల్లినే ఉరితీయకండి.
8, ఆగస్టు 2013, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి