ఉత్తరకాశీలో అంత వరద ఒక్కసారిగా ఎందుకు వచ్చింది? సాధారణ వర్షపాతం కన్నా ముప్పై రెట్లు వర్షం ఎందుకు కురిసింది? ప్రశాంతంగా ఉన్నకొండచెరియలు ఒక్కసారిగా ఎందుకు విరిగిపడ్డాయి? వేలాది మంది ప్రాణాలు ఒక్కసారిగా ఎందుకు మట్టికొట్టుకుపోయాయి..? వీటన్నింటికీ ఇప్పుడు ఉత్తరాఖండ్ లో వినిపిస్తున్న సమాధానం ఒక్కటే.. ధారీదేవి ప్రకోపం.. ధారీదేవి ఆగ్రహం వల్లే నింగివిరిగి నేలపై పడిందంటున్నారు అక్కడి స్థానికులు. కేదర్ నాథ్ స్మశానంలా మారడానికి, ఛార్ ధామ్ క్షేత్రాల్లో వేలాదిమంది చనిపోవడం.. అమ్మ ఆగ్రహించడం వల్లే అంటున్నారు..
ఎవరీ ధారీదేవి?
ఉత్తరాఖండ్ వాసులకు ఆరాధ్య దేవత ధారీదేవి. కాళీమాతకు మరో రూపమైన ధారీదేవి.. చార్ ధామ్ క్షేతార్లాకు నాయక. బద్రీనాథ్ కు శ్రీనగర్ కు వెళ్లే దారిలో కల్యాసౌర్ గ్రామంలో అలకానంద నది ఒడ్డున ఉంది ధారీదేవి ఆలయం. మూల విరాట్ పైన ఎలాంటి పైకప్పు ఉండకపోవడం ఇక్కడి విచిత్రం. చాలాసార్లు పైకప్పు ఏర్పాటు చేయడానికి స్థానికులు ప్రయత్నించినా, ఏదో రకంగా అది కూలిపోయేదట. దీంతో చుట్టూ ఆలయ నిర్మాణాలు చేశారు గానీ, అమ్మ విగ్రహంపై మాత్రం ఎలాంటి కప్పునూ ఏర్పాటు చేయలేదు. వర్షం పడేటప్పుడు ఆ జల్లులు నేరుగా తనపై పడాలని అమ్మ కోరుకున్నందుకే ఇలా జరుగిందన్నది స్థానికుల విశ్వాసం.
ఈ ఆలయంలో ధారీదేవి పైభాగం మాత్రమే కనిపిస్తుంది. కిందిభాగం గుప్తకాశీలోని కాళీమందిర్ లో ఉంటుంది. ఈ రెండుక్షేత్రాలను దర్శించుకుంటేనే యాత్ర సంపూర్ణమవుతుందన్నది భక్తుల నమ్మకం. అయితే అలకానందపై హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. మన రాష్ట్రానికి చెందిన జీవీకే సంస్థ అనుబంధ కంపెనీ అలకానంద హైడ్రో పవర్ కంపెనీ 330 మెగావాట్ల విద్యుత్ కేంద్ర నిర్మాణానికి సిద్ధమయ్యింది. స్థానికులు, బీజేపీ నేతలు, సాధువులు వ్యతిరేకిస్తుండడంతో చాలాకాలంగా పనులు అటకెక్కడం లేదు. ఆ డ్యామ్ నిర్మిస్తే ధారాదేవి క్షేత్రం నీటమునుగుతుందని అంతా ఆందోళన చేస్తున్నారు. దీంతో, ఆ విగ్రహాన్నే తరలించడానికి పవర్ ప్రాజెక్ట్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర పర్యావరణ శాఖ, స్థానికులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పర్యావరణ శాఖ సుప్రీంకోర్టులోనూ అఫిడవిట్ దాఖలుచేసింది. అయితే, ప్రాజెక్టు నిర్మాణానికి అనుగుణంగా , నీటిలో మునగనంత ఎత్తున ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసి దానిపైకి విగ్రహాన్ని తరలించుకోవచ్చంటూ తాత్కాలికంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తుది నిర్ణయాన్ని వాయిదా వేసింది. విగ్రహాన్ని తరలించడాన్ని స్థానికులు అడ్డుకుంటామని హెచ్చరించడంతో, ప్రాజెక్టు అధికారులు వ్యూహాత్మకంగా డ్యామ్ లో నీటిమట్టాన్ని పెంచుతూ వచ్చారు. దీంతో, క్షేత్రం మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. విగ్రహం మునిగిపోతుందంటూ హడావుడి చేసి, జూన్ 16, ఆదివారం రాత్రి 7.30కు ధారీదేవి పైభాగాన్ని పెకిలించి, ఎత్తున నిర్మించిన ప్లాట్ ఫామ్ పైకి మార్చారు. ఇలా విగ్రహాన్ని మార్చుతున్న సమయంలోనే ఆకాశంలో ఉరుములు, మెరుపులు విపరీతంగా వచ్చాయట. కొద్దిసేపటికే భారీ వర్షం మొదలయ్యింది. హిమాలయాలు విరుచుకుపడడం, భారీగా వరద పోటెత్తడంతో కేదర్ నాథ్ క్షేత్రం నేలమట్టమయ్యింది. అమ్మ ప్రకోపించడం వల్లే ఇంతటి విపత్తు సంభవించిందంటున్నారు. వందలాది భవనాలు నామరూపాల్లేకుండా పోయినా, వేలాదిమంది కొట్టుకు పోయినా కేదర్ నాథ్ ఆలయం మాత్రం చెక్కుచెదరకుండా ఉండడానికి, ఆలయంలోని శివలింగం బురదలో కూరుకుపోకుండడానికి (పూజకోసం తెచ్చిన బిల్వ పత్రాలు శివలింగాన్ని కప్పిఉంచాయట) అమ్మ మహిమే అంటున్నారు స్థానికులు. ఇక విగ్రహాన్ని ఉంచడానికి కొత్తగా నిర్మించిన నాలుగు పిల్లర్లలో రెండు పిల్లర్లు కూలిపోయాయి. దీంతో ఆ స్థానం నుంచి విగ్రహాన్ని తీసివేసి, మరో చోట తాత్కాలికంగా ఉంచారు. 1882లోనూ ఓ సారి ధారాదేవిని ఈ స్థానం నుంచి తరలించడానికి స్థానిక రాజు ప్రయత్నించారట. అప్పుడూ ఇదే తరహాలో భారీగా వరదలు వచ్చాయంటున్నారు సాధువులు. ఇప్పుడు కూడా ధారీదేవిని తరలించినందువల్లే ఉత్తరాఖండ్ లో మరోసారి భారీగా వరదలు వచ్చాయంటున్నారు.
ఇదంతా ధారీదేవి ప్రకోపమా కాదా అన్నది పక్కన పెడితే, ప్రకృతి ప్రకోపం అన్నది మాత్రం వాస్తవం. ప్రకృతికి ప్రతీకైన ధారీదేవి ఆగ్రహం. సహజసిద్ధమైన హిమాలయాల్లో సాగుతున్న విధ్వంసకార్యక్రమాల వల్లే ఇంత పెద్ద విపత్తు వచ్చిందంటున్నారు పర్యావరణ వేత్తలు, లెక్కకు మిక్కిలిగా హైడ్రో ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం, కొండలను తవ్వేయడం, ఓక్ చెట్లను విపరీతంగా నరికివేయడంతోనే, వరద పోటెత్తిందంటున్నారు. డిసెంబర్ 2012లో కేంద్ర పర్యావరణ శాఖ గౌముఖ్ నుంచి ఉత్తరకాశీ వరకూ, భాగీరథీ నదీ తీరంలోని దాదాపు 135 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటించింది. దీనిప్రకారం ఈ ప్రాంతంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు, పర్యావరణానికి హానిచేసే నిర్మాణాలు చేయకూడదు. కానీ, దీన్ని ఏమాత్రం ఒప్పుకోని ఉత్తరాఖండ్ ప్రభుత్వం, అడ్డగోలుగా ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తోంది.
26, జూన్ 2013, బుధవారం
ధారీదేవి ప్రకోపం వల్లే ప్రళయం వచ్చిందా..?
Categories :
ALAKANANDA . DHARI DEVI . flood . GVK . HYDRO POWER PROJECT . kedarnath . news . TOP . UTHARAKAND
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి