30, జులై 2013, మంగళవారం
ఇవాళన్నా తేలుతుందా..
ఆంధ్రప్రదేశ్ కు ఇదే చివరి రోజని మీడియా కోడై కూస్తోంది. రాష్ట్ర విభజనపై యూపీఏ భాగస్వామ్య పక్షాల భేటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇవాళే ఉండడంతో ఈ రాత్రి కల్లా రాష్ట్ర విభజనపై ఏదో ఓ ప్రకటన వచ్చేస్తోందని చెబుతోంది. నిన్నటి దిగ్విజయ్ సింగ్ మాటలను బట్టి చూస్తే, ఇవాళ ఏదో ఓ ప్రకటన రావడం ఖాయం. కానీ, కాంగ్రెస్ గత చరిత్ర చూస్తే మాత్రం ఏదో అనుమానం. చివరివరకూ లాగి, చివర్లో వాయిదా వేయడం హస్తంపార్టీకి ఎప్పటినుంచో ఉన్న అలవాటే. మొన్నటి కోర్ కమిటీ మీటింగ్లోనే తేలిపోతుందని అంతా అనుకున్నా, అది కాస్తా సీడబ్ల్యూసీకి వాయిదా వేసి మరికొంతకాలాన్ని నెట్టుకొచ్చింది హైకమాండ్. ఆ తర్వాత జరిగిన కోర్ కమిటీలోనే అన్నా తేలుతుందనుకుంటే దాన్నీ నాన్చుడు ధోరణితోనే సరిపెట్టింది. చివరకు ఇవాళ రెండు కీలక భేటీలను నిర్వహిస్తుండడంతో అటు సమైక్య వాదుల్లోనూ, ఇటు తెలంగాణ వాదుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లా ఉంది పరిస్థితి. కాంగ్రెస్ ఎవరి వాదానికి ఓటేస్తుందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. రాయల తెలంగాణ వస్తుందంటూ కొన్ని రోజులుగా ఊహాగానాలు చెలరేగినా, జాతీయ మీడియా మాత్రం పది జిల్లాల తెలంగాణ వైపే కాంగ్రెస్ మొగ్గుచూపుతోందంటూ చెప్పుకొస్తోంది. కాంగ్రెస్ వ్యవహారశైలి కారణంగా ఎంతోకాలంగా మండుతున్న విబేధాలకు ఇప్పటికైనా ఓ స్పష్టమైన ప్రకటనతో తెరదించుతుందని ఆశిద్దాం.. మరో సారి నిర్ణయాన్ని వాయిదా వేయవద్దని కోరుకుందాం..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి