తెలంగాణ విషయం ఇంతవరకూ వచ్చిందంటే, దానికి కారణం ఓ రకంగా నవంబర్, 2009లో కేసీఆర్ చేస్తానన్న దీక్షే ఓ కారణం. కేసీఆర్ దీక్ష చేపట్టకుండా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడంతో, ఆయన జైల్లోనే దీక్ష మొదలుపెట్టారు. ఆ తర్వాత హాస్పిటల్ కు తరలించడం, వైద్యం తీసుకున్నా ద్రవాహారం ముట్టుకోకపోవడం, కేసీఆర్ ఆరోగ్యం విషమించడంతో, డిసెంబర్ 9,2009న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అన్నీ వరసగా జరిగిపోయాయి. ఆ తర్వాత కథ మారినా, ఇన్నాళ్లకు మళ్లీ తెలంగాణపై స్పష్టంగా కాంగ్రెస్ ప్రకటించగలిగింది. దీంతో పాటే, సీమాంధ్రలోనూ ఉద్యమం మొదలయ్యింది.
సీమాంధ్రలో సాగుతున్న సమైక్య ఉద్యమాన్ని మొదట్నుంచి సొమ్ము చేసుకునే పనిలో ఉన్న వైసీపీ, అందరికన్నా ముందుగానే రాజీనామాల అస్త్రాన్ని సంధించింది. ఇటీవలే, జగన్, విజయమ్మలు కూడా తమ పదవులకు రాజీనామాలు చేయడంతో, వైసీపీ పూర్తిగా సమైక్య వాదానికే మద్దతిస్తోందని తేలిపోయింది. తెలంగాణలో సీనియర్లంతా వైసీపీకి ఇప్పటికే రాజీనామాలు చేయడంతో, పూర్తిగా సీమాంధ్ర ప్రాంతంపైనే ఆశలు పెట్టుకుని, అక్కడ పట్టు పెంచుకోవడానికి పావులు కదుపుతోంది ఆ పార్టీ. అందులో భాగంగానే విజయమ్మ దీక్ష తెరపైకి వచ్చింది.
ప్రధానికి విజయమ్మ రాసిన లేఖలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరిగేలా విభజన చేయాలని, అలా చేయలేకపోతే మాత్రం రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారావిడ. ( అంటే విభజన కోరుకుంటున్న తెలంగాణకు అన్యాయం జరిగినా పర్వాలేదన్నమాట.) విజయమ్మ దీక్షతో సీమాంధ్ర వైసీపీకి పూర్తిగా పట్టు చిక్కుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే, కేసీఆర్ దీక్షలా విజయమ్మ దీక్ష కేంద్రంతో ప్రకటన చేయించగలదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు విజయమ్మను దీక్ష చేయడానికి కూర్చోనిస్తారా.. లేక ముందే అరెస్ట్ చేస్తారా అన్నదీ ఉత్కంఠను సృష్టిస్తోంది. ఫీజు రీఎంబర్స్ మెంట్ కోసం కొంతకాలం క్రితం నిరవధిక దీక్ష మొదలుపెట్టిన విజయమ్మ, ప్రభుత్వం ఎంతకీ పట్టించుకోకపోవడంతో, తనకు తానే విరమించాల్సి వచ్చింది. ఈసారి కూడా అదే పద్దతిలో ప్రభుత్వం వ్యవహరించవచ్చన్న వాదన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
15, ఆగస్టు 2013, గురువారం
ఆ దీక్షను ఈ దీక్ష డామినేట్ చేయగలుగుతుందా?
Categories :
deeksha . kcr . POLITICS . samaikya protest . seemandhra . telangana . TOP . trs . vijayamma . ysrcp
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
21వ శతాబ్దంలో కూడ అమరణ నిరాహార దీక్షలు ఏమిటి?
ఇది బ్లాక్ మెయిల్ రాజకీయం మాత్రమే.
అమరణ నిరాహార దీక్షలు నిషేదించాలి.అలాగే ఇలాంటి సమయంలో ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళకి మానసికవైద్యం చేయించాలి.