రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకటించగానే, యధావిధిగా సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. రాజకీయేతర జేఏసీ, విద్యార్థి జేఏసీలు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. బంద్ ను విజయవంతంగా చేపట్టాయి. అయితే, డిసెంబర్ 9, 2009న చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందంటూ చేసిన ప్రకటన తర్వాత ఆందోళనలతో పోల్చితే, ఈ సారి ఆందోళనలు కాస్త తక్కువే అని చెప్పాలి. అప్పట్లో పార్టీల కతీతంగా అన్ని పార్టీల నేతలంతా కదనరంగంలోకి దూకేశారు. రాజీనామాలను చేసి ఒక్కసారిగా కేంద్రాన్ని ఆత్మరక్షణలోకి పడేశారు. సీమాంధ్ర నేతల దెబ్బకు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి, డిసెంబర్ 23న మరో స్టేట్ మెంట్ ను ఇవ్వాల్సి వచ్చింది.
కానీ, ఇప్పుడో కేంద్ర ప్రకటనపై ఆందోళనలు జరుగుతున్నాయి. కానీ, అన్ని పార్టీల నేతలూ వీటిలో భాగస్వామ్యులు కాలేకపోతున్నారు. ఒకరో ఇద్దరో తప్ప, రాజీనామాలపై ప్రజాప్రతినిధులు కదిలి రావడం లేదు. రాజీనామా చేస్తే తమకు లాభమా, నష్టమా అన్న లెక్కల్లో మునిగిపోయారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నేతలు ఈ సారి పూర్తిగా వెనకడుగు వేశారు. గతంలో జరిగిన ఆందోళనల్లో టీడీపీ నేతలదే ప్రధాన పాత్ర.. ఈ సారి మాత్రం ఒక్క టీడీపీ నేత కూడా రోడ్డెక్కలేదు. గత ఆందోళనను చంద్రబాబే ప్రోత్సహించారని విమర్శలు రావడం, రెండుకళ్ల సిద్ధాంతంతో రాజకీయంగా ఇరుకున పడడంతో కొన్నాళ్లుగా సీమాంధ్ర నేతలకు కట్టడి చేశారు చంద్రబాబు. విభజన,సమైక్య వాదాలపై ఎవరూ గొంతు ఎత్తవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో, ఈసారి ఆందోళనల విషయంలో టీడీపీ నేతలు వేచి చూసే ధోరణినే అవలంభిస్తున్నారు. పైగా, ఈ గొడవనంతా కాంగ్రెస్ పార్టీ వ్యవహారంగానే టీడీపీ చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంది. బాబు మాట జవదాటకుండా విధేయతను ప్రదర్శిస్తున్నారు సీమాంధ్ర తెలుగు తమ్ముళ్లు.
తెలంగాణకు అంగీకరిస్తూ కాంగ్రెస్ ప్రకటన చేసిన ఒక్కరోజు తర్వాత మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు, తాను తెలుగువారందరికీ ప్రతినిధిని అని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీ తెలుగువాళ్ల అభివృద్ధి కోసం పుట్టిందని, రెండు రాష్ట్రాల్లో ఉన్నా, అందరి అభివృద్దే తమకు ముఖ్యమని ఆయన ఉద్ఘాటించారు. సీమాంధ్రలో ఏర్పాటయ్యే కొత్త రాజధానికి లక్షకోట్లకు పైగా ఖర్చవుతుందని, దాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు బాబు. దీంతో, విభజన విషయంలో టీడీపీ స్టాండ్ ను మరోసారి క్లియర్ చేశారు. ఇక క్లియర్ కావాల్సింది సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పిన కాంగ్రెస్ నేతలు, ఆ మాటకు ఎంతవరకూ కట్టుబడి ఉంటారన్నదే ఇప్పుడు కీలకం. పైగా, సమైక్యవాదాన్ని వినిపించిన సీఎం కిరణ్ , ఈ ఆందోళనలను ఎంతవరకూ కంట్రోల్ చేస్తారన్నదీ ఇప్పుడు ఆసక్తికరమే. చంద్రబాబులా తమ పార్టీ నేతలకు కంట్రోల్ చేసే దమ్ము సీఎం కిరణ్ కు, పీసీసీ చీఫ్ బొత్సకు ఉన్నదా అన్నదీ ప్రశ్నార్థకమే.
31, జులై 2013, బుధవారం
మగాడంటే బాబురా బుజ్జీ..!
Categories :
chandrababu . division . POLITICS . seemandhra . tdp . telangana . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి