టీజేఏసీ నిర్వహించిన ఛలో అసెంబ్లీ ఉద్రిక్తతల మధ్య సాగింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు ఈ సారి మాత్రం ఎంతో వ్యూహాత్మకంగా, మరెంతో పకడ్బందీగా వ్యవహరించగలిగారు. ముఖ్యంగా జిల్లాల నుంచే జనాన్ని హైదరాబాద్ కు రాకుండా అడ్డుకోవడంలో పోలీసులు సక్సెస్ కావడంతో, ఛలో అసెంబ్లీ ప్రభావం హైదరాబాద్ పై పెద్దగా పడలేదు. ఇక ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు, ఇనుప కంచెలు వేసి రోడ్లు మూసేయడంతో సామాన్యజనం మాత్రం తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఎక్కడికక్కడ మోహరించినా, కొంతమంది మాత్రం వారి కళ్లు గప్పి అసెంబ్లీ వరకూ చేరుకోగలిగారు. వీరిని అసెంబ్లీ సమీపంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణ వాదులు పెద్దగా హైదరాబాద్ కు రాలేకపోవడంతో, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలే ఆందోళనకారుల పాత్ర పోషించారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు దగ్గర సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టారు. కావేటి సమ్మయ్య, వినయ్ భాస్కర్ లు టీఆర్ఎస్ ఎల్పీ భవనంపైకి ఎక్కి కాసేపు ఆందోళన చేశారు. రెండో గేటు దగ్గర నాగం, బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. సభవాయిదా పడినా బయటకు రాకుండా స్పీకర్ పోడియం దగ్గరే బైఠాయించిన టీటీడీపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు తరలించారు. అనంతరం వీరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అసెంబ్లీ బయట ఆందోళన చేయబోయిన కేటీఆర్, హరీశ్ రావు, విజయశాంతి, ఎంపీలు వివేక్, మందాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందిరా పార్క్ దగ్గర కేసీఆర్ కుమార్తె కవితను, అశోక్ నగర్ దగ్గర కోదండరామ్ ను, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ నేత శ్రావణ్ తో పోలీసులు అనుచితంగా ప్రవర్తించడంతో, ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బషీర్ భాగ్ ప్రాంతంలో ఆందోళనకు దిగిన న్యూడెమోక్రసీ, ఇతర పార్టీల నేతలను పోలీసులు ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసి ఉద్రిక్తతలను తగ్గించగలిగారు.
మొత్తం మీద పోలీసులు తమ వ్యూహాలతో అసెంబ్లీ ముట్టడిని కట్టడి చేయగలిగారు. టీజేఏసీ గతంలో చేసిన ఆందోళనలతో పోల్చితే ఈసారి పకడ్బందీగా నిర్వహించలేకపోయింది. హోంమంత్రి కూడా లేకపోవడంతో, సీఎం అన్నీ తానై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ, పోలీసులు పట్టు సడలించకుండా చూసుకోగలిగారు. దీంతో ఛలో అసెంబ్లీని భగ్నంచేయడంలో పోలీసులు విజయం సాధించగలిగారు.
ఉస్మానియాలో మాత్రం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విద్యార్థులు యూనివర్సిటీ గేటు దాటి రావడానికి ప్రయత్నించడం, వారిని పోలీసులు అడ్డుకోవడంతో యుద్ధవాతావరణం నెలకొంది. పోలీసులపైకి విద్యార్థులు రాళ్లదాడి చేయగా, బాష్పవాయువును ప్రయోగించారు పోలీసులు. రబ్బర్ బుల్లెట్ల వాడకం, కాల్పులకు పోలీసులు ఈ సారి దూరంగా ఉండడంతో, ఛలో అసెంబ్లీలో హింసాత్మక సంఘటనలేవీ చోటు చేసుకోలేదు.
14, జూన్ 2013, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి