12, జులై 2013, శుక్రవారం
ఊరించి ఉస్సూరు మనిపించారు..
ఇదిగో తేలిపోతుంది.. అదిగో తేలిపోతోందంటూ పదిరోజులుగా ఊదరగొట్టిన కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణ విషయంలో మళ్లీ పాతపాటే పాడింది. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ లను రోడ్ మ్యాప్ తెమ్మని తేల్చేస్తామన్న కాంగ్రెస్ హైకమాండ్, దాదాపు రెండు గంటల పాటు ప్రధాని నివాసంలో సుదీర్ఘంగా కసరత్తు చేసింది. డిప్యూటీ సీఎం మొదటగా, ఆ తర్వాత పీసీసీ చీఫ్, చివరగా సీఎం తమ వాదనను సోనియా కు వివరించారు. ప్రధాని మన్మోహన్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ, ఆంటోనీ, దిగ్విజయ్, ఆజాద్ లు హాజరైన ఈ భేటీలో, రాష్ట్ర నాయకత్రయం ఇచ్చిన వివరణను పూర్తిగా విన్నారు. అయితే, రాష్ట్ర విభజన విషయాన్ని కేవలం కోర్ కమిటీ భేటీతో తేల్చేయలేమని భావించిన నేతలు, దీన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. మరో వారం పదిరోజుల్లో సీడబ్లూసీలో దీనిపై చర్చిస్తామని, భేటీ అనంతరం ప్రకటించారు దిగ్విజయ్ సింగ్. వర్కింగ్ కమిటీలో నిర్ణయించిన తర్వాత, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వర్కింగ్ కమిటీలోని కీలక నేతలైన సోనియా, రాహుల్, ప్రధాని మన్మోహన్ లు ఉన్న కోర్ కమిటీలోనే నిర్ణయం తీసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, సీడబ్ల్యూసీలో అయినా స్పష్టత ఇస్తారన్న నమ్మకం కలగడం లేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, విభజన అంశాన్ని వీలైనంతగా నాన్చేధోరణినే కాంగ్రెస్ కొనసాగించేటట్లు కనిపిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి